ఈ ప్యానెల్ కనిపించే పని, కనిపించని మహిళలు అనే ఛాయాచిత్ర ప్రదర్శన (ఫోటో ఎగ్జిబిషన్) లో భాగంగా ఉంది . ఈ ప్రదర్శన గ్రామీణప్రాంతాలలో మహిళలు చేసే ఉన్నతస్థాయి పనిని వర్ణించే ఫోటోల ఎగ్జిబిషన్ . ఇందులోని ఛాయాచిత్రాలను పి . సాయినాథ్ 1993 నుండి 2002 మధ్యకాలంలో 10 భారతీయ రాష్ట్రాలలో పర్యటించి , తీశారు . అనేక సంవత్సరాల పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రదర్శించబడిన ఈ ఫోటో ఎగ్జిబిషన్ ను , PARI సృజనాత్మకంగా డిజిటలైజ్ చేసింది.
కష్టాలకు చిరునామా...
ఆమె వంట పని అప్పటికే పూర్తయింది. తమిళనాడుకు చెందిన ఈ మహిళ కుటుంబం బతుకుదెరువు కోసం తాటి బెల్లం (మొలాసిస్) తయారు చేసి అమ్ముతుంది. ఒక పెద్ద పాత్రలో ఉన్న ఆ పదార్థాన్నే ఆమె ఇక్కడ కలియబెడుతోంది. ఆమె నించి ఒక చిన్న పొరపాటు జరిగినా వాళ్ల కుటుంబానికి కొద్ది రోజుల పాటు ఆదాయం లేకుండా పోతుంది.
ఈ పనికి ఈమెకు చాలా సమయమే పడుతుంది. వంటపనికి మరి కొంత సమయం. ఈ పనులన్నీ ఒకదాని తర్వాత మరొకటి చేసేటప్పుడు ఈమె కొన్ని గంటల పాటు పొగను, వాసనల్నీ పీల్చుకోవాల్సి వస్తుంది. ఒక మహిళగా ఆమెకు కేటాయించిన ఇతర పనులకు ఇది అదనం అన్నమాట. ఈ పనుల్ని ఈమె పైన చాలా చిన్న వయసులోనే మోపారు కాబట్టి, లక్షలాది మంది ఇతర మహిళల్లాగే, ఈమె కూడా చిన్నప్పుడే బడి మానేయాల్సి వచ్చింది.









