వ్యవసాయ కూలీగా 70 సంవత్సరాలు పనిచేసిన తర్వాత, ఇప్పుడు 83 ఏళ్ల వయసున్న గంగప్ప తనను తాను మహాత్మా గాంధీగా మార్చుకున్నారు. ఆగస్టు 2016 నుండి అతను గాంధీలా వేషం వేసుకొని పశ్చిమ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం పట్టణంలో బహిరంగ ప్రదేశాల్లో నిలబడుతున్నారు. ఈ విధంగా అతనికి లభించే భిక్ష అతను వ్యవసాయ కూలీగా సంపాదించిన దానికంటే మంచి ఆదాయాన్నిస్తోంది.
"నేను మీ వయసుకి చేరినప్పుడు, నేను కూడా మీలాగే దుస్తులు ధరిస్తాను స్వామీ," అని గాంధీజీ అనంతపురంను సందర్శించినపుడు చిన్నపిల్లవాడిగా ఉన్న తాను ఆయనతో చెప్పినట్లు గంగప్ప చెప్పుకుంటారు. "ఆ సమయంలో నేను పేరూరు చెరువు నిర్మాణంలో కూలీలుగా పనిచేస్తున్న నా తల్లితండ్రులతో ఉన్నాను." గంగప్ప పుట్టిన చెన్నంపల్లి పేరూరుకు ఎంతో దూరంలో లేదు. గాంధీకి ఉన్న అనుకున్నది సాధించగల శక్తి, గొప్ప వ్యక్తులను సైతం ఆజ్ఞాపించగల సామర్థ్యం యువ గంగప్పను ఆకట్టుకున్నాయి.
తాను మహాత్మా గాంధీని కలిసినట్టుగా గంగప్ప చెప్పిన విషయాన్ని ధృవీకరించడం గానీ, అది జరిగిన తేదీని పేర్కొనడం గానీ కష్టమే అయినప్పటికీ, గాంధీ గురించిన జ్ఞాపకమే గంగప్ప జీవితాన్ని నడిపించింది. గంగప్పకు ప్రయాణాలంటే ఇష్టం - గాంధీలా మారడానికి ప్రయాణాలు చేయడం, ఓర్పుగా ఉండటం చాలా అవసరమని గంగప్ప నమ్ముతారు.
ఇప్పుడు గంగప్ప (అసలు పేరు ఇదే) తన పేరును గంగులప్ప అని చెప్పుకుంటారు. ఎందుకంటే జనం పొరపాటున ఆయన్ని అదే పేరుతో పిలుస్తున్నారు. తన గాంధీ వేషధారణకు బలం ఇచ్చేందుకు ఆయన ఛాతీకి అడ్డంగా జంధ్యాన్ని వేసుకుంటారు. గాంధీ వేషధారణలో ఉన్నపుడు తన నుదిటి పైనా, పాదాల పైనా కుంకుమ పెట్టుకొని, అప్పుడప్పుడూ తన చేతిని ఎత్తి ప్రజలను దీవిస్తూ, 'పూజారి'లా వ్యవహరిస్తుంటారు.







