జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మరియు పారిశ్రామిక అభివృద్ధి కేంద్రం (డిఐపిఇడిసి) అంచనా ప్రకారం మీరట్లో 347 క్రికెట్ బంతులను తయారుచేసే యూనిట్లు పనిచేస్తున్నాయి. వాటిలో పారిశ్రామిక ప్రాంతాలలో ఉన్న పెద్ద కర్మాగారాలు; మీరట్ జిల్లాలోని పట్టణ, గ్రామీణ నివాస ప్రాంతాలలో ఉన్న చిన్న ఉత్పత్తి యూనిట్లు కూడా ఉన్నాయి.
అయితే, ఈ లెక్కలో అనేకచోట్ల చెల్లాచెదురుగా ఉన్న అసంఘటిత ఉత్పత్తి కేంద్రాలను, మొత్తం బంతులను తయారుచేసే, లేదా ఒక పనిని అవుట్సోర్స్ చేసే గృహ యూనిట్లను కలపలేదు. వీటిలో మీరట్ జిల్లావ్యాప్తంగా ఉన్న జంగేఠి, గగౌల్, భావన్పుర్ వంటి గ్రామాలు ఉన్నాయి. "ఆజ్ గాఁవోఁ కే బినా బిల్కుల్ పూర్తి నహీఁ హోగీ మీరట్ మే (ఈ రోజు గ్రామాలే లేకుంటే మీరట్లో క్రికెట్ బంతుల సరఫరా ఎంతమాత్రం ఉండదు)," అని మదన్ అన్నారు.
"క్రికెట్ బంతులను తోలుతో తయారుచేస్తారు కాబట్టి గ్రామాలలోని చాలామంది కారీగర్లు, నగరంలోని పెద్ద కర్మాగారాల్లో కూడా జాటవలే వీటిని తయారుచేస్తారు," అని అతను వివరించారు. 1904 జిల్లా గెజిటీర్ ప్రకారం, మీరట్లోని తోలు పరిశ్రమలో జాటవ లేదా చమార్ (ఉత్తర్ ప్రదేశ్లో షెడ్యూల్డ్ కులాల జాబితాలో ఉంది) సముదాయానికి చెందినవారే ఎక్కువగా పనిచెస్తున్నారు. "జనాలకు క్రికెట్ బాల్ రూపంలో ఉండే తోలుతో సమస్య లేదు, కానీ ఆ తోలుతో పనిచేయాల్సివస్తే మాత్రమే సమస్య ఉంటుంది," అని అతను చెప్పారు.
మదన్ కుటుంబానికి శోభాపుర్లో చర్మశుద్ధి కర్మాగారం ఉంది. ఇక్కడ మాత్రమే క్రికెట్ బంతుల తయారీ పరిశ్రమ కోసం చర్మాన్ని పటికతో శుద్ధిచేయడం జరుగుతుంది (చదవండి: ఇంకా పట్టు కొనసాగిస్తోన్న మీరట్ చర్మకారులు). "పటికతో శుద్ధిచేసిన తోళ్ళకు పెరుగుతున్న గిరాకీని చూసి, క్రికెట్ బంతులకు ఎప్పటికీ గిరాకీ తగ్గదని నేను గ్రహించాను," అని అతను చెప్పారు. ఆశాజనకంగా ఉన్న మార్కెట్ అతన్ని 20 సంవత్సరాల క్రితమే మెస్సర్స్ బి.డి. అండ్ సన్స్ని ప్రారంభించడానికి పురికొల్పింది. ఆ ప్రాంతంలో ఉన్న రెండు క్రికెట్ బంతుల తయారీ యూనిట్లలో ఇది ఒకటి.
బంతిని తయారుచేయడంలో అనేక ప్రక్రియలు ఉన్నందువల్ల, ఒక బంతిని చేయడానికి ఎన్ని గంటల సమయం అవసరమో ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమని మదన్ చెప్పారు. సీజన్ని బట్టి, తోలు నాణ్యతను బట్టి కూడా దానికి పట్టే సమయం ఆధారపడివుంటుంది. "దో హఫ్తే లగ్తే హైఁ ఏక్ గేంద్ కో తయ్యార్ హోనే మేఁ కమ్ సే కమ్ (ఒక బంతిని తయారుచేయడానికి కనీసం రెండు వారాలు పడుతుంది)," అని అతను చెప్పారు.
మదన్ యూనిట్లోని కార్మికులు మొదట పటికతో చర్మాన్ని శుద్ధిచేస్తారు. దానికి ఎరుపు రంగు వేసి, ఎండలో ఆరబెట్టి, దానికి మైనం లేదా జంతువుల కొవ్వును పట్టించి, ఆపై దానిని మెత్తగా చేయడానికి చెక్క సుత్తితో బాదుతారు. “తెల్లని బంతులు చేయడానికి పటికతో శుద్ధిచేసిన చర్మం అప్పటికే తెల్లగా ఉంటుంది కాబట్టి వాటికి రంగులు వేయాల్సిన అవసరం ఉండదు. ఆవు పాలతో చేసిన పెరుగు వాటికి గ్రీజుగా ఉపయోగపడుతుంది," అని మదన్ వివరించారు.