గోధుమ పంటకు నీళ్లు పట్టే సమయం వచ్చింది. సబరణ్ సింగ్ తన వ్యవసాయ భూమిలో ఈ కీలకమైన దశకు వెళ్ళకుండా ఉండలేకపోయా రు. అందుకే అతను డిసెంబర్ మొదటి వారంలో హరియాణా-ఢిల్లీ సరిహద్దులోని సింఘు నుండి పంజాబ్‌లోని తన ఊరికి తిరిగి వెళ్ళా రు.

కానీ నవంబర్ 26 నుండి నిరసన స్థలంలో స్థిరంగా ఉన్న అతను ఆ స్థలాన్ని వదిలిపెట్టి పొవట్లేదు. కొన్ని రోజుల తర్వాత, దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖంట్ గ్రామంలోని తన 12 ఎకరాల పొలం నుండి సింఘు వద్దకు తిరిగి వచ్చారు.  “నేను మాత్రమే అలా చేయట్లేదు.  ఇక్కడ చాలా మంది తమ ఊరికి నిరసన ప్రదేశానికి మధ్య తిరుగుతూనేవున్నారు." అని ఆ 70 ఏళ్ల రైతు చెబుతున్నారు.

రైతులు రూపొందించిన రిలే సింఘు వద్ద వాళ్ళ సంఖ్యను బలంగా ఉంచుతుంది. అదే సమయంలో తమ ఊరిలోని పొలాల్ని నిర్లక్ష్యం చేయకుండా ఉంచుతుంది.

"ఇది మేము గోధుమను పండించడం ప్రారంభించే సమయం" అని నవంబర్-డిసెంబర్ కాలాన్ని ప్రస్తావిస్తూ సబరణ్ చెప్పారు. "నేను లేనప్పుడు మా ఊరికి చెందిన నా స్నేహితులు కొందరు నా స్థానంలో సింఘు వద్దకు వచ్చారు."

అనేక మంది నిరసనకారులు ఈ ఉద్యమ నమూనాని అనుసరించారు. "మాలో చాలా మందికి నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయి," అని మాజీ సైనికుడు కూడా అయిన సబరణ్ చెప్పారు. “ఇవి ఇక్కడి నుండి మా ఊర్లకు అటూ ఇటూ వెళ్తూనే ఉంటాయి. కానీ ఈ కార్లు ఎప్పుడూ ఖాళీగా ఉండవు. నలుగురిని ఊర్లో దింపుతుంటే, మరో నలుగురు అదే కార్లో తిరిగి ఇక్కడకు వస్తున్నారు.".

'The cars keep going back and forth from here to our villages. If four people are dropped there, four others come back in the same car', says Sabaran Singh
PHOTO • Parth M.N.
'The cars keep going back and forth from here to our villages. If four people are dropped there, four others come back in the same car', says Sabaran Singh
PHOTO • Parth M.N.

'ఇక్కడి నుండి మా ఊళ్ళకు కార్లు వస్తూ పోతూనే ఉంటాయి. నలుగురిని ఊర్లో దింపుతుంటే, మరో నలుగురు అదే కార్లో తిరిగి ఇక్కడకు వస్తున్నారు.' అన్నారు సబరణ్ సింగ్

సెప్టెంబరు 2020లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నవంబర్ 26 నుండి వేల మంది రైతులు నిరసనలు చేస్తున్న దేశ రాజధానిలో, ఇంకా చుట్టుపక్కల ఉన్న అనేక నిరసన ప్రదేశాల్లో ఒకటైన సింఘుకి వాళ్ళు తిరిగొస్తారు

హరియాణా సరిహద్దు వెంబడి ఉన్న ఉత్తర ఢిల్లీలోని సింఘులో జరుగుతున్న నిరసన అతి పెద్దది- ఇక్కడ ముప్పైవేల మంది పైనే రైతులు స్థిరంగా నిలిచి ఉన్నారు. ఆ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు నిరసనను కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నారు.

సబరణ్ డిసెంబర్ ప్రారంభంలో ఫతేఘర్ సాహిబ్ జిల్లా, ఖమానోన్ తహసీల్‌లోని తన ఊరికి వెళ్ళాక, ఒక వివాహానికి హాజరై, బ్యాంకు పనులను పూర్తి చేసుకొని, కొన్ని శుభ్రమైన ఉతికిన బట్టలను సర్దుకున్నారు. "మాకు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి," తన ట్రక్కులో ఒక పరుపు కింద పొరలుగా ఉంచిన ఎండుగడ్డిని చూపిస్తూ చెప్పారతను. "ఇది మాకు వెచ్చగా ఉండటానికి సహాయపడుతుంది. అదనంగా విద్యుత్, నీళ్లు, దుప్పట్లు ఉన్నాయి. బాత్‌రూమ్‌లు కూడా సమస్య కాదు. మాకు ఆరు నెలలకు పైనే సరిపడా ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి."

గోధుమలు, వరి సాగుచేసే వ్యక్తిగా, రాష్ట్ర నియంత్రణలో ఉన్న మండీలను తమ అధికారం కిందకు తెచ్చుకునే చట్టం తో సబరణ్ ప్రత్యేకించి అసౌకర్యంగా ఉన్నారు. ఈ మండీల నుండి ప్రభుత్వం MSP (కనీస మద్దతు ధర) వద్ద పంటలను సేకరిస్తుంది. పంజాబ్, హరియాణాలలో గోధుమలు, బియ్యం సేకరణ దేశంలోని ఇతర ప్రాంతాల కంటే చాలా సమర్థవంతంగా ఉంది. ఈ ప్రాంతాల్లోని రైతులే ప్రధానంగా ఈ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడానికి ఇది ఒక కారణం. "ప్రైవేట్ కంపెనీలు వచ్చిన మరుక్షణం వాళ్లకి గుత్తాధిపత్యం వచ్చేస్తుంది," అని సబరణ్ చెప్పారు. "రైతులకు మాట్లాడే అవకాశం ఉండదు, పెద్ద సంస్థలు ఈ చట్టాలతో నిబంధనలను నిర్దేశిస్తాయి."

Left: Hardeep Kaur (second from left) says, 'We will go back  for a while when he [an employee looking after their farmland] needs us there. We will be replaced by someone here for that duration'. Right: Entire families at Singhu are engaged in this rotation
PHOTO • Parth M.N.
Left: Hardeep Kaur (second from left) says, 'We will go back  for a while when he [an employee looking after their farmland] needs us there. We will be replaced by someone here for that duration'. Right: Entire families at Singhu are engaged in this rotation
PHOTO • Parth M.N.

ఎడమ : హర్దీప్ కౌర్ ( ఎడమవైపు నుండి రెండవవారు ) ఇలా చెప్పారు : ' అతనికి [ వారి వ్యవసాయ భూమిని చూస్తున్న ఒక ఉద్యోగి ] అక్కడ మా అవసరం ఉంటే , మేము వెనక్కి వెళ్తాము . మేమిక్కడ ఉండని ఆ సమయంలో ఎవరో ఒకరు మాకు బదులుగా వచ్చి చేరతారు . కుడి : సింఘు వద్ద కుటుంబాలన్నీ ఈ రొటేషన్‌ను పాటిస్తున్నాయి

ఈ చట్టాలను మొదట జూన్ 5, 2020న ఆర్డినెన్స్‌లుగా ఆమోదించి, తర్వాత సెప్టెంబర్ 14న పార్లమెంట్‌లో వ్యవసాయ బిల్లులుగా ప్రవేశపెట్టి, ఆ తర్వాత అదే నెల 20న హడావిడిగా చట్టాలుగా అమలులోకి తెచ్చారు. రైతులపై, వ్యవసాయంపై మరింత ఎక్కువ అధికారాన్ని చెలాయించడానికి పెద్ద కార్పొరేట్‌లకు ఆస్కారం ఇచ్చేలా ఉండడం వల్ల రైతులు ఈ చట్టాలను తమ జీవనోపాధికి ప్రమాదంగా చూస్తున్నారు. వ్యవసాయదారులకు మద్దతు ఇచ్చే ప్రధాన ఉపకారణాలైన కనీస మద్దతు ధర (MSP), వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీలు (APMCలు), రాష్ట్ర సేకరణతో పాటు మరిన్నిటిని ఈ చట్టాలు బలహీనపరుస్తాయి

ధరల హామీ, వ్యవసాయ సేవలపై రైతుల (సాధికారత, రక్షణ) ఒప్పంద చట్టం, 2020 [Farmers (Empowerment and Protection) Agreement on Price Assurance and Farm Services Act, 2020] ; రైతుల ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రోత్సాహక, సులభతర) చట్టం, 2020 [the Farmers’ Produce Trade and Commerce (Promotion and Facilitation) Act , 2020]; అత్యవసర సరకుల (సవరణ) చట్టం, 2020 [Essential Commodities (Amendment) Act, 2020] ఈ మూడు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేపట్టారు. ఈ చట్టాల ప్రభావం దేశ ప్రజలందరిపైనా పడుతుందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇవి భారత రాజ్యాంగంలోని 32వ అధికరణాన్ని బలహీనపర్చడం ద్వారా దేశ పౌరులకు చట్టపరమైన ఉపశమనం పొందే హక్కును అందకుండా చేస్తాయి

“యే లూటెరోంకీ సర్కార్ హై (ఇది దోపిడీదారుల ప్రభుత్వం),” అని సబరణ్ అన్నారు. “రాబోయే రోజుల్లో మరింత మంది రైతులు మాతో చేరతారు. నిరసనలు ఇంకా పెద్ద ఎత్తున జరుగుతాయి."

ఇటీవల చేరిన వాళ్లలో 62 ఏళ్ల హర్దీప్ కౌర్ ఉన్నారు, ఆమె డిసెంబర్ మూడో వారంలో సింఘుకి వచ్చారు. "నా పిల్లలు నిరసనలలో చేరమని నాకు చెప్పారు," అన్నారామె. హర్దీప్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఒక మంచం మీద కూర్చొని ఉన్నారు. వాళ్ళంతా తీవ్రమైన ఉత్తరాది చలి నుంచి రక్షణగా శాలువాలు కప్పుకొని ఉన్నారు.

కౌర్, సింఘు నుండి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లూథియానా జిల్లా, జగరాఁవ్ తహసిల్‌ లోని చక్కర్ గ్రామం నుండి ఇక్కడికి వచ్చారు. ఆమె పిల్లలు ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. అక్కడ ఆమె కుమార్తె నర్సుగా, కుమారుడు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. "వారు వార్తలను క్రమం తప్పకుండా ఫాలో అవుతుంటారు. దీనిలో భాగం కావాలని వారు మమ్మల్ని ప్రోత్సహించారు. మేం ఇక్కడ ఉండాలని నిర్ణయించుకున్న తర్వాత ఇక మేము కరోనా గురించి చింతించడం లేదు.

కోవిడ్‌-19 కంటే ప్రమాదకరమైన వైరస్‌ ప్రధాని నరేంద్ర మోదీ అని నిరసన స్థలంలో ఉన్న పోస్టర్లలో రాసి ఉంది.

PHOTO • Parth M.N.

సింఘు వద్ద కనిపించకపోయినప్పటికీ ఊళ్లలో ఉన్న రైతుల, సహాయకుల బ్యాకప్ సైన్యాలు కూడా నిరసనకారులే అని శంశేర్ సింగ్ ( పైన ఎడమ వైపు, మధ్యలో) ఎత్తి చూపారు

కౌర్, ఆమె భర్త జోరా సింగ్ ప్రదేశానికి వచ్చినపుడు  వాళ్ళ 12 ఎకరాల వ్యవసాయ భూమిని ఒక ఉద్యోగి చూసుకుంటున్నాడు, వాళ్ళక్కడ వరి, గోధుమలు పండిస్తున్నారు. "మేము ఊర్లో ఉండాల్సిన అవసరం వచ్చినప్పుడు కొంతకాలం పాటు తిరిగి వెళ్తాము" అని ఆమె చెప్పారు. “ఆ వ్యవధిలో మా స్థానాన్ని (సింఘు దగ్గర) ఎవరైనా భర్తీ చేస్తారు. మేము ఇంటికి తిరిగి వెళ్ళడానికి కారు అద్దెకు తీసుకుంటాము. ఆ కారు ఊరి నుండి ఎవరో ఒకరిని ఇక్కడకు తీసుకొస్తుంది.“

కారు అద్దెకు తీసుకునే స్థోమత లేని వాళ్ళు బస్సుల్లో తిరుగుతున్నారు. రైతులు తమ ట్రాక్టర్-ట్రాలీలను నిరసన స్థలాలకు కూడా తీసుకువచ్చారు, కానీ ఇవి ఎక్కడికీ వెళ్లట్లేదని ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలోని శివపురి గ్రామానికి చెందిన నాలుగు ఎకరాల భూమి ఉన్న 36 ఏళ్ల చెఱకు రైతు శంశేర్ సింగ్ చెప్పారు. "మేము యుద్ధభూమిని విడిచిపెట్టలేదనడానికి ట్రాక్టర్లు సూచిక," అని అతను చెప్పారు. "అవి సింఘులోనే ఉంటాయి."

శంశేర్ సింఘులో ఉండగా, అతని ఊర్లో చెఱకు కోస్తున్నారు. "నేను ఇంకొన్ని రోజులు ఇక్కడుంటాను.నేనిక్కడనుంచి వెళ్ళిన వెంటనే నా తమ్ముడు నా స్థానంలోకి వస్తాడు. అతను ప్రస్తుతం చెఱకు కోస్తున్నాడు. వ్యవసాయం ఎవరి కోసం ఎదురుచూడదు. పని కొనసాగాల్సిందే. ”

సింఘు వద్ద కనిపించకపోయినప్పటికీ ఊళ్లలో ఉన్న రైతుల, సహాయకుల బ్యాకప్ సైన్యాలు కూడా నిరసనకారులే అని శంశేర్ సింగ్  ఎత్తి చూపారు. "నిరసనలో పాల్గొనడానికి చాలా మంది తమ ఇళ్లను విడిచిపెట్టారు," అని ఆయన అన్నారు. “కానీ అందరికీ కుటుంబాలు గానీ పొలాలను చూసుకోవడానికి సహాయం చేసేవాళ్ళు గానీ లేరు. కాబట్టి ఊర్లోనే ఉండిపోయిన వాళ్ళు రెట్టింపు పని చేస్తున్నారు, (తమ సొంత భూమితో పాటుగా) సింఘు లేదా ఇతర నిరసన ప్రదేశాలలో ఉన్న వాళ్ళ భూమిని కూడా సాగు చేస్తున్నారు. ఈ నిరసనల్లో వాళ్ళు కూడా భాగమే. వాళ్ళు నిరసన స్థలాల్లో భౌతికంగా లేరంతే."

అనువాదం: దీప్తి

Parth M.N.

Parth M.N. is a 2017 PARI Fellow and an independent journalist reporting for various news websites. He loves cricket and travelling.

Other stories by Parth M.N.
Translator : Deepti

Deepti is a Social Activist. She likes to question.

Other stories by Deepti