ఆగస్టు 13, 2024న, బుడ్డా నాలా కాలుష్య స్థితిపై తన ప్రతిస్పందనగా (PARI వద్ద ఆ కాపీ ఉంది), నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)కి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) సమాధానమిచ్చింది. నగరంలోని మూడు కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ల (CETPలు)లో “పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన పర్యావరణ క్లియరెన్స్లో నిర్దేశించబడిన షరతులకు అనుగుణంగా వ్యర్థాల శుద్ధీకరణ జరగడం లేదని గుర్తించినట్లు పేర్కొంది.
తత్ఫలితంగా, ఆగస్టు 12, 2024న, “పర్యావరణ పరిహారాన్ని విధించడంతోపాటు తగిన చర్యలు తీసుకోవాలని” PPCB కి ఆదేశాలు జారీ చేసినట్లు NGT కి CPCB తెలియజేసింది. బుడ్డా నాలాలో ప్రవహించే నీరు సాగుకు పనికిరాదని PPCB తన మునుపటి నివేదికలో అంగీకరించింది. “ఇది వ్యవసాయానికే పనికిరానప్పుడు తాగడానికి పనికొస్తుందని మీరు అనుకుంటున్నారా?” అని కార్యకర్తలు వాదించారు.
బుడ్డా నాలాను పూడ్చివేయాలన్న తమ ప్రణాళికను నిరసన మార్చ్ నిర్వాహకులు సెప్టెంబర్ 15న ఒక ఉమ్మడి ప్రకటనలో వెల్లడించారు, తర్వాత అది అక్టోబర్ 1, 2024కి వాయిదా పడింది. ఈ చివరి హెచ్చరిక తరువాత, సెప్టెంబర్ 25న, బుడ్డా నాలాలోకి మూడు CETPల నుండి శుద్ధి చేయబడిన వ్యర్థాల విడుదలను వెంటనే నిలిపివేయాలని PPCB ఆదేశించింది. అయితే, నివేదికల ప్రకారం, అటువంటి చర్య ఏదీ జరగలేదు.
అక్టోబర్ 1న, నాలాను పూడ్చి వేసే బదులు, లుధియాణాలోని ఫిరోజ్పూర్ రోడ్డులో, కార్యకర్తలు ఒక బైఠాయింపు నిర్వహించారు. డిసెంబర్ 3, 2024లోపు తగిన చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి అల్టిమేటం కూడా ఇచ్చారు.
“ప్రతీసారీ ఎవరో ఒకరు వచ్చి బుడ్డా నాలా నుండి శాంపిల్స్ తీసుకుంటారు కానీ, హుండా కుచ్ నహీ (ఏమీ జరగదు). ఈ కాలుష్యాన్నైనా అరికట్టాలి, లేదా మన తరవాతి తరం జీవించేలా స్వచ్ఛమైన నీటినైనా అందించాలి,” ప్రభుత్వ సర్వేలు, వాగ్దానాలతో విసిపోయిన బల్జీత్ కౌర్ అన్నారు.
అనువాదం: వై. క్రిష్ణ జ్యోతి