ఈ ప్యానెల్ కనిపించే పని , కనిపించని మహిళలు అనే ఛాయాచిత్ర ప్రదర్శన (ఫోటో ఎగ్జిబిషన్) లో భాగంగా ఉంది . ఈ ప్రదర్శన గ్రామీణప్రాంతాలలో మహిళలు చేసే ఉన్నతస్థాయి పనిని వర్ణించే ఫోటోల ఎగ్జిబిషన్ . ఇందులోని ఛాయాచిత్రాలను పి . సాయినాథ్ 1993 నుండి 2002 మధ్యకాలంలో 10 భారతీయ రాష్ట్రాలలో పర్యటించి , తీశారు . అనేక సంవత్సరాల పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రదర్శించబడిన ఈ ఫోటో ఎగ్జిబిషన్ ను , PARI సృజనాత్మకంగా డిజిటలైజ్ చేసింది.
తలపై ‘మల’ భారం!
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరానికి చెందిన ఈ వృద్ధురాలు తన ఇంటినీ, పరిసరాలను ఏ మాత్రం మురికీ లేకుండా శుభ్రంగా ఉంచుకుంటారు. అది ఇంటి పని – అలాగే ‘మహిళల పని’ కూడా. ఇంట్లోనైనా, బహిరంగ స్థలాల్లోనైనా ‘శుభ్రం చేసే’ పారిశుధ్య పనులు ఎక్కువగా మహిళలే చేస్తుంటారు. కానీ ఈ పని ద్వారా వారికి లభించే ఆదాయంకన్నా ఈసడింపులే ఎక్కువ. రాజస్థాన్కు చెందిన ఈ మహిళ లాంటి వారికైతే ఇది మరింత దారుణం. ఆమె ఒక దళితమహిళ. ఇళ్లల్లో ఉండే మరుగుదొడ్లను చేత్తో శుభ్రం చేసే ‘పాకీ’ పని చేసే మనిషి. రాజస్థాన్లోని సీకర్లో ప్రతి రోజూ దాదాపు 25 ఇళ్లలో ఆమె ఈ పని చేస్తుంటారు.
ఇందుకు ప్రతిఫలంగా ప్రతి ఇంటి నుంచీ ఆమెకు ఒక రోటీ ఇస్తారు. వాళ్లు దయగలవారైతే నెలకోసారి కొన్ని రూపాయలు కూడా ఇస్తుంటారు. బహుశా ఇంటికో 10 రూపాయలు. అధికార వర్గాలు ఆమెను ‘భంగీ’ అని పిలుస్తారు. ఆమె మాత్రం తనను తాను ‘మెహతర్’ అని చెప్పుకుంటుంది. ఇలాంటి పనులు చేసే చాలా కులాల వాళ్లు ఇటీవల తమను తాము ‘బాల్మీకులు’గా చెప్పుకోవడం బాగా పెరిగింది.
ఆమె తన తలపైన తట్టలో మోసుకెళ్తున్నది మానవ మలం. సభ్య సమాజం దాన్ని ‘నైట్ సాయిల్’ అని పిలుస్తుంది. దేశంలో ఏ మాత్రం రక్షణ లేకుండా, దుర్భరమైన దోపిడీకి గురయ్యే వారిలో ఆమె కూడా ఒకరు. ఒక్క రాజస్థాన్లోని సీకర్లోనే చూసుకున్నా ఆమె లాంటి వాళ్లు కొన్ని వందల మంది ఉంటారు.
భారతదేశంలో ఎంత మంది చేతులతో మలాన్ని శుభ్రంచేసేవారున్నారు? నిజానికి ఇది ఎవ్వరికీ తెలియదు. 1971లో జరిగిన జనాభా లెక్కల నాటి వరకూ దాన్నో ప్రత్యేకమైన వృత్తిగానే గుర్తించలేదు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలైతే అసలు మలాన్ని చేత్తో ఎత్తిపోసే వాళ్లు లేనే లేరని అంటున్నాయి. అయినప్పటికీ, అందుబాటులో ఉన్న అరకొర డేటా ప్రకారం చూసినా, దాదాపు 10 లక్షల మంది దళితులు చేతులతో మలాన్ని శుభ్రంచేసేవారుగా బతుకులీడుస్తున్నారు. అసలు సంఖ్య ఇంతకన్నా ఎక్కువే ఉండొచ్చు. ఈ పనులు చేసే వాళ్లలో కూడా అత్యధికులు మహిళలే.




