హాసెల్ బ్లాడ్ అవార్డు - విజేత , ఫోటోగ్రాఫర్ దయాని తా సింగ్, దయాని తా సింగ్ - PARI డాక్యుమెంటరీ ఫోటోగ్రఫీ అవార్డును నెలకొల్పడానికి PARIతో కలిసి పనిచేశారు

మొదటి దయానితా సింగ్-PARI డాక్యుమెంటరీ ఫోటోగ్రఫీ అవార్డు కింద రూ. 2 లక్షలను పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాకు చెందిన ఎం. పళని కుమార్‌ గెలుచుకున్నారు

ఈ బహుమతిని నెలకొల్పాలనే ఆలోచన, ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫోటోగ్రఫీ బహుమతిగా పరిగణించబడే హాసెల్‌బ్లాడ్ 2022 అవార్డును దయానితా గెలుచుకోవడం ద్వారా వచ్చింది. యువకుడైన పళని కుమార్ స్వయంగా నేర్చుకున్న ఫోటోగ్రఫీ ఉద్దేశ్యం, విషయం, స్ఫూర్తి, డాక్యుమెంటరీ అసాధారణత్వం తనను బాగా ఆకట్టుకున్నట్లు దయానితా ప్రకటించారు.

ఆమె ఈ బహుమతిని పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాతో కలిసి ఒక సహకార వెంచర్‌గా మార్చాలని ఎంచుకున్నారు. ఎందుకంటే ఆమె PARIని డాక్యుమెంటరీ ఫోటోగ్రఫీకి చిట్టచివరి స్థావరంగానూ, అట్టడుగు వర్గాల జీవితాలపై, జీవనోపాధిపై దృష్టి సారించేదిగానూ భావిస్తున్నారు.

పళని కుమార్ PARIకి తొలి పూర్తి-కాల ఫోటోగ్రాఫర్ (మేం ఫోటో షూటింగ్ సహాయకులుగా సుమారు 600 మందితో కలిసి పని చేశాం). PARIలో ప్రముఖంగా ప్రదర్శించబడిన అతని పని- పారిశుద్ధ్య కార్మికులు, సముద్రపు నాచును సేకరించేవారు, వ్యవసాయ కార్మికులు సహా మనం అతి తక్కువగా పరిగణించే మరింతమందిపై తన దృష్టిని పూర్తిగా కేంద్రీకరించింది. పనిలో అతని నైపుణ్యం, బలమైన సామాజిక చైతన్యంతో సరిపోల్చగలవారు ప్రస్తుతం పనిచేస్తున్న రంగంలో అతనివంటి కొద్దిమంది మాత్రమే ఉన్నారు.

PHOTO • M. Palani Kumar

దక్షిణ తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో 25,000 ఎకరాల ఉప్పుకయ్యలలో అతి తక్కువ కూలీ కోసం శ్రమించి, చెమటలు కక్కుతున్న అనేక మంది మహిళల్లో రాణి కూడా ఒకరు. తూత్తుకుడి ఉప్పుమడుల రాణి నుంచి


PHOTO • M. Palani Kumar

ఎ. మూకుపొరి ఎనిమిదేళ్ల వయసు నుంచే సముద్రపు నాచు కోసం నీటిలోకి దూకుతున్నారు. ఈ అసాధారణమైన, సంప్రదాయక వృత్తిలో మునిగివున్న తమిళనాడులోని భారతీనగర్‌కు చెందిన అనేకమంది మత్స్యకార మహిళలు ఇప్పుడు తమ జీవనోపాధిని ప్రభావితం చేస్తున్న వాతావరణ మార్పులతో పోరాడుతున్నారు. తమిళనాడులో సముద్రపు నాచును వెలికితీసే కార్మికుల ఎదురీత నుంచి


PHOTO • M. Palani Kumar

డెబ్బైలలో వయసున్న గోవిందమ్మ, బకింగ్‌హామ్ కాలువలో రొయ్యలను పట్టుకుని, వాటిని తన నోటితో పట్టుకున్న బుట్టలోకి సేకరిస్తారు. గాయాలపాలై, కంటి చూపు తగ్గిపోయినప్పటికీ ఆమె తన కుటుంబాన్ని పోషించడం కోసం ఈ పని చేస్తూనేవున్నారు. గోవిందమ్మ : ‘ నా జీవితమంతా నేను నీళ్లలోనే ఉన్నాను నుంచి


PHOTO • M. Palani Kumar

తమిళనాడులోని కరూర్ జిల్లాలో కావేరి ఒడ్డున ఉన్న కోరై పొలాల్లో పనిచేస్తున్న అనేక మంది మహిళల్లో ఎ. మారియాయి ఒకరు. పొలాల్లో చేసే ఈ పని చాలా కష్టమైనది, తక్కువ జీతం తెచ్చేది, వారి ఆరోగ్యంపై దీని ప్రభావం పడుతోంది. కోరై పొలం నాకు మరో ఇల్లు లాంటిది నుంచి


PHOTO • M. Palani Kumar

తమిళనాడు, తూత్తుకుడి జిల్లాలో ఉప్పుమడుల కార్మికులు మండుటెండలో, అసౌకర్యంగా ఉండే పని ప్రదేశంలో, మనమంతా వంటగదిలో ముఖ్యమైన దినుసుగా వాడే ఉప్పుని పండిస్తారు. తూత్తుకుడి ఉప్పుమడుల రాణి నుంచి


PHOTO • M. Palani Kumar

తమిళనాడులోని కొంబు కళాకారులలో పి.మగరాజన్ ఒకరు. ఏనుగు తొండం ఆకారంలో ఉండి, గాలి ఊదటం ద్వారా మోగించే ఈ వాయిద్యాన్ని వాయించే కళ రాష్ట్రవ్యాప్తంగా మందగించింది. కళాకారులకు పని, డబ్బు లేకుండా పోయింది. మధురై కొంబులో , శబ్దం లేని రాగాలు నుంచి


PHOTO • M. Palani Kumar

కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో ఒక్క రోజు సెలవు కానీ, ఎటువంటి రక్షణ పరికరాలు కానీ లేకుండా నగరాన్ని ఊడ్చడం, శుభ్రపరచడం వంటి పనులు చేయడంకోసం చెన్నైలోని పారిశుద్ధ్య కార్మికులు చాలా దూరాలు నడిచారు. Sanitation workers - the wages of ingratitude నుంచి


PHOTO • M. Palani Kumar

అంగవైకల్యం ఉన్న పారిశుద్ధ్య కార్మికురాలు రీతా అక్క , చెన్నైలోని కొత్తూరుపురం ప్రాంతంలో ఉదయంవేళల్లో చెత్తను తొలగిస్తారు . కానీ ఆమె సాయంకాలాలు మాత్రం తన సహచరులైన కుక్కలకు ఆహారాన్నివ్వడం , వాటితో మాట్లాడటంతో గడుస్తుంటాయి . Rita akka’s life is going to the dogs (and cats) నుంచి


PHOTO • M. Palani Kumar

తన కుమారుడు విశాంత్ రాజాతో డి. ముత్తురాజా. ముత్తురాజా, అతని భార్య ఎం. చిత్రలు పేదరికం, అనారోగ్యం, అంగవైకల్యం ఉన్నప్పటికీ ధైర్యంగా, ఆశతో జీవితాన్ని ఎదుర్కొంటున్నారు. చిత్ర , ముత్తురాజా : ఎవరికీ తెలియని ప్రేమకథ నుంచి


PHOTO • M. Palani Kumar

కళ, నైపుణ్యం, నాటకరంగం, పాటల ద్వారా తమిళనాడులోని అసంఖ్యాక చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపిన ఆర్.ఎళిల్అరసన్ అనే కళాకారుడు. ఎళిల్ అన్న నన్ను మట్టి నుంచి తయారుచేశారు నుంచి


PHOTO • M. Palani Kumar

ఒక అరుదైన ఆనందమయ క్షణంలో పళని తల్లి తిరుమాయి . దీపస్థంభపు వెలుగులో , మా అమ్మ జీవితం నుంచి

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli