“ప్రభుత్వం నిద్రపోకూడదని నా అభ్యర్ధన..”

అది అసమానమైన హౌషాబాయి పాటిల్, అగ్గిబరాటా,  స్వాతంత్య్ర  సమరయోధురాలు, ఆకర్షణీయమైన నాయకురాలు, రైతులు, పేదలు,  అట్టడుగున ఉన్నవారికి అజేయమైన న్యాయవాది. ఆమె గురించిన ఈ మాటలు నవంబర్ 2018 లో పార్లమెంట్‌లో రైతుల భారీ మార్చ్‌కు ఆమె పంపిన వీడియో సందేశంలో ఉన్నాయి.

“రైతులకు వారు పండించిన పంటలకు సరైన ధరను అందించాలి”  అని వీడియో లో ఆమె గర్జించింది. “ ఈ న్యాయం కోసం నేనే అక్కడికి వస్తాను,” మార్చ్ లో జరిగిన కవాతులో కలుస్తాను, అని ఆమె నిరసనకారులకు చెప్పింది. కానీ అప్పటికే ఆమెకు 93 ఏళ్ళు, పైగా ఆమె ఆరోగ్యం కూడా బాలేదు. “నిద్రపోకుండా లేచి పేదల కొరకు పని చేయమ”ని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

సెప్టెంబర్ 23, 2021న, ఎప్పుడు అప్రమత్తంగా ఉండే హౌషబాయి, 95 ఏళ్ళు  వచ్చాక చివరి  నిద్రలోకి  ప్రవేశించింది. ఆమెను ఎంతగా కోల్పోయామో.

1943 మరియు 1946 మధ్య, హౌషాబాయి (తరచుగా హౌషాతాయ్ అని పిలుస్తారు; 'తాయ్' అన్నది మరాఠీలో ఒక అక్కకు గౌరవప్రదమైన సూచన) బ్రిటిష్ రైళ్లపై దాడి చేసిన, పోలీసు ఆయుధాలను దోచుకున్న, బ్రిటిష్ రాజ్ పరిపాలన ప్రయోజనాల కోసం న్యాయస్థానాలుగా కూడా ఉపయోగించిబడిన డాక్ బంగ్లాలను తగలబెట్టిన విప్లవకారుల బృందాలలో భాగమైంది.. ఆమె తూఫాన్ సేన ('సుడిగాలి సైన్యం') తో కలిసి పనిచేసింది, ‘తుఫాన్ సేన’, 1943 లో బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్య్రం  ప్రకటించిన సతారా భూగర్భ తాత్కాలిక ప్రభుత్వం అయిన ప్రతి సర్కార్ కు సాయుధ విభాగంగా పనిచేసింది.

1944 లో ఆమె గోవాలోని ఒక అండర్గ్రౌండ్ చర్యలో భాగం పంచుకుంది. అప్పటిలో గోవా పోర్చుగీస్ ప్రభుత్వ పాలనలో ఉండేది. ఆమె మండోవి నది మీద  ఒక చెక్కపెట్టెపై పడుకుని, పక్కనే ఆమెతో ఉన్న కామ్రేడ్లు ఈదుకుంటూ వస్తుండగా నదిపై తేలుతూ వెళ్లింది. కానీ ఆమె మళ్లీ మళ్లీ చెప్పేది, “నేను ఈ పోరాటాలలో చాలా చిన్న పని చేశాను...పెద్ద గొప్ప పనులేమీ కావు.” ఆమె గురించి ఇక్కడ వినండి- ఇది నాకు నచ్చిన కథనాల్లో ఒకటి: కీర్తించబడని హౌషాబాయి ధీరత్వం

బ్రిటిష్ రైళ్లపై దాడి చేసిన, పోలీసు ఆయుధాలను కొల్లగొట్టిన, డాక్ బంగ్లాలను తగలబెట్టిన విప్లవకారుల బృందాలలో హౌషాబాయి కూడా  భాగమే

వీడియో చూడండి: ‘ప్రభుత్వం నిద్రపోకుండా పనిచెయ్యమని నా అభ్యర్ధన’

ఆమె చనిపోయిన రోజే ఆమె గురించి నేను జర్నలిజం విద్యార్థులతో మాట్లాడాను. అప్పటి ధీర నాయకులను దోచుకున్న తరం ఇది.  ఇక్కడున్న ఈమె నిజమైన దేశభక్తురాలు. ఈనాటి వేదికల పై వేలాడుతూ నాటకాలు సాగిస్తున్న కల్తీ నాయకులలా కాదు. ఈమె దేశభక్తి, దేశప్రజలను కూడగట్టి  బ్రిటిష్ వారి సామ్రాజ్యవాదం నుండి విడుదల పొందడానికి ఇంధనమైంది, అంతేగాని వారిని మతం పేరిట, కులం పేరిట విడదీయడానికి కాదు. ఇది ఆశాజనకమైన లౌకిక స్ఫూర్తితో ఏర్పడింది, ద్వేషంతో కాదు. ఈమె మతోన్మాది  కాదు, క్షేత్రస్థాయి స్వాతంత్య్ర నారి.

నేను ఆమెను చేసిన ఇంటర్వ్యూ ఎన్నటికీ మర్చిపోలేను. అంతా అయ్యాక ఆమె నన్ను అడిగింది, “అయితే ఇప్పుడు నన్ను తీసుకెళ్తున్నారా?”

“కానీ ఎక్కడికి, హౌషాబాయి ?

“ PARI లో మీ అందరితో పని చేయడానికి”, అంది ఆమె నవ్వుతూ..

ప్రస్తుతం నేను,  ‘క్షేత్రస్థాయి స్వాతంత్య్ర యోధులు: భారతదేశ స్వాతంత్య్ర సమరంలోని ఆఖరు ధీర నాయకులు ’ అనే పుస్తకం పై పని చేస్తున్నాను. ఇందులో హౌషాతాయి అద్భుతమైన అనుభవాల గురించి ఒక కథనం ఉంది. కానీ ఆమె ఆ  కథనాన్ని ఎప్పటికీ చదవలేదనే విషయం నన్ను దుఃఖంలో ముంచేస్తోంది.

అనువాదం: అపర్ణ తోట

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Other stories by Aparna Thota