నెలల తరబడి ఉడికించిన భరించరాని వేడిమి తర్వాత మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతంలోకి ఎట్టకేలకు చలికాలం ప్రవేశించింది. తన విధి నిర్వహణలో భాగంగా నైట్ షిఫ్ట్కు వెళ్ళేందుకు సిద్ధపడుతోన్న దామిని (అసలు పేరు కాదు) ఆ సావకాశాన్ని ఆస్వాదిస్తున్నారు. “నేను పిఎస్ఒ (పోలీస్ స్టేషన్ అధికారి)గా విధి నిర్వహణలో ఉన్నాను. ఆయుధాలను, వాకీ-టాకీలను జారీ చేయటం నా బాధ్యత," చెప్పారామె.
డ్యూటీలో ఉండగా, స్టేషన్ హౌస్ ఆఫీసర్ అలియాస్ పోలీస్ ఇన్స్పెక్టర్ (ఎస్ఎచ్ఒ/పిఐ) తన వాకీ-టాకీ కోసం పోలీస్ స్టేషన్ నుండి చార్జ్ చేసివున్న బ్యాటరీలను తీసుకురమ్మని ఆమెను అడిగాడు. అతని అధికారిక నివాసం స్టేషన్ ఆవరణలోనే ఉంది. అర్ధరాత్రి దాటిన తర్వాత, అలాంటి పనుల కోసం ఆమెను తన ప్రాంగణానికి పిలిపించుకోవడం ప్రోటోకాల్కు విరుద్ధమే అయినప్పటికీ, అదొక ఆనవాయితీ. "అధికారులు తరచుగా పరికరాలను తమ ఇళ్ళకు తీసుకువెళుతుంటారు... అదీగాక మేం మా పై అధికారుల ఆదేశాలను పాటించాలి," అని దామిని వివరించారు.
దాంతో, తెల్లవారుఝాము 1.30 సమయంలో దామిని పోలీస్ ఇన్స్పెక్టర్ ఇంటికి వెళ్ళారు.
లోపల ముగ్గురు వ్యక్తులు కూర్చునివున్నారు: పిఐ, ఒక సామాజిక కార్యకర్త, ఒక ఠాణా క ర్మచారి (చిన్న చిన్న పాక్షిక-అధికారిక పనులు చేయించుకోవటం కోసం పోలీసు స్టేషన్ నియమించుకొనే ఒక పౌర వాలంటీర్). "నేను వారిని పట్టించుకోకుండా, వాకీ-టాకీ బ్యాటరీలను మార్చడానికి గదిలో ఉన్న బల్ల వైపుకు తిరిగాను," నవంబర్ 2017 నాటి ఆ రాత్రిని గుర్తుచేసుకుంటూ ఆమె ఇబ్బందిపడుతూ చెప్పారు. ఆమె వెనుక, అకస్మాత్తుగా తలుపులు బిగించిన శబ్దం వినబడింది. “నేను ఆ గదిలోంచి బయటకు రావాలనుకున్నాను. నా శక్తి అంతటితో ప్రయత్నించాను, కాని ఇద్దరు వ్యక్తులు నా చేతులను గట్టిగా పట్టుకుని, నన్ను మంచం మీదకి తోసి... ఒకరి తర్వాత ఒకరు నాపై అత్యాచారం చేశారు."
తెల్లవారు ఝామున 2.30 గంటల సమయంలో దామిని నీరు నిండిన కళ్ళతో తూలుకుంటూ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చి, తన బైక్ ఎక్కి ఇంటికి బయలుదేరారు. "నా మెదడు మొద్దుబారిపోయింది. నేను ఆలోచిస్తున్నాను... నా కెరియర్ గురించీ, నేను సాధించాలనుకున్న దాని గురించీ. ఇక ఇప్పుడు ఇది?" అన్నారామె.







