ఈ ప్యానెల్ కనిపించే పని, కనిపించని మహిళలు అనే ఛాయాచిత్ర ప్రదర్శన (ఫోటో ఎగ్జిబిషన్) లో భాగంగా ఉంది . ఈ ప్రదర్శన గ్రామీణప్రాంతాలలో మహిళలు చేసే ఉన్నతస్థాయి పనిని వర్ణించే ఫోటోల ఎగ్జిబిషన్. ఇందులోని ఛాయాచిత్రాలను పి. సాయినాథ్ 1993 నుండి 2002 మధ్యకాలంలో 10 భారతీయ రాష్ట్రాలలో పర్యటించి, తీశారు. అనేక సంవత్సరాల పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రదర్శించబడిన ఈ ఫోటో ఎగ్జిబిషన్ ను , PARI సృజనాత్మకంగా డిజిటలైజ్ చేసింది.
జీవితకాలం నడుంవంచడం
విజయనగరం. మండుతున్న మధ్యాహ్నపు ఎండవైపు ఆమె విసుగ్గా చూసి, చేస్తున్న పనిని ఆపింది. కానీ ఆమె అలా వంగిపోయే ఉండిపోయింది. కొన్ని క్షణాల్లోనే తాను మళ్ళీ పనిలోకి వంగాలని ఆమెకు బాగా తెలుసు.
ఆమె పనిచేస్తున్న జీడిమామిడి పొలాల్లోనే ఆమె గ్రామానికి చెందిన మరో రెండు సమూహాల మహిళలు పనిచేస్తున్నారు. ఒక సమూహం ఈ పొలానికి రెండు కిలోమీటర్ల దూరాన ఉన్న పొలానికి మధ్యాహ్న భోజనం, నీరు తీసుకుని వెళ్లింది. మరో సమూహం వీరికి వ్యతిరేక దిశలో పని చేస్తోంది. అందరూ వీపులు వంచే పనిచేస్తున్నారు.
ఒడిశాలోని రాయగడలో మగవాళ్ళు కూడా పొలాల్లో కనిపించారు. కెమెరా లెన్స్ లోంచి చూస్తోంటే ఆ దృశ్యం మరింత అద్భుతంగా ఉంది! మగవాళ్ళంతా నిలబడి ఉన్నారు. ఆడవాళ్ళంతా నడుం వంచి పనిచేస్తున్నారు. ఒడిశాలోని నువాపడాలో కురుస్తోన్న వాన ఆ మహిళను కలుపు తీయకుండా ఆపలేదు. ఆమె ఒక గొడుగు నీడలో నడుము వంచి పనిచేసుకుంటూపోయింది.








