హర్మన్దీప్ సింగ్ తన చుట్టూ పరచుకున్న రంగురంగుల గాలిపటాలతో నిలబడి ఉన్నాడు. అక్కడికి కాస్త ముందర పంజాబ్, హర్యానాల మధ్య ఉన్న శంభూ సరిహద్దు వద్ద రైతులు దిల్లీలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు పోలీసులు భారీ అవరోధాలు ఏర్పాటు చేశారు.
నిరసన తెలుపుతోన్న రైతులపై బాష్పవాయు గోళాలను కురిపిస్తోన్న డ్రోన్లను కిందకు దించడానికి అమృత్సర్కు చెందిన 17 ఏళ్ళ ఈ కుర్రాడు వినూత్నమైన పద్ధతిలో గాలిపటాలను ఉపయోగించాడు. “బాష్పవాయువు ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని నేను నా కళ్ళ చుట్టూ టూత్పేస్ట్ను కూడా పూసుకున్నాను. మేం ముందుకు సాగి ఈ యుద్ధంలో విజయం సాధిస్తాం,” అన్నాడు హర్మన్.
ఫిబ్రవరి 13, 2024న పంజాబ్ నుండి దిల్లీకి శాంతియుతంగా కవాతును ప్రారంభించిన వేలాదిమంది రైతులు, కార్మికులలో హర్మన్దీప్ ఒకరు. శంభూ సరిహద్దు వద్ద వారికి పారామిలటరీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) సిబ్బంది, పోలీసు అధికారులు ఎదురయ్యారు. దిల్లీలో తాము నిరసన చేపట్టబోయే ప్రదేశానికి రైతులు చేరుకోకుండా రోడ్డుపై ఇనుప మేకులు, కాంక్రీట్ గోడలు వేశారు.
మొదటి అవరోధం వద్ద, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం కనీస మద్దతు ధర (MSP) హామీ, రైతులకు, రైతు కూలీలకు పూర్తి రుణమాఫీ, లఖింపూర్ ఖేరీ ఊచకోతలో నష్టపోయిన రైతులకు న్యాయం చేయటం, దోషులను అరెస్టు చేయడం, రైతులకు, కార్మికులకు పింఛను పథకాన్ని ప్రవేశపెట్టడం, 2020-2021 నిరసనలలో అమరులైన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించడం - ఈ ఐదు ప్రధాన డిమాండ్లను పునరుద్ఘాటిస్తూ గురుజాండ్ సింగ్ ఖాల్సా మాట్లాడారు.
























