మా సంభాషణ ప్రాథమిక విషయాలతో మొదలైంది. గుంటూరు జిల్లా పెనుమాక గ్రామానికి చెందిన శివారెడ్డి (62) నాతో మాట్లాడుతూ, “నాకు ఐదెకరాల భూమి ఉంది. మూడు ఎకరాల్లో అరటి, రెండెకరాల్లో దొండకాయ, ఒక ఎకరంలో ఉల్లి పండిస్తాను...’’ అన్నారు. అంటే మీకు ఉన్నది ఐదు కాదు, ఆరు ఎకరాలు కదా- అని నేను అడిగాను.


Guntur, Andhra Pradesh
|THU, MAY 26, 2022
'ఇది ప్రజల రాజధాని కాదు'
ప్రభుత్వం చెప్తోన్న గొప్పల మధ్య ఆంధ్రాలో వస్తున్న మెగా నగరం అమరావతి, వేల మంది రైతులను సారవంతమైన భూముల నుండి దూరం చేస్తోంది. పలువురు రైతులు ప్రతిఘటిస్తుండగా, మరికొందరు భూసమీకరణ పథకాలకు తలొగ్గుతున్నారు
Author
Translator

Rahul Maganti

Rahul Maganti
అమరావతి సుస్థిర రాజధానీ నగర అభివృద్ధి ప్రాజెక్ట్ (సస్టైనబుల్ కాపిటల్ సిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్) కోసం సింగపూర్కు చెందిన నిర్మాణ సంస్థల కన్సార్టియం సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధాని నిర్మాణం మూడు దశలకు కలిపి లక్ష ఎకరాల భూమి అవసరం పడుతుంది. ఇందులో రాజ్ భవన్ , శాసనసభ, హై కోర్టు, సచివాలయం, మౌలిక సదుపాయాలు (రహదారులు, ఇళ్ళ సముదాయాలు సహా), పరిశ్రమలు, ఐటి కంపెనీలు వంటివన్నీ ఏర్పాటు చేయబడతాయి. అందులో కొంత భూమి రాష్ట్రం స్వాధీనం చేసుకున్న భూయజమానులకు కేటాయించబడుతుంది .
ఐతే, శివరామకృష్ణన్ కమిటీ ఆగస్టు 2014లో ఇచ్చిన నివేదిక కొత్త రాజధాని పరిపాలనా భవనాలకు 200 నుంచి 250 ఎకరాల భూమి సరిపోతుందని పేర్కొంది. ఇవే కాక మెగా రాజధాని నిర్మాణ ప్రక్రియకి బదులుగా ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో ‘వికేంద్రీకృత’ అభివృద్ధిని సిఫార్సు చేసింది. "ఇప్పటికే ఉన్న వ్యవసాయ వ్యవస్థలకు సాధ్యమైనంత భంగం కలిగించకుండా", ప్రజలకు, వారి నివాసాలకు కనీస పునరావాసం, స్థానిక పర్యావరణ పరిరక్షణ వంటివి జరిగేలా దృష్టిలో పెట్టుకొని, కేంద్ర ప్రభుత్వం మార్చి 2014లో కొత్త రాజధాని స్థలానికి ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేయడానికి ఈ కమిటీని నియమించింది. అయితే ఈ కమిటీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోనట్టుంది.
2050 కల్లా 56.5 లక్షల ఉద్యోగాలు కల్పించబడతాయని కూడా ఎపిసిఆర్డిఎ మాస్టర్ ప్లాన్ చెబుతోంది, కానీ ఎలా అనేది చెప్పలేదు. రాజధాని ప్రాజెక్ట్ వ్యయం రూ.50,000 కోట్ల పైనే ఉంటుందని అంచనా- ఎపిసిఆర్డిఎ కమిషనర్ శ్రీధర్ చెరుకూరిని నేను అడిగినప్పుడు ఈ విషయాన్నిఆయన ధృవీకరించారు. నిధులు ఇచ్చే వాళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రజలు (ప్రభుత్వం అమ్మే బాండ్ల ద్వారా), సాధ్యమైతే ప్రపంచ బ్యాంకు, ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు కూడా ఉన్నాయి.
కొత్త రాజధాని కోసం భూమి సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం జనవరి 2015లో భూ సమీకరణ పథకం (ల్యాండ్ పూలింగ్ స్కీమ్ - ఎల్పిఎస్) తీసుకొచ్చింది. ఐతే ఎల్పిఎస్ 2013 నాటి భూసేకరణ, పునర్వ్యవస్థీకరణ, పునరావాస చట్టం (ఎల్ఎఆర్ఆర్)లో న్యాయమైన పరిహారం, పారదర్శకత హక్కు ద్వారా వాగ్దానం చేయబడిన రక్షణలను, తనిఖీలను, వాటితో పాటు సామాజికంగా, పర్యావరణం మీద పడే ప్రభావాల అంచనా, ప్రభావితమైన వారిలో కనీసం 70 శాతం మంది ఆమోదం, వంటివాటిని కూడా విస్మరించింది.

Rahul Maganti

Rahul Maganti
ఎల్పిఎస్ కేవలం భూయజమానుల సమ్మతి మాత్రమే తీసుకుని ఆ భూమిపై ఆధారపడ్డ వ్యవసాయ కూలీల్లాంటి ఇతరులను మినహాయిస్తుంది. భూ యజమానులు ‘స్వచ్ఛందంగా’ తమ ప్లాట్లను రాష్ట్రానికి ఇచ్చేసి కొత్త రాజధానిలో ఒక ‘పునర్నిర్మించి అభివృద్ధి చెందిన’(నివాస, వాణిజ్య అంశాలతో కూడిన) ప్లాట్ను పొందవచ్చు. మిగతా భూమిని ఎపిసిఆర్డిఎ రోడ్లు, ప్రభుత్వ భవనాలు, పరిశ్రమలు వగైరా నిర్మాణాల కోసం ఉంచుతుంది. ప్రభుత్వం కూడా భూ యజమానులకు కొత్త ప్లాట్లు ఇచ్చే దాకా పది సంవత్సరాల వరకు ప్రతీ సంవత్సరం ఎకరానికి రూ. 30,000-50,000 వరకూ పరిహారం (భూమి రకాన్ని బట్టి) ఇవ్వడానికి హామీ ఇచ్చింది.
“భూసమీకరణ కోసం మా అంతట మేము భూములు ఇవ్వకపోతే ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందని రెవెన్యూ అధికారులు చెప్తూ వస్తున్నారు. భూ సేకరణ చట్టం కింద వచ్చేపరిహారం, భూసమీకరణ పథకం(ఎల్పిఎస్) కింద వచ్చే దాని కన్నా చాలా తక్కువ అనే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు,” అని సాంబి రెడ్డి చెప్పారు.
మార్చి 2017లో వెయ్యి మందికి పైగా రైతులు, రాజధాని ప్రాజెక్టుకు నిధులు ఉపసంహరించుకోవాలని కోరుతూ ప్రపంచ బ్యాంకుకు ఒక లేఖ రాశారు. ఎందుకంటే: తమ వ్యవసాయానికి, మత్స్యకారుల జీవనోపాధికి ముప్పుగా ఉంది; ఈ ప్రాంతపు సారవంతమైన వ్యవసాయ భూమిని, ఆహార భద్రతని నాశనం చేస్తుంది; వరదలు వచ్చే ఆస్కారం ఉన్న ప్రాంతంలో భారీ నిర్మాణ పనులు చేయడం వల్ల పర్యావరణం ఘోరంగా దెబ్బ తింటుంది కాబట్టి. తమ పేర్లను గోప్యంగా ఉంచమని ఈ రైతులు ప్రపంచ బ్యాంకుని కోరారు.
పెనుమాక నుంచి పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక రైతు నాతో ఇలా అన్నారు: “భూసమీకరణ పథకాన్ని ప్రతిఘటించినందుకు పోలీసులు మా మీద తప్పుడు కేసులు బనాయించారు. వందలాది మంది పోలీసు అధికారులను గ్రామంలోకి దింపి, మొత్తం 29 గ్రామాలలో ప్రతి గ్రామంలోనూ నెలల తరబడి ఒక పోలీసు శిబిరాన్ని (ప్రభుత్వం) ఏర్పాటు చేసింది.” ఇది గ్రామస్తులను భయపెట్టడానికి ఉపయోగపడింది.
పెనుమాక నుంచే పేరు చెప్పడానికి ఇష్టపడని మరో రైతు ఇలా చెప్పారు: “ ఊర్లో ఉన్న పంచాయితీ కార్యాలయాన్ని ఎపిసిఆర్డిఎ కార్యాలయంగా మార్చారు. ఇది డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న అధికారి పర్యవేక్షణలో ఉండింది.”

Rahul Maganti

Rahul Maganti
ప్రపంచ బ్యాంకు కోసం ఎపిసిఆర్డిఎ తయారుచేసిన నివేదిక ప్రకారం అక్టోబర్ 2017 వరకు ఇంకా 4,060 మంది భూ యజమానులు భూసమీకరణ పథకం కోసం తమ సమ్మతిని ఇవ్వాల్సి ఉంది. ఐతే, బలవంతం గానీ ఒత్తిడి చేయటం గానీ లేదనీ, జనవరి 2015 నుంచి రైతులు ‘స్వచ్ఛందంగా, సంతోషంగా’ భూములు ఇస్తున్నారని ఎపిసిఆర్డిఎ కమిషనర్ శ్రీధర్ చెరుకూరి చెప్పుకొచ్చారు.
29 గ్రామాలలో నుంచి, పెనుమాక, ఉండవల్లి గ్రామాల ప్రజలు భూసమీకరణ పథకాన్ని తీవ్రంగా ప్రతిఘటించి తమ భూముల్ని వదులుకోలేదు. చెన్నై-కొల్కతా రహదారికి సమీపాన ఉండడం వల్ల ఈ భూమి చాలా విలువైనది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇక్కడి చాలా మంది రైతులు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు.
మిగతా 27 గ్రామాలకు చెందిన భూ యజమానులు ప్రధానంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. వీళ్ళు తెలుగు దేశం పార్టీకి బలమైన మద్దతుదారులు, అమరావతి ప్రాజెక్ట్ ని సమర్థిస్తున్నారు. “మేం అభివృద్ధి చెందాలి. ఇంకా ఎన్నాళ్ళని ఊర్లలో ఉండాలి? విజయవాడ, గుంటూరు వాసుల్లాగా మేం కూడా అభివృద్ధి చెందాలి,” అని భూసమీకరణ కోసం తన భూమిని ఇచ్చేసిన ఉద్దండరాయునిపాలెంకి చెందిన గింజుపల్లి శంకర రావు అన్నారు. నదికి దూరంగా ఉన్న నీరుకొండ గ్రామానికి చెందిన మువ్వా చలపతి రావు, “నాకు నష్టాలు మాత్రమే వస్తున్నప్పుడు నేనెందుకు వ్యవసాయం చేయాలి?” అని అడుగుతున్నారు
కానీ ఈ 27 గ్రామాలలో కూడా భూమి లేనివారిని ఎల్పీఎస్ నుంచి మినహాయించడంతో పాటు ప్రతిఘటన కూడా ఉంది. వెంకటపాలెం ఊరిలో ఎకరం కన్నా తక్కువ భూమి ఉన్న చిన్న రైతు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన బోయపాటి సుధారాణిని కలిశాను. ఫిబ్రవరి 2015 లో ఆమె ఇంటర్నెట్ లోని ఒక వీడియోలో ఇలా చెప్తూ కనిపించారు,”నాకు ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి టీడీపీకి తప్ప ఎవరికీ ఓటు వేయలేదు. ఇప్పుడు మా గొయ్యి మేమే తవ్వుకున్నట్టు అనిపిస్తుంది. నేను చంద్రబాబుని ఒకటే అడగాలనుకుంటున్నాను. ఆయన మాకు పదేళ్ల తర్వాత ప్లాట్లు ఇస్తే మేం ఇప్పుడు చచ్చి మళ్ళీ తర్వాత పుట్టాలా?” అయితే ఆ తర్వాత పోలీసు, రెవిన్యూ అధికారుల బృందం ఆమె ఇంటికి వెళ్లి (ఆమె భర్త, అత్తమామల్ని ఒత్తిడి చేసి) ఆమె తన మాటల్ని ఉపసంహరించుకునేలా, భూసమీకరణ పథకానికి ఒప్పుకునేలా చేశారు.

Rahul Maganti

Rahul Maganti
“భూ ఉపరితలానికి కేవలం 10-15 అడుగుల దిగువనే భూగర్భ జలాలు ఉన్నాయి. (సారవంతమైన కృష్ణ-గోదావరి డెల్టాలో) ఇది బహుళ పంటలు పండే భూమి, సంవత్సరంలో ఒక్క రోజు కూడా పొలాలు ఖాళీగా ఉండవు. సంవత్సరంలో 365 రోజులు ఏదో ఒక పంట పండుతూనే ఉంటుంది,”అని కృష్ణారెడ్డి అన్నారు, పెనుమాకలో ఆయనకి ఒక ఎకరం భూమి ఉంది, ఇంకో నాలుగు ఎకరాలు కౌలుకి తీసుకున్నారు. “సాధారణంగా నాకు ఒక ఎకరానికి సంవత్సరానికి రెండు లక్షల రూపాయల లాభం వస్తుంది. మహా అయితే మార్కెట్ ధరలు తక్కువ ఉన్నప్పుడు నాకు నష్టమూ రాదు, లాభమూ రాదు.”
చాలా కాలంగా శ్రీకాకుళం, రాజమండ్రి లాంటి దూర ప్రాంతాల నుంచి పెనుమాక, ఉండవల్లి, ఇంకా ఈ 29 ఊళ్ళలోని కొన్నిఊళ్ళకు వ్యవసాయ కూలీలు పని వెతుక్కుంటూ వస్తున్నారు. మగవాళ్లు రోజుకి రూ. 500-600, ఆడవాళ్లు రోజుకి రూ. 300-400 సంపాదించుకుంటారు, సంవత్సరం పొడవునా పని ఉంటుంది.“ ఇప్పుడు ఈ 29 గ్రామాలవాళ్ళకే పని దొరక్క దూరప్రాంత గ్రామాలకి పని వెతుక్కుంటూ వెళ్తున్నారు,” చెప్పారు కృష్ణ.
“మీరు ఏం పంటలు పండిస్తారు?” అని నేనతన్ని అడిగాను. ఠక్కుమని జవాబు వచ్చింది: “మీరు నాకు ఒక పంట పేరు చెప్పండి. వచ్చే సంవత్సరం నేను దాన్ని పండించి చూపిస్తాను, పంట కూడా బాగా పండుతుందని ఖచ్చితంగా చెప్పగలను. నేను మిమ్మల్ని తీసుకెళ్లి ఈ చుట్టుపక్కల పండే 120 రకరకాల పంటలు చూపించగలను.” కృష్ణ ప్రస్తుతం అరటి, మొక్కజొన్న పెంచుతున్నారు. అతని లాంటి రైతులకి ఆ ప్రాంతంలో ఉన్న బలమైన వ్యవసాయ-మార్కెట్ అనుసంధానాలు అదనపు బోనస్.
ఇటువంటి లాభదాయక వ్యవసాయ భూములను తీసుకున్న తర్వాత రాష్ట్రం ఎలాంటి ఉద్యోగాలు సృష్టిస్తుందో శివకి తెలియదు. “ఆ యాభై లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయ్? ఒకవేపు జీవనోపాధి అవకాశాలు తగ్గిపోతూవుంటే ఈ చెప్పేదంతా ఉత్త చెత్త. ఇక్కడ జరుగుతున్నది అభివృద్ధి మాటున రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఇది ప్రజల రాజధాని కాదు. ఈ రాజధాని ధనికుల కోసం బహుళజాతి కార్పొరేట్ల కోసం, సూట్లు వేసుకునే వాళ్లకోసం. అంతే తప్ప, మా లాంటి సామాన్య ప్రజల కోసం కాదు.”
ఈ వరసలో ఇంకొన్ని శీర్షికలు:
New capital city, old mechanisms of division
వాగ్దానం చేసిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం మాకు ఉద్యోగాలివ్వాలి
ఆకాశాన్నంటుతున్న భూముల ధరలు, చిన్నరైతులకు భారమవుతున్న వ్యవసాయం
రైతు కూలీల ఉపాధిని కాజేసిన రాజధాని
మహా రాజధాని నగరం, చాలీచాలని జీతాల వలసకూలీలు
అనువాదం: దీప్తి
Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]
Donate to PARI
All donors will be entitled to tax exemptions under Section-80G of the Income Tax Act. Please double check your email address before submitting.
PARI - People's Archive of Rural India
ruralindiaonline.org
https://ruralindiaonline.org/articles/ఇది-ప్రజల-రాజధాని-కాదు

