ఈ ప్యానెల్ కనిపించే పని , కనిపించని మహిళలు అనే ఛాయాచిత్ర ప్రదర్శన (ఫోటో ఎగ్జిబిషన్) లో భాగంగా ఉంది . ఈ ప్రదర్శన గ్రామీణప్రాంతాలలో మహిళలు చేసే ఉన్నతస్థాయి పనిని వర్ణించే ఫోటోల ఎగ్జిబిషన్ . ఇందులోని ఛాయాచిత్రాలను పి . సాయినాథ్ 1993 నుండి 2002 మధ్యకాలంలో 10 భారతీయ రాష్ట్రాలలో పర్యటించి , తీశారు . అనేక సంవత్సరాల పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రదర్శించబడిన ఈ ఫోటో ఎగ్జిబిషన్ ను , PARI సృజనాత్మకంగా డిజిటలైజ్ చేసింది.
మట్టి, అమ్మ, 'దినసరి వేతనం'
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో భూమిలేని కార్మికులతో సమావేశం ఉదయం 7 గంటలకు కొంచం ముందుగా ఉంటుందని నిర్ణయమైంది. రోజంతా వారి పనివిధానం ఎలా వుంటుందో తెలుసుకోవాలనే ఆలోచనతోనే అలా నిర్ణయించుకున్నాం. అయినా మాకు ఆలస్యమయింది. మేము వెళ్ళేప్పటికే, తాటి తోపు గుండా నడిచి పొలాలకు వెడుతూ, లేదంటే పని స్థలంలో, తవ్వివున్న గొయ్యిలోని మట్టిని బయటకు తోడుతూ, మూడు గంటలుగా అలా పనిచేస్తూనే ఉన్నారు.
ఈ స్త్రీలలో చాలామంది అప్పటికే వంట చేయడం, పాత్రలు కడగటం, బట్టలు ఉతకడం, ఇంకా కొన్ని ఇతర ఇంటి పనులను ముగించారు. పిల్లలను బడికి వెళ్ళేందుకు సిద్ధం చేశారు. కుటుంబ సభ్యులందరికీ అన్నం పెట్టేశారు. యథావిధిగా మహిళలు చివరిగా తిన్నారు. కాని ప్రభుత్వ ఉపాధి హామీ సైట్లో మాత్రం పురుషుల కంటే మహిళలకు తక్కువ వేతనం ఇస్తున్నట్లు స్పష్టంగా ఉంటుంది.
ఇక్కడ కనీస వేతన చట్టం స్త్రీపురుషులిద్దరికీ ఉల్లంఘించబడుతోందనేది కూడా మరింత స్పష్టంగా తెలుస్తోంది. కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలను మినహాయించి దేశంలోని చాలా ప్రాంతాలలో ఇలాగే ఉంది. అయినప్పటికీ, మహిళా కార్మికులకు ప్రతిచోటా పురుషులకు ఇచ్చే వేతనంలో సగం లేదా మూడింట రెండు వంతులు మాత్రమే లభిస్తోంది.







