పశువుల కొట్టంలోని ఇటుకలు పరిచిన మట్టి నేల మీద నున్న గేదె పేడను మంజీత్ కౌర్(48) రెండు చేతులతో ఎత్తి తీశారు. ముడుకులపై కూర్చున్న ఆమె నేలపై ఇంకా పచ్చిగా ఉన్న పేడనంతా గీరి, ఒక బాల్టా(గోలెం)లోకి ఎత్తి, దాన్ని తల మీదకు ఎత్తుకున్నారు.. తలపై ఉన్న బరువు కింద పడకుండా జాగ్రత్తగా నడుస్తూ, ఆ పశువుల పాకకున్న చెక్క గేట్లను దాటి 50 మీటర్ల దూరంలో ఉన్న పేడ కుప్ప వద్దకు వెళ్ళారు. ఆమె నెలల తరబడి పడిన శ్రమకు గుర్తుగా, ఆ పేడకుప్ప ఆమె ఛాతీ అంత ఎత్తులో ఉంది
ఇది ఏప్రిల్ నెలలో ఎండలు మండిపోతున్న ఓ మధ్యాహ్నం. అరగంటలో మంజీత్, ఈ చిన్న దూరాన్ని - నెత్తిపై పేడ గోలెంను మోసుకుంటూ పేడదిబ్బ దగ్గరదాకా - ఎనిమిది సార్లు తిరిగారు. చివరగా, ఒట్టి చేతులతోనే ఆ గోలేన్ని నీటితో కడిగారు. రోజూ అక్కడినుంచి ఇంటికి బయలుదేరే ముందు, ఆమె తన చిట్టి మనవడి కోసం ఒక గేదె నుండి అర లీటరు పాలను తీసి, ఒక చిన్న స్టీలు పాల డబ్బాలో నింపుకుంటారు.
ఇలా ఉదయం 7 గంటల నుండి మొదలుపెట్టి ఆమె పనిచేసే ఇళ్ళల్లో ఇది ఆరవ ఇల్లు. ఈ ఇళ్ళన్నీ హవేలియాఁ గ్రామంలోని పెత్తందారీ కులాలకు చెందిన భూస్వాములైన జాట్ సిక్కులకు చెందినవి. ఈ గ్రామం పంజాబ్లోని తరన్ తారన్ జిల్లాలో ఉంది.
"మజ్బూరీ హై (చాలా కష్టం)," అంటారామె. నిస్సహాయతే ఆమెను బతుకుదెరువు కోసం పశువుల పాకలను శుభ్రం చేయడానికి పురికొల్పుతోంది. ఒక్క రోజులో ఆమె తన తలపై ఎంత పేడ మోస్తుందో ఆమెకే ఖచ్చితంగా తెలియదు, కానీ "బడ్డా సిర్ దుఖ్దా హై, భార్ చుక్దే చుక్దే (తలపై బరువు మోసీ మోసీ నా తల చాలా నొప్పిగా ఉంటుంది)" అని చెప్పారామె.
ఆమె ఇంటికి తిరిగివెళ్ళే దారి పొడుగునా, బంగారుపసుపు వన్నె గోధుమ పొలాలు దిగంతాల దాకా విస్తరించి ఉన్నాయి. అవి త్వరలోనే, పంజాబ్లో పంట కాలం ప్రారంభమయ్యే ఏప్రిల్ నెలలో జరిగే బైసాఖి పండుగ తర్వాత, కోతకు వస్తాయి. గండీవిండ్ బ్లాక్లో ఉన్న వ్యవసాయ భూమిలో చాలా భాగం హవేలియాఁ జాట్ సిక్కులకు చెందినదే. అందులో ఎక్కువగా వరి, గోధుమ పండుతాయి.















