97 ఏళ్ళ వయస్సులో కూడా లక్ష్మీకాంత మహతోకు గాయకుడికుండే స్పష్టమైన, ప్రతిధ్వనించే స్వరం ఉంది. ఆకట్టుకునే నడత ఉన్న ఈ అందమైన వ్యక్తి స్వరూపం మనకు ఒక్కసారిగా రవీంద్రనాథ్ ఠాగూర్ను గుర్తుకుతెస్తుంది.
మేమాయన్ని 2022 మార్చిలో కలిసినప్పుడు, పశ్చిమ బెంగాల్లోని పీర్రా గ్రామంలో ఒక శిథిలావస్థలో ఉన్న ఒంటిగది కచ్చా ఇంటిలో, తన ప్రియమైన స్నేహితుడు ఠేలూ మహతో పక్కన ఒక చార్పాయ్ (మంచం) మీద కూర్చొనివున్నారు.
అప్పటికి ఠేలూ మహతో వయసు 103 ఏళ్ళు. ఆయన 2023లో మరణించారు. చదవండి: ఠేలూ మహతో నిర్మించిన బావి
ఠేలూ దాదూ (తాతయ్య) ఈ ప్రాంతంలోని చిట్టచివరి స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరు. ఎనభై సంవత్సరాల క్రితం ఆయన పురూలియా (పురూర్లియా అని కూడా పిలుస్తారు) జిల్లాలోని ఒక పోలీస్ స్టేషన్పైకి కవాతు చేశారు. అది 1942వ సంవత్సరం, ఆయన తిరుగుబాటు చర్య క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించిన స్థానిక అధ్యాయంలోని ఒక భాగం.
ఘెరావ్లో పాల్గొనడానికి నాయకులు నిర్ణయించిన 17 ఏళ్ళ వయసు పరిమితి కంటే తక్కువ వయస్సు ఉన్నందున చిన్నవాడైన లక్ష్మీ ఆ పోలీస్ స్టేషన్కు సంబంధించిన సంఘటనలలో పాల్గొనలేదు.
ఠేలూ గానీ లక్ష్మీ గానీ స్వాతంత్ర్య సమరయోధుని మూస పద్ధతులకు అనుగుణంగా ఎప్పుడూ లేరు. ఖచ్చితంగా రాజ్యం, లేదా కులీన సమాజం సృష్టించిన మూసలో మాత్రమైతే లేరు. నిరసన కార్యక్రమాలలో వాళ్ళు ఏదో సంఖ్య కోసం పాల్గొన్న వ్యక్తులు కూడా కాదు. ఇద్దరూ తమ విషయాలపై పూర్తి అవగాహనతో మాట్లాడతారు: ఠేలూ వ్యవసాయం గురించీ, ఆ ప్రాంత చరిత్ర గురించీ మాట్లాడితే, లక్ష్మీ సంగీతం గురించీ, సంస్కృతి గురించీ.


