అడవిరాజును వేచివుండేలా చేయకండి
సింహాలు వస్తున్నాయి. గుజరాత్ నుండి. ప్రతి ఒక్కరూ వాటి ప్రవేశాన్ని ఎలాంటి కష్టం లేకుండా ముందుకు సాగేలా చేయాలి
మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో ఉన్న గ్రామాలలో, ఇదంతా ఎలా జరుగుతుందో అనే అనిశ్చితి ఉన్నప్పటికీ, అది మంచి విషయంగానే కనిపించింది.
“ఆ పెద్ద పిల్లులు వచ్చాక, ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందుతుంది. మాకు గైడ్లుగా ఉద్యోగాలు వస్తాయి. మేం ఈ ప్రదేశంలో దుకాణాలను, తినుబండారాల దుకాణాలను నిర్వహించుకోవచ్చు. మా కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి.” అని కూనో పార్కుకు వెలుపల ఉండే అగరా గ్రామానికి చెందిన 70 ఏళ్ళ రఘులాల్ జాటవ్ మాతో అన్నారు.
"మేం మంచి నాణ్యమైన నీటిపారుదల ఉన్న భూమి, అన్ని వాతావరణాలలోనూ ప్రయాణించే వీలున్న రోడ్లు, గ్రామం మొత్తానికీ విద్యుత్, అన్ని సౌకర్యాలను పొందుతాం" అని రఘులాల్ చెప్పారు
"ఏదైతేనేం, సర్కార్ (ప్రభుత్వం) మాకిచ్చిన హామీ అయితే ఇదే," అని ఆయన అన్నారు.
అందువల్ల పాయరాలోని ప్రజలతో పాటు 24 గ్రామాలలోని దాదాపు 1,600 కుటుంబాలు కూనో నేషనల్ పార్క్లోని తమ ఇళ్లను ఖాళీ చేశారు. వీరు ప్రధానంగా సహరియా ఆదివాసులు, దళితులు, పేద ఇతర వెనుకబడిన తరగతులకు (ఒబిసి) చెందినవారు. వారి ప్రవాస ప్రయాణం చాలా హడావుడిగా సాగింది.
ట్రాక్టర్లను తీసుకొచ్చారు. త్వరత్వరగా ఇళ్ళను ఖాళీ చేయాల్సి రావడంతో ఆదివాసులు తాము పోగుచేసి ఉంచుకున్న అనేక తరాలకు చెందిన సంపదను వదిలేసి రావలసివచ్చింది. వారింకా ప్రాథమిక పాఠశాలలను, చేతి పంపులను, బావులను, తరతరాలుగా తాము సాగుచేసిన భూములను కూడా విడిచిపెట్టేశారు. చివరకు పశువులను కూడా వదిలేశారు. ఎందుకంటే అడవిలో ఉన్నట్టు పుష్కలమైన మేత లేకుంటే, పశువుల పోషణ వారికి చాలా భారంగా మారుతుంది.
ఇదంతా జరిగి 23 ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళింకా సింహాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.


















