"మా లాంటి మహిళలు తమ ఇళ్లను, పొలాలను విడిచిపెట్టి, నిరసన తెలపడానికి నగరానికి వచ్చారంటే, వారు తమ కాళ్ళ క్రింద ఉన్న మాటి [భూమిని] కోల్పోతున్నారని అర్థం" అని అరుణ మన్నా అన్నది. "గత కొన్ని నెలల్లో మేము తినడానికి ఇంట్లో ఏమీ లేని రోజులు ఉన్నాయి. దానికి ముందు మేము కేవలం ఒక పూట మాత్రమే తిని బతికాము. ఈ చట్టాలను ఆమోదించడానికి ఇదా సమయం? మమ్మల్ని చంపడానికి ఈ మహమ్మారి [కోవిడ్ -19 మహమ్మారి] సరిపోదా! ” అని ఆవేదనగా అడిగింది.
నలభైరెండేళ్ల అరుణా, సెంట్రల్ కోల్కతాలోని నిరసన ప్రదేశమైన ఎస్ప్లానేడ్ వై-ఛానెల్లో మాట్లాడుతోంది. జనవరి 9 నుండి 22 వరకు రైతులు, వ్యవసాయ కూలీలు కలిసి ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ (ఎఐకెఎస్సిసి) బ్యానర్ పై ఇక్కడకు వచ్చారు. విద్యార్థులు, పౌరులు, కార్మికులు, సాంస్కృతిక సంస్థలు- 2020 సెప్టెంబర్లో పార్లమెంటులో ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు సంఘీభావం తెలపడానికి ఇక్కడ సమావేశమయ్యారు.
అరుణ రాజువాకి గ్రామం నుండి సుమారు 1,500 మంది మహిళలతో కలిసి వచ్చారు. వీరిలో ఎక్కువ మంది దక్షిణ 24 పరగణాల జిల్లాలోని వివిధ గ్రామాలనుంచి వచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న మహిళా రైతులకు, కూలీలకు వారి హక్కులను పొందడానికి ‘మహిళా కిసాన్ దివాస్’ గా అంకితం చేయబడిన జనవరి 18 ను జరుపుకోవడానికి రైళ్లు, బస్సులు మరియు టెంపోల ద్వారా అందరూ కోల్కతాకు చేరుకున్నారు. 40 కి పైగా మహిళా రైతులు మరియు వ్యవసాయ కూలీల యూనియన్లు, మహిళా సంస్థలు మరియు AIKSCC యొక్క యూనియన్లు ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ ఎడిషన్ను నిర్వహించాయి.
కోల్కతా వరకు చేసిన సుదీర్ఘ ప్రయాణం తర్వాత వారి గొంతుకలు అలసిపోయినప్పటికీ, ఈ మహిళలలో కోపం ఇంకా స్పష్టంగా ఉంది. “ మా తరఫున ఎవరు నిరసన తెలుపుతారు? న్యాయస్థానమా లేక న్యాయమూర్తులా ? మాకు కావలసింది లభించేంత వరకు మేము నిరసన చేస్తూనే ఉంటాము! ” అని శ్రమజీవి మహిళా సమితి సభ్యురాలు సుపర్ణ హల్దార్ (38) అన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలను విడిచిపెట్టడానికి మహిళా మరియు వృద్ధ నిరసనకారులను ‘ఒప్పించాలి’ అని భారత ప్రధాన న్యాయమూర్తి ఇటీవల చేసిన వ్యాఖ్యపై ఆవిడ పై సమాధానమిచ్చారు.
కోల్కతా నిరసన స్థలంలో జనవరి 18 న ఉదయం 11:30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన మహిళా కిసాన్ మజూర్ విధానసభ సమావేశాల్లో సుపర్ణ ప్రసంగించారు. మహిళా కిసాన్ దివాస్లో భాగంగా వ్యవసాయంలో మహిళల సంక్లిష్ట ఆందోళనలు, వారి శ్రమ, భూమి మరియు ఇతర హక్కుల యాజమాన్యం కోసం వారు చేసిన సుదీర్ఘ పోరాటం, వారి జీవితాలపై కొత్త వ్యవసాయ చట్టాల ప్రభావం గురించి ఈ సెషన్ దృష్టి సారించింది.











