శ్రామికవర్గ ప్రజలు పూర్తిగా అరిగిపోయిన చెప్పులను కూడా దాచిపెట్టుకుంటారు. సామాన్ల బరువులెత్తేవారి చెప్పులు గుంటలు పడి, అరిపాదాలు ఆనేచోట లోపలికి అరిగిపోయి ఉంటాయి. కట్టెలు కొట్టేవారి చెప్పులు ముళ్ళతో నిండివుంటాయి. నా సొంత స్లిప్పర్లు ఊడిపోకుండా ఉండేందుకు వాటికి తరచుగా పిన్నీసులు పెడుతుంటాను.
భారతదేశమంతటా నేను చేసే ప్రయాణాలలో అదేపనిగా నేను పాదరక్షల చిత్రాలను తీశాను, ఆ ఫోటోలలో ఈ కథనాలను వెతకడం మొదలుపెట్టాను. అటువంటి పాదరక్షల కథనాల ద్వారా నా సొంత ప్రయాణం కూడా ఆవిష్కృతమవుతుంది.
ఇటీవల పనిమీద ఒడిశాలోని జాజ్పూర్కు వెళ్ళినపుడు బారాబంకి, పురాణమందిర గ్రామాలలో ఉన్న పాఠశాలలకు వెళ్ళే అవకాశం నాకు దొరికింది. మేం వెళ్ళినచోటల్లా, ఆదివాసీ సముదాయాల ప్రజలు గుమిగూడిన గది బయట శ్రద్ధగా అమర్చిన పాదరక్షలను నేను ఆసక్తిగా చూస్తుండేవాడిని.
మొదట్లో నేను పెద్దగా పట్టించుకోలేదు, కానీ మూడు రోజులు ప్రయాణించిన తర్వాత, నేను పూర్తిగా అరిగిపోయిన చెప్పులను, కొన్నిటికి రంధ్రాలు కూడా ఉండటాన్ని, గమనించటం మొదలుపెట్టాను.
























