"పట్టా (టైటిల్) వున్న భూయజమానుల కంటే మాకెందుకు వేరుగా పరిహారం ఇస్తున్నారు?" అని 55 ఏళ్ల దళిత రైతు తురక బాబూరావు అడుగుతున్నారు. గుంటూరు జిల్లాలో 4800 మంది నివసించే రాయపూడి గ్రామంలో ఆయనకు ఎకరానికి కొంచెం తక్కువగా భూమి వుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త 'ప్రపంచ స్థాయి' రాజధాని నగరం అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు ఇచ్చే పరిహారం గురించి ఆయన మాట్లాడుతున్నారు. "వాస్తవానికి పట్టా భూముల కంటే మా భూములే ఎక్కువ సారవంతమయినవి. ఎందుకంటే అవి కృష్ణానదిని ఆనుకుని ఉంటాయి." అని ఆయన అన్నారు.
రాయపూడిలో దాదాపు 800 మంది రైతులతో ఏర్పడిన అసైన్డ్ భూమి సాగుదారుల సంక్షేమ సమితి (అసైన్డ్ ల్యాండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్)లో బాబూరావు సభ్యుడు. ఈ సంఘం సభ్యులలో ఎక్కువ మంది షెడ్యూలు కులాలు లేదా ఇతర వెనకబడిన కులాలకు చెందినవారు. ఆంధ్రప్రదేశ్ భూసంస్కరణల (సీలింగ్స్ ఆన్ అగ్రికల్చర్ హోల్డింగ్స్) చట్టం 1973 ప్రకారం రాష్ట్రంలో భూములను పంచినప్పుడు రాయపూడిలో కృష్ణా నది ఒడ్డున, లేదా ఆ నదికి చెందిన లంకల్లో 2000 ఎకరాల (ఇది రైతుల సొంత అంచనా) భూమిని ఈ సాగుదారులకు ప్రభుత్వం 'అసైన్' చేసింది. ఈ భూములు పొందినవారిలో ఎక్కువ మంది దళితులు లేదా ఒబిసి సామాజిక వర్గానికి చెందినవారు.
"మేము ఈ భూమిని మూడు తరాలుగా, అంటే దేశానికీ స్వాతంత్య్రం రాక ముందునుంచి, సాగుచేస్తున్నాము. ఇందిరాగాంధీ అసైన్డ్ పట్టాలు ఇచ్చి ఈ భూమి మీద మాకు హక్కు కల్పించారు." అన్నారు బాబూరావు. ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల (బదలాయింపుల నిషేధం) చట్టం 1977 ప్రకారం, వ్యక్తులుగా ఈ అసైన్డ్ భూములను అమ్మడానికి గాని, కొనడానికి గాని వీలులేదు. కేవలం ఒక కుటుంబసభ్యుడి నుంచి ఇంకొక కుటుంబ సభ్యుడికి బదిలీ మాత్రమే చెయ్యొచ్చు.
అయితే, ప్రభుత్వం తన ‘గ్రీన్ఫీల్డ్’ రాజధాని నిర్మాణంలో మొదటి దశ కోసం 33,000 ఎకరాలను సేకరిస్తోంది. వీటిలో దాదాపు 10,000 ఎకరాలు అసైన్డ్ భూములని స్థానిక కార్యకర్తల అంచనా. మిగిలినవి అగ్రవర్ణాలైన కమ్మ, కాపు, రెడ్డి రైతులు సాగుచేస్తున్న పట్టా భూములు.









