వాలపర్ల తిరుపతమ్మ మనసు కుదుటపడ్డది. గుంటూరు జిల్లాలో కొత్తగా నిర్మించిన SRM యూనివర్సిటీలో నేల మీద పడిన పెయింట్ను శుభ్రం చేసే పనిని ఆమెకు అప్పజెప్పారు. "3-4 ఏళ్లగా మాకు పెద్దగా పని ఏదీ దొరకలేదు, కాబట్టి ఏదో ఒక పని దొరికినందుకు మాకు అప్పట్లో సంతోషం వేసింది. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు," అని ఆమె చెప్పింది. రెండు వారాల తర్వాత 29 ఏళ్ల తిరుపతమ్మను కారణాలు ఏవీ చెప్పకుండానే ఉద్యోగం నుండి తీసి వేశారు.
ఉస్తాల మేరీ మాత (40)ను కూడా ఉద్యోగం నుండి తీసివేశారు. "పెయింట్ను శుభ్రం చేయడానికి రోజుకు రూ. 250 ఇచ్చారు. పని పూర్తి అయ్యాక, వెళ్లిపొమ్మని చెప్పారు. మాకు ‘వయసైంద’ని, పని చేయలేమని చెప్పారు," అని ఆమె చెప్పింది.
2018 మే నెలలో 1500 జనాభా గల నీరుకొండ గ్రామంలోని దళిత కాలనీకి కాంట్రాక్టర్లు వచ్చి కూలీల కోసం ఆరా తీశారు. ఆడ, మగ కలిసి దాదాపు 20 మంది గల సమూహాన్ని పనిలోకి కుదుర్చుకున్నారు. "పని ఉన్నప్పుడల్లా వాళ్లు మమ్మల్ని తీసుకెళ్తారు. పని అయిపోయిన తర్వాత ఏదో ఒక సాకు చెప్పి తిరిగి పంపేస్తారు" అని 60 ఏళ్ల కురగంటి వాజీరాం చెప్పాడు. "అయినా ఇక్కడ మాకు పనేమీ లేదు కాబట్టి కూలీల కొరత కూడా లేదు.
కొందరు ఊరివాళ్లు యూనివర్సిటీలోని గార్డెనింగ్, హౌస్-కీపింగ్ డిపార్ట్మెంట్లలో పని కొనసాగిస్తున్నారు, అయితే ఆ పని ఎంత కాలం కొనసాగుతుందో వాళ్లకు తెలియదు. ప్రైవేట్ యూనివర్సిటీ అయిన SRM - పలు ఇతర యూనివర్శిటీలు - ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అయిన అమరావతిలో ఏర్పడబోతున్న 'నాలెడ్జ్ హబ్'లో భాగం కాబోతున్నాయి. ఇందులో ఉన్నత విద్యా సంస్థలు, కార్పొరేట్ మరియు ప్రభుత్వ రంగాలకు చెందిన రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లు, 'స్కిల్ డెవలెప్మెంట్' సంస్థలతో పాటు 'స్టార్ట్ అప్ హబ్' కూడా రాబోతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (APCRDA)కి చెందిన ఒక డాక్యుమెంట్లో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం , ఈ క్లస్టర్లో 75 ఎకరాల వైశాల్యం గల మొదటి దశను 2022 లోగా, రెండవ దశను 2037 లోగా సిద్ధం చేయాల్సి ఉంది.











