ఇక తన కుటుంబ పోషణ గురించి చింతించాల్సిన అవసరం లేదని రుఖ్సానా ఖాతూన్ భావించారు. రేషన్ కార్డ్ కోసం రెండు సంవత్సరాల పాటు సాగుతూపోయిన ఆమె ప్రయత్నాలు మూడోసారి ఫలించి, 2020 నవంబర్లో ఆమెకు రేషన్ కార్డ్ వచ్చింది. అకస్మాత్తుగా, కోవిడ్ విజృంభించిన ఆ సంవత్సరంలోని గడ్డు నెలలు వెనక్కిపోయినట్లు ఆమెకు అనిపించింది.
ఇది జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఎ), 2013 కింద ఒక 'ప్రాధాన్య కుటుంబాలు’ కార్డ్. దీని కింద అర్హులైన లబ్ధిదారులను రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తిస్తాయి.
ఆ కార్డు, ఆ సమయంలో వారు నివసిస్తున్న వారి స్థానిక ఇంటి చిరునామాను కలిగి ఉంది. బిహార్లోని దర్భంగా జిల్లాలోని ఒక మురికి మునిసిపల్ కౌన్సిల్ ప్రాంతంలో ఇటీవలే విలీనం చేయబడినది వారి గ్రామం. తన ఏడుగురు సభ్యుల కుటుంబానికి రాయితీతో కూడిన రేషన్లను రుఖ్సానా చివరకు పొందగలిగారు.
ఆ తర్వాత వారందరూ ఆగస్టు 2021లో ఢిల్లీకి తిరిగి వెళ్లారు. ఆమె కుటుంబానికి చట్టబద్ధంగా లభించే ఆహారధాన్యాలను పొందడం ఇప్పుడు మరోసారి చిక్కుల్లో పడింది.
కేంద్ర ప్రభుత్వ ‘ఒక దేశం, ఒక రేషన్ కార్డ్’ (ఒఎన్ఒఆర్సి) పథకం కింద, ఎన్ఎఫ్ఎస్ఎ లబ్ధిదారులు - 'ప్రాధాన్య కుటుంబాలు', 'పేదవారిలోకెల్లా పేదవారు' కింద వర్గీకరించబడినవారు. వీరు ఏ చౌక ధరల దుకాణం నుండైనా తమ ఆహార ధాన్యాల కోటాను సేకరించడానికి అర్హులు. ఆధార్ కార్డ్ లింక్ అయివున్న బయోమెట్రిక్ ప్రామాణికతను ఉపయోగించి, ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్)) కింద వస్తువులను పంపిణీ చేయడానికి ఈ దుకాణాలు లైసెన్స్ పొందాయి. కానీ రుఖ్సానా తన నెలవారీ కోటా కోసం పశ్చిమ ఢిల్లీలోని షాదీపూర్ మెయిన్ బజార్ ప్రాంతంలోని చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ప్రతిసారీ, ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ePOS) మెషీన్లో ఇలా రాసి ఉంటోంది: ‘ఐఎంపిడిఎస్లో రేషన్ కార్డ్ లేదు’.
ప్రజా పంపిణీ వ్యవస్థ - పిడిఎస్ కింద పంపిణీ చేయడానికి ఆహారధాన్యాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కేటాయిస్తుంది. ఒఎన్ఒఆర్సి పథకం కింద దేశంలోని ఏ ప్రాంతం నుండైనా అర్హులైన వలసదారులు తమకు రావలసిన ఆహారధాన్యాలను తీసుకునేలా 2018లో ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (ఐఎంపిడిఎస్) ఏర్పాటు చేయబడింది.













