ఈ ప్యానెల్ కనిపించే పని, కనిపించని మహిళలు అనే ఛాయాచిత్ర ప్రదర్శన (ఫోటో ఎగ్జిబిషన్) లో భాగంగా ఉంది . ఈ ప్రదర్శన గ్రామీణప్రాంతాలలో మహిళలు చేసే ఉన్నతస్థాయి పనిని వర్ణించే ఫోటోల ఎగ్జిబిషన్. ఇందులోని ఛాయాచిత్రాలను పి. సాయినాథ్ 1993 నుండి 2002 మధ్యకాలంలో 10 భారతీయ రాష్ట్రాలలో పర్యటించి, తీశారు. అనేక సంవత్సరాల పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రదర్శించబడిన ఈ ఫోటో ఎగ్జిబిషన్ ను, PARI సృజనాత్మకంగా డిజిటలైజ్ చేసింది.
కనిపించే పని, కనిపించని మహిళలు
ఆమె కొండ వాలు మీదుగా పైకి వస్తోంది, తలపైనున్న భారీ బరువు ఆమె ముఖాన్ని కప్పేసింది. కనిపించే పని వెనుక కనిపించని స్త్రీ. ఒడిశాలోని మల్కన్గిరిలోని ఈ భూమిలేని మహిళకు ఇది కేవలం మరో రోజు శ్రమ మాత్రమే. నీరు, వంటచెరకు, పశువుల మేత తీసుకురావడం- ఇవి స్త్రీ జీవితంలో మూడో వంతు భాగాన్ని హరించే మూడు పనులు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మహిళలు తమ కుటుంబం కోసం నీరు, వంటచెరుకు సమకూర్చడానికి రోజుకు ఏడు గంటల సమయం వరకు వెచ్చిస్తారు. పశువల మేతను సేకరించడానికి కూడా సమయం పడుతుంది. గ్రామీణ భారతదేశంలోని లక్షలాది మంది మహిళలు ఆ మూడు వస్తువులను సేకరించేందుకు ప్రతిరోజూ అనేక కిలోమీటర్లు నడుస్తారు.
మహిళలు తలపై మోసే బరువులు చాలా భారీగా ఉంటాయి. మల్కన్గిరిలో ఒక కొండవాలుపైకి వెళ్తున్న ఆదివాసీ మహిళ తలపై దాదాపు 30 కిలోల బరువున్న కట్టెలున్నాయి. ఆమె ఇంకా మూడు కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సి ఉంది. చాలామంది మహిళలు ఇంటికి నీటిని మోసుకురావడానికి కూడా ఇదే విధంగా ఇంతలేసి దూరాలు లేదా ఇంకా ఎక్కువ దూరాలు కూడా ప్రయాణిస్తారు.






