చేతి మూడు వేళ్ళు, దీర్ఘ చతురస్రాకారంలో ఉండే తడి బట్ట, తేలికపాటి స్పర్శ. "నేను చాలా జాగ్రత్తగా ఉండాలి."

ఇక్కడ విజయ ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాలలో స్థానికంగా తయారుచేసే తీపి వంటకమైన పూతరేకుల తయారీ గురించి మాట్లాడుతున్నారు. జారుగా కలిపిన బియ్యపు పిండితో చేసిన పలుచని రేకుల లో బెల్లం పొడి, ముక్కలుగా చేసిన ఎండు ఫలాలు/గింజలు, నెయ్యితో నింపి చక్కగా మడిచి వీటిని తయారుచేస్తారు. ఇవి ఎక్కువగా పండుగల సమయంలో అమ్ముడవుతాయి. ఈ తీపిని తయారుచేయటంలో నైపుణ్యం కలిగిన విజయ ప్రతిరోజూ దాదాపు 200 రేకుల ను తయారుచేస్తారు. వాటిని స్థానికంగా ఉండే మిఠాయి దుకాణాలవారు తీసుకుంటారు. “నేను పూతరేకులు చేసేటప్పుడు పూర్తిగా ఆ పనిమీదే ఏకాగ్రత పెట్టాలి. నిజంగా ఎవరితోనూ మాట్లాడటానికి ఉండదు,” అని ఆమె PARIకి చెప్పారు.

పూతరేకులు లేకుండా నా ఇంట్లో జరిగే ఏ పండుగైనా, ఆచారమైనా, ఏదైనా ప్రత్యేక సందర్భమైనా పూర్తికాదు,” అంటారు జి. రామకృష్ణ. ఆత్రేయపురం నివాసి అయిన ఈయన ఆత్రేయపురంలోని కొన్ని దుకాణాలకు ప్యాకింగ్ సామగ్రిని, పెట్టెలను సరఫరా చేస్తుంటారు. “నాకు ఇదంటే చాలా ఇష్టం, ఇది చాలా ఆశ్చర్యకరమైన మిఠాయిలా తోస్తుంది! చూడగానే ఇదేదో కాగితంలాగా కనిపిస్తోంది, కాగితాన్ని తింటున్నామా అనుకుంటాం. కానీ ఒక్కసారి దాన్ని ఇలా కొరకగానే అది మీ నోటిలో కరిగిపోతుంది. ప్రపంచంలో ఇలాంటి మిఠాయి మరేదైనా ఉంటుందని నేననుకోను," సగర్వంగా ప్రకటించారాయన.

ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పండే బియ్యం వలన సున్నితంగా తయారయ్యే ఈ మిఠాయికి ఈ రుచి వస్తుంది. "ఈ బియ్యం జిగటగా ఉంటాయి, కాబట్టి రేకుల తయారీకి తప్ప ఎవరూ దీనిని ఉపయోగించరు" అని రామచంద్రపురం బ్లాక్‌లోని ఆత్రేయపురం గ్రామానికి చెందిన ఈ తీపిని తయారుచేసే కాయల విజయ కోట సత్యవతి చెప్పారు. ఈ ఆత్రేయపురంకు చెందిన పూతరేకులే 2023లో జియోగ్రాఫికల్ ఇండికేటర్ (జిఐ-భౌగోళిక సూచిక) ను అందుకున్నది. విశాఖపట్నంలోని సర్ ఆర్థర్ కాటన్ ఆత్రేయపురం పూతరేకుల తయారీదారుల సంక్షేమ సంఘానికి జూన్ 14, 2023న జిఐ లభించింది.

రాష్ట్రంలో జిఐ వచ్చిన ఆహార పదార్థాలలో పూతరేకు మూడవది (మిగిలినవి తిరుపతి లడ్డూ , బందరు లడ్డూ ). ఆంధ్రప్రదేశ్‌లో హస్తకళలు, ఆహార పదార్థాలు, వ్యవసాయం వంటి వివిధ కేటగిరీలకు చెందిన 21 ఉత్పత్తులకు జిఐ ఉంది. గత సంవత్సరం పూతరేకు తో పాటు గోవాకు చెందిన బెబింకా మిఠాయి కూడా జిఐ ట్యాగ్‌ను అందుకుంది. గతంలో మురేనాకు చెందిన గజక్ , ముజఫర్‌నగర్‌కు చెందిన గూర్‌ లకు కూడా జిఐ లభించింది.

Left: Vijaya’s works in a small corner of her house. She calls this her workspace. It’s filled with the inverted pot, rice batter, dry coconut leaves and an old pickle jar amongst other things.
PHOTO • Amrutha Kosuru
Right: Jaya biyyam is a special kind of rice is used to make poothareku . The rice is soaked for 30-45 minutes before grinding it into a batter that is used to make the thin films or rekulu.
PHOTO • Amrutha Kosuru

ఎడమ: తన ఇంటి చిన్న మూలలో పనిచేస్తోన్న విజయ. ఆమె దీన్ని తన పనిప్రదేశం అని పిలుస్తారు. ఇక్కడ బోర్లించిన ఒక కుండ, బియ్యం పిండి, ఎండు కొబ్బరి ఆకులు, ఇతర వస్తువులతో పాటు ఒక పాత ఊరగాయ జాడీ ఉంటాయి. కుడి: పూతరేకులు తయారుచేయడానికి జయా బియ్యం అనే ఒక ప్రత్యేక రకం బియ్యాన్ని ఉపయోగిస్తారు. ముందుగా ఈ బియ్యాన్ని 30-45 నిమిషాల పాటు నానబెట్టి, దానిని మెత్తని పిండిగా రుబ్బి సన్నటి పొరలుగా లేదా రేకులుగా తయారు చేయడానికి ఉపయోగిస్తారు

ఈ మిఠాయి తయారీలో పేరుపొందిన విజయ 2019 నుండి వీటిని తయారుచేస్తున్నారు. దీన్ని పూర్తి ఏకాగ్రతతో చేయాలని ఆమె చెప్పారు. "ఇతర మిఠాయిలను తయారుచేయటం సులభం కాబట్టి వాటిని చేసేటప్పుడు నేను జనంతో స్వేచ్ఛగా మాట్లాడగలను," తన కుటుంబ సభ్యుల కోసం సున్నుండలు, కోవా వంటి మిఠాయిలను తయారుచేసే విజయ అన్నారు. పొట్టుమినుములను వేయించి, మెత్తని పిండిగా విసిరి, అందులో పంచదార లేదా బెల్లం కలిపి, నేతిని పోసి లడ్డూలు గా చుట్టి సున్నుండల ను చేస్తారు.

“నేను నా కుటుంబానికీ, నాకూ సహాయంగా ఉండటానికి కొంత డబ్బు సంపాదించాలనుకున్నాను. నాకు ఇది తప్ప వేరే పనేదీ తెలియదు కాబట్టి ఇది చేస్తున్నాను,” మిఠాయి దుకాణాలకు తాను రేకుల ను అమ్మడాన్ని ఎలా మొదలుపెట్టారో వివరించారు విజయ. ఆమె అమ్మకం కోసం వేరే ఏ మిఠాయిలను తయారుచేయరు.

ప్రతి నెల మొదట్లో ఆమె స్థానిక మార్కెట్‌లో 50 కిలోల బియ్యాన్ని కొనుగోలు చేస్తారు. పూతరేకులు తయారుచేసేందుకు మాత్రమే ఉపయోగించే జయా బియ్యం ధర, కిలో రూ. 35. "ఈ బియ్యాన్ని వండితే అన్నం చాలా జిగటగా ఉంటుంది కాబట్టి రేకుల తయారీకి తప్ప దీనిని ఎవరూ ఉపయోగించరు," విజయ వివరించారు.

మిఠాయి తయారీ కోసం రోజూ ఉదయం 7 గంటలకు ఆమె రోజు మొదలవుతుంది. అరకిలో జయా బియ్యం తీసుకొని వాటిని కడిగి శుభ్రంచేసి, కనీసం 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టి ఉంచటంతో రేకులు తయారుచేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది.

తన కుమారులు బడికి వెళ్ళిన తర్వాత విజయ నానబెట్టిన బియ్యాన్ని మెత్తగా, చిక్కటి పిండిగా రుబ్బుతారు. ఆ రుబ్బిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇంటి బయట ఉన్న తన చిన్న వంటపాకలో చిన్న చెక్క ఎత్తుపీటపై ఉంచుతారు.

ఉదయం 9 గంటలకల్లా తన వంటపాకలోని ఒక మూలన విజయ ఒక పక్కన రంధ్రం ఉండి, బోర్లించిన ప్రత్యేకమైన కుండను ఉపయోగించి సున్నితమైన, సన్నని ఉల్లిపొరలాంటి రేకుల ను తయారుచేయడం ప్రారంభిస్తారు. “ఈ కుండను ఇక్కడ దొరికే మట్టితో ఈ ప్రాంతంలో మాత్రమే తయారుచేస్తారు. మరే ఇతర కుండను కానీ పాత్రను కానీ ఇందుకు ఉపయోగించలేం. రేకు కు ఆ బోర్లించినట్టుగా ఉండే ఆకారం ఈ కుండ వల్లనే ఏర్పడుతుంది,” అని ఆమె వివరించారు.

Left: Rice batter and the cloths used to make pootharekulu.
PHOTO • Amrutha Kosuru
Right: Vijaya begins making the reku by dipping a cloth in the rice batter she prepares
PHOTO • Amrutha Kosuru

ఎడమ: పూతరేకులు తయారుచేసేందుకు ఉపయోగించే బియ్యం పిండి, వస్త్రం. కుడి: జారుగా తయారుచేసిన బియ్యం పిండిలో బట్టను ముంచి రేకులను తయారుచేస్తోన్న విజయ

Veteran sweet maker, Vijaya has been making reku since 2019 and she says she always has to give it her full concentration. When she dips the cloth in the rice batter and lays it on the pot, a  film forms on the inverted pot (right)
PHOTO • Amrutha Kosuru
Veteran sweet maker, Vijaya has been making reku since 2019 and she says she always has to give it her full concentration. When she dips the cloth in the rice batter and lays it on the pot, a  film forms on the inverted pot (right)
PHOTO • Amrutha Kosuru

ఈ మిఠాయి తయారీలో పేరుపొందిన విజయ 2019 నుండి వీటిని తయారుచేస్తున్నారు. దీన్ని పూర్తి ఏకాగ్రతతో చేయాలని ఆమె అంటారు. బియ్యపు పిండిలో బట్టను ముంచి బోర్లించి ఉన్న కుండపై(కుడి) పరవగానే దానిపై ఒక సన్నని పొరగా రేకు ఏర్పడుతుంది

ఎండిన కొబ్బరి ఆకులను అంటించి కుండను వేడి చేస్తారు. “కొబ్బరి ఆకులు [ఇతర ఆకుల మాదిరిగా కాకుండా] త్వరగా అంటుకొని స్థిరంగా అధిక వేడిమిని ఉత్పత్తి చేస్తాయి. సరైన పాత్ర, వేడిమి లేకపోతే రేకులు ఏర్పడవు,” అంటారామె.

“ఈ కుండ ధర రూ. 300-400 ఉంటుంది. నేను ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి కుండను మార్చేస్తాను. అది అంతకంటే ఎక్కువ కాలం పనిచేయదు,” విజయ చెప్పారు. విజయ ప్రతి రెండు వారాలకు ఒకసారి స్థానిక మార్కెట్లలో కొబ్బరి మట్టలను కొనుగోలు చేస్తారు. ఒక్కో కట్ట ధర రూ. 20-30 వరకూ ఉండే 5-6 కట్టలను ఆమె కొంటారు.

బోర్లించిన కుండ వేడెక్కుతుండగా ఆమె పొడిగా ఉన్న ఒక శుభ్రమైన దీర్ఘచతురస్రాకారపు గుడ్డ ముక్కను తీసుకొని దాన్ని నీటిలో తడిపారు. ఇందుకోసం ఆమె ఒక నూలు గుడ్డ ముక్కను (ఆమె చీర లేదా ఏదైనా ఇతర దుస్తుల నుంచి తీసుకున్నది) ఉతికి ఉపయోగిస్తారు. కొంత పిండిని ఒక పెద్ద పళ్ళెంలో పోసి, కొంచం పలుచగా చేసి, గుడ్డను ఆ పిండిలో ముంచుతారు.

తర్వాత గుడ్డను మెల్లగా బయటకు తీసి, పలుచని పొరలాగా పిండి అంటుకున్న గుడ్డను బోర్లించిన కుండపైన పరిచి లాగేశారు. వెంటనే పొగలు విడుస్తూ ఒక సన్నని బూడిద-తెలుపు రంగు పొర కుండపై ఏర్పడింది. ఆ పొర పూర్తిగా ఉడికేంత వరకు కొన్ని సెకన్ల పాటు కుండను అంటుకునే వుంది.

ఆ తర్వాతి దశ కోమలమైన స్పర్శ కోసం పిలుపు. చేతి మూడు వేళ్ళను మాత్రమే ఉపయోగించి, ఆమె కుండ పైనుండి రేకు ను వేరు చేస్తారు. "దాన్ని కుండమీంచి తీయడం కష్టమైన భాగం. అది విరిగిపోతే ఇక పనికిరాదు. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి,” అంటూ విజయ నేర్పుగా రేకు ను తీసి తన పక్కనే ఉన్న రేకుల కుప్పపై ఉంచారు. ఒక గంటలో తాను 90-100 రేకులు చేయగలదని ఆమె అంచనా. దాదాపు రెండు మూడు గంటల్లో ఆమె 150-200 వరకూ చేస్తారు. పండుగలు రాబోయే ముందురోజుల్లో ఆర్డర్‌లు 500కి చేరుకుంటాయి, దాని ప్రకారం ఆమె పిండిని సిద్ధం చేసుకుంటారు.

Left: To check if the papery film of rice has formed, Vijaya attempts to nudge it slowly with her fingers.
PHOTO • Amrutha Kosuru
Right: Vijaya uses only a few fingers to separate the thinly formed film from the inverted pot
PHOTO • Amrutha Kosuru

ఎడమ: సన్నని బియ్యపు పొర ఏర్పడిందో లేదో తెలుసుకోడానికి, వేళ్ళతో నెమ్మదిగా తట్టి చూస్తోన్న విజయ. కుడి: బోర్లించిన కుండ మీద నుండి సన్నగా ఏర్పడిన రేకును వేరుచేయడానికి విజయ మూడు వేళ్ళను మాత్రమే ఉపయోగిస్తారు

Shyamala and Sathya working at KK Nethi Pootharekulu shop in Atreyapuram
PHOTO • Amrutha Kosuru
Shyamala and Sathya working at KK Nethi Pootharekulu shop in Atreyapuram
PHOTO • Amrutha Kosuru

ఆత్రేయపురంలోని కెకె నేతి పూతరేకుల దుకాణంలో పనిచేస్తోన్న శ్యామల, సత్య

ఆత్రేయపురంలో చాలామంది మహిళలు ఈ రేకులు తయారుచేస్తారు, కొంతమంది ఇళ్ళలోనూ మరికొంతమంది దుకాణాల్లో కూడా.

వి. శ్యామల(54) ఆత్రేయపురం బస్టాప్ సమీపంలోని కెకె నేతి పూతరేకుల దుకాణంలో పని చేస్తున్నారు. ఆ దుకాణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో నివసిస్తుండే ఆమె, గత 25-30 సంవత్సరాలుగా ఈ మిఠాయి తయారీ పనిలో ఉన్నారు. మొదట్లో శ్యామల కూడా విజయ లాగా ఇంట్లోనే రేకులు తయారుచేసేవారు. “నేను రోజుకు 100 రేకులు తయారు చేస్తే అందుకు రూ. 25-30 వరకూ వచ్చేవి,” అని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆమె ప్రధానంగా పూతరేకు తయారీ చివరి దశలో పాల్గొంటారు: చక్కెర, బెల్లం, ఎండు ఫలాలు, ధారాళంగా నెయ్యి వేసి రేకు ను మడతపెడతారు. "నాకు మోకాళ్ళ నొప్పులు," అని చెప్పిన శ్యామల ఇంటి నుండి తన పనిప్రదేశానికి నడవడం కష్టంగా ఉంటుందన్నారు. దాంతో ఆమె కొడుకు ప్రతిరోజూ ఆమెను దుకాణం దగ్గర దింపుతాడు.

కెకె నేతి పూతరేకులు దుకాణం వెనుక ఉన్న ఒక చిన్న సందులోకి రాగానే ఆమె, ఒక ఎత్తైన రేకు ఎత్తుపీటను దగ్గరకు లాక్కొని, తన చీరను సరిచేసుకుని, ఎండ తనను పెద్దగా ఇబ్బంది పెట్టని చోట చూసుకుని కూర్చుంటారు. రోడ్డుకు అభిముఖంగా కూర్చొని ఉండే ఆమె, ఆ వైపుగా వెళ్ళే కొనుగోలుదారులకు పూతరేకు ను చుడుతూ కనిపిస్తుంటారు.

శ్యామల తన పక్కన ఉన్న రేకుల కుప్పలో నుండి ఒక రేకు ను మెల్లగా తీసుకొని, దానికి ధారాళంగా నెయ్యి పూస్తారు. ఆపైన దాని మీద బెల్లం పొడిని చల్లుతారు. "సాదా పూతరేకు కోసం వాడే పదార్థాలు ఇంతే," అంటూ ఆమె దాని మీద మరో సగం రేకు ను ఉంచుతారు. అందులోని పదార్థాలేవీ బయటకు రాకుండా చూసుకుంటూ దాన్ని సున్నితంగా మడతపెడతారు. ఒక పూతరేకు ను చుట్టడానికి ఆమెకు ఒక నిమిషం కంటే కొంచెం ఎక్కువ సమయం పడుతోంది. సాంప్రదాయికంగా వాటిని పొడవైన దీర్ఘచతురస్రాకారంలో చుడతారు, అయితే సమోసా లాగా త్రిభుజాకారంలో కూడా వాటిని మడవవచ్చు.

సమోసా ఆకారంలో చుట్టిన ప్రతి పూతరేకు కు శ్యామలకు రూ. 3 అదనంగా లభిస్తాయి. " సమోసా ఆకారంలో చుట్టడం నాక్కూడా కష్టమే. చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే రేకు విరిగిపోతుంది," అంటారామె.

Shyamala folds a film of rice paper with dry fruits, jaggery powder and more to make a poothareku . First she gently flattens the film, spreads a few drops of sugar syrup and a then generous amount of ghee after which she adds dry fruits
PHOTO • Amrutha Kosuru
Shyamala folds a film of rice paper with dry fruits, jaggery powder and more to make a poothareku . First she gently flattens the film, spreads a few drops of sugar syrup and a then generous amount of ghee after which she adds dry fruits
PHOTO • Amrutha Kosuru

పూతరేకును తయారుచేసేందుకు ఎండు ఫలాల ముక్కలు, బెల్లం పొడి మొదలైనవి వేసి పలుచని బియ్యపు రేకును చుడుతోన్న శ్యామల. ముందుగా ఆమె రేకును మృదువుగా పరిచి, కొద్దిచుక్కల పంచదార పాకాన్ని, ఆపైన ధారాళంగా నేతిని చల్లి అప్పుడు ఎండుఫలాల ముక్కలను వేస్తారు

Shyamala (left) says, 'I have to be very careful or the reku will break.' Packed pootharekulu ready to be shipped
PHOTO • Amrutha Kosuru
Shyamala (left) says, 'I have to be very careful or the reku will break.' Packed pootharekulu ready to be shipped
PHOTO • Amrutha Kosuru

'నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే రేకు విరిగిపోతుంది," అంటోన్న శ్యామల (ఎడమ). రవాణా చేయటానికి సిద్ధంగా ఉన్న ప్యాక్ చేసిన పూతరేకులు

"నా ఉద్దేశంలో సాదా పంచదార లేదా బెల్లంతో చేసినదే అసలైన పూతరేకు . ఇదే మా గ్రామంలో తరం తర్వాత తరానికి అందిన తయారీ విధానం," ఎండు ఫలాల ముక్కలను చేర్చటం ఈ మధ్యకాలంలో వచ్చిన మార్పు అంటూ వివరించారు శ్యామల.

శ్యామల దుకాణం సొంతదారైన కాసాని నాగసత్యవతి (36)తో కలిసి, ఆదివారాలు తప్ప, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పనిచేస్తారు. ఆమె చేసే పనికి రోజుకు రూ. 400 చెల్లిస్తారు. గత మూడేళ్ళుగా, చివరకు పూతరేకు కు జిఐ ట్యాగ్ వచ్చిన తర్వాత కూడా, ఈ చెల్లించే మొత్తంలో మార్పు లేదు.

ఆత్రేయపురం పూతరేకు కు జిఐ ట్యాగ్ వచ్చిన తర్వాత కూడా విజయ, శ్యామల వంటి కార్మికులపై అది ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు. జిఐ ట్యాగ్ ఇచ్చినప్పటి నుండి వారి రోజువారీ వేతనం పెరగలేదు, కానీ దుకాణాల యజమానులు, ఇతర పెద్ద వ్యాపారులు మాత్రం మంచి లాభాలను ఆర్జిస్తున్నట్లు వాళ్ళు చెప్పారు.

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పూతరేకు ఎప్పటి నుంచో ప్రసిద్ధి చెందినదని సత్య చెప్పారు. "కానీ ఇప్పుడే ఎక్కువమందికి దాని గురించి తెలిసింది. ఇంతకుముందు ఇతర రాష్ట్రాల నుండి వచ్చినవారికి పూతరేకు అంటే ఏమిటో వివరించాల్సివచ్చేది. ఇప్పుడు దీనికి పరిచయం అవసరం లేదు,” అని ఆమె అన్నారు.

సర్ ఆర్థర్ కాటన్ ఆత్రేయపురం పూతరేకుల తయారీదారుల సంక్షేమ సంఘం సభ్యులలో సత్య కూడా ఒకరు. ఈ సంఘం గత 10 సంవత్సరాలుగా పూతరేకు కు జిఐ ట్యాగ్‌ రావాలని కోరుతోంది. జూన్ 2023లో వారికి ఆ ట్యాగ్‌ను ప్రదానం చేసినప్పుడు, “ఇది మొత్తం గ్రామం గర్వించదగిన క్షణం" అయింది.

Left: A reku formed over the inverted pot.
PHOTO • Amrutha Kosuru
Right: Sathya began her business in 2018
PHOTO • Amrutha Kosuru

ఎడమ: బోర్లించిన కుండపై తయారైన రేకు. కుడి: సత్య ఈ వ్యాపారాన్ని 2018లో ప్రారంభించారు

It’s the rice from  Dr. B.R. Ambedkar Konaseema district of AP that defines this delicately-fashioned sweet. 'Any festival, ritual, or any special occasion in my house is incomplete without pootharekulu, ' says G. Ramakrishna, a resident of Atreyapuram
PHOTO • Amrutha Kosuru
It’s the rice from  Dr. B.R. Ambedkar Konaseema district of AP that defines this delicately-fashioned sweet. 'Any festival, ritual, or any special occasion in my house is incomplete without pootharekulu, ' says G. Ramakrishna, a resident of Atreyapuram
PHOTO • Amrutha Kosuru

ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పండే బియ్యం వలన సున్నితంగా తయారయ్యే ఈ మిఠాయికి ఈ రుచి వస్తుంది. 'పూతరేకులు లేకుండా నా ఇంట్లో జరిగే ఏ పండుగైనా, ఆచారమైనా, ఏదైనా ప్రత్యేక సందర్భమైనా పూర్తికాదు,' అంటున్నారు ఆత్రేయపురం నివాసి జి.రామకృష్ణ

తన దుకాణంతో సహా అన్ని దుకాణాలకు ఆర్డర్ల సంఖ్య పెరిగిందని సత్య చెప్పారు. "మాకు చాలావరకు పెద్దమొత్తంలో, 10 పెట్టెల నుండి 100 పెట్టెల వరకు, ఆర్డర్లు వస్తాయి," అన్నారామె. ఒక్కో పెట్టెలో 10 పూతరేకులు ఉంటాయి.

"దిల్లీ, ముంబై, ఇంకా అనేక ఇతర ప్రాంతాల నుండి జనం మాకు ఆర్డర్ చేస్తారు. మా గ్రామంలో ఒక్కో పూతరేకు ధరను రూ. 10-12గా నిర్ణయిస్తాం. వాళ్ళు [బయటి ప్రాంతాలకు చెందిన పెద్ద దుకాణాలవాళ్ళు] ఒక్కోదానికి రూ. 30 కంటే ఎక్కువే వసూలు చేస్తారు," అని ఆమె వివరించారు.

"జిఐ ట్యాగ్ ఒచ్చినప్పటికీ ధరలో పెద్దగా మార్పు లేదు," అని సత్య చెప్పారు. “పదేళ్ళ క్రితం ఒక పూతరేకు ధర రూ. 7 అట్లా ఉండేది."

“గత వారం దుబాయ్ నుండి ఒక అమ్మాయి నా దుకాణానికి వచ్చింది. పూతరేకులు ఎలా తయారు చేస్తారో నేనామెకు చూపెట్టాను. అది చూసి ఆమె అబ్బురపడిపోయింది. తన నోటిలో ఆ మిఠాయి అలా ఎలా కరిగిపోయిందో ఆమె నమ్మలేకపోయింది. పూతరేకు తయారీ ఒక కళ అన్నదామె. నిజాయితీగా చెప్పాలంటే, నేను దాని గురించి అలా ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ ఇది నిజం. ఏడాది పొడవునా రేకులు తయారుచేసి, వాటిని అమిత చక్కగా, ఖచ్చితంగా మడతపెట్టడంలో మమ్మల్ని మించినవారు లేరు," అన్నారామె.

ఈ కథనానికి రంగ్ దే నుంచి గ్రాంట్ మద్దతు ఉంది.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Amrutha Kosuru

Amrutha Kosuru is a 2022 PARI Fellow. She is a graduate of the Asian College of Journalism and lives in Visakhapatnam.

Other stories by Amrutha Kosuru
Editor : PARI Desk

PARI Desk is the nerve centre of our editorial work. The team works with reporters, researchers, photographers, filmmakers and translators located across the country. The Desk supports and manages the production and publication of text, video, audio and research reports published by PARI.

Other stories by PARI Desk
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli