విజయ్ మరోత్తర్ తన తండ్రితో తాను చివరిసారి జరిపిన సంభాషణను తల్చుకుని చాలా బాధపడుతుంటాడు.
అది చాలా తేమగా ఉన్న ఒక వేసవి సాయంత్రం, యవత్మాల్ జిల్లాలోని వారి గ్రామం మెల్లగా మలి సంధ్యలోకి జారుతోంది. అతను మసక వెలుతురుగా ఉన్న గుడిసెలో తన తండ్రికి, తనకు రెండు పళ్ళాలలో - చక్కగా మడతపెట్టిన రెండు రోటీలు, పప్పుకూర, ఒక గిన్నె అన్నం పెట్టాడు.
కానీ అతని తండ్రి ఘనశ్యామ్ ప్లేట్ను చూసి ఒక్కసారిగా తన సహనాన్ని కోల్పోయారు- ‘ఉల్లిపాయ ముక్కలేవి?’ దానికి ఆయనంత ఎక్కువగా ప్రతిస్పందించాల్సిన అవసరం లేదని పాతికేళ్ళ విజయ్ అభిప్రాయం. అయితే, అతను అప్పుడప్పుడూ ఆయన ప్రవర్తనలో మార్పును గమనిస్తున్నాడు. "కొంతకాలం నుంచి ఆయన పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు," అని చెప్పాడతను. "చిన్న విషయాల మీదే ఆయన పెద్ద రాద్దాంతం చేసేవారు." మహారాష్ట్రలోని అక్పురీ గ్రామంలోని తమ ఒంటి గది గుడిసె బయట ఖాళీ ప్రదేశంలో ప్లాస్టిక్ కుర్చీపై కూర్చునివున్న విజయ్ చెప్పాడు.
విజయ్ వంటగదిలోకి వెళ్లి తన తండ్రి కోసం ఉల్లిపాయ ముక్కలు తరిగాడు. అయితే రాత్రి భోజనం అయ్యాక ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. విజయ్ ఆ రాత్రి చాలా అన్యమనస్కంగా పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం తన తండ్రితో మంచిగా మాట్లాడాలనుకున్నాడు.
కానీ ఘనశ్యామ్ ఆ మరుసటి రోజు ఉదయం నిద్రలోంచి లేవలేదు.
59 ఏళ్ల ఆ రైతు రాత్రే పురుగుల మందు తాగారు. విజయ్ మేల్కొనడానికి ముందే ఆయన మరణించారు. అది ఏప్రిల్ 2022.









