చీకటి, విరామాల్లో వెళ్తున్న రైళ్ల ఈలలు- ఈ రెండూ ఒక మగవాడు తమని చూస్తున్నాడు అనే భావన వలన కలిగే అశాంతిని మాత్రం కలిగించవు.
"రాత్రుల్లో రైల్వే ట్రాకులు మాత్రమే మాకు అందుబాటులో ఉండే టాయిలెట్లు," అంటుంది పదిహేడేళ్ల నీతూ కుమారి.
నీతూ దక్షిణ మధ్య పాట్నాలోని యార్పూర్ లోని తొమ్మిదో నెంబర్ వార్డులోని బస్తీలో ఉంటుంది. ఈ ఇళ్ల గుంపు మధ్య సిమెంటు వేసి ఉన్న ఒక చోటులో, నల్లాల వరస దగ్గర దాదాపు బట్టలన్నీ తీసేసి స్నానం చేస్తున్న ఇద్దరు పురుషులు గట్టిగా సబ్బు రుద్దుకుంటున్నారు. దాదాపు డజను మంది అబ్బాయిలు నీళ్లతో ఆడుకుంటూ, జారుగా ఉన్న నేలపై పడుతూ ఒకరిని ఒకరి లాగి పడేస్కుంటూ నవ్వుతూ అరుస్తున్నారు.
దాదాపు 50 మీటర్ల దూరంలో, ఒక టాయిలెట్ బ్లాక్ - ఈ కాలనీలో ఉన్నది ఒక్కటే - నిరుపయోగంగా ఉంది, దాని 10 క్యూబికల్లలో ప్రతి ఒక్కటి తాళం వేసి ఉంది, మహమ్మారి కారణంగా ఈ ప్రజా సౌకర్యాన్ని కమ్యూనిటీకి అప్పగించడం ఆలస్యం అయింది. కొంచెం ఎత్తులో ఆ బ్లాక్ రెండు మెట్లపై మేకలు సేద తీరుతున్నాయి. ఆ వెనకే ఉన్న రైల్వే ట్రాక్లపై చెత్త కుప్పలు పడి ఉన్నాయి. అక్కడి నుంచి వాడుకలో ఉన్న పబ్లిక్ టాయిలెట్ పది నిమిషాల నడక దూరంలో ఉంది, కొందరు యార్పూర్ కి మరో వైపున ఉన్న టాయిలెట్కు వెళ్ళడానికి ట్రాక్లను దాటి వెళ్తారు- ఇది కూడా 10 నిమిషాల పాటు ప్రయాసతో కూడిన నడకే.
"అబ్బాయిలు ఆ పని ఎప్పుడైనా ఎక్కడైనా చేస్తారు. అమ్మాయిలు ట్రాకులని రాత్రి పూట మాత్రమే వాడతారు," అంటుంది బిఏ మొదటి సంవత్సరం విద్యార్థిని నీతూ. (ఈ కథలో అన్ని పేర్లు మార్చబడ్డాయి.) ఆ ప్రాంతంలో ఉండే మిగతా అమ్మాయిల కన్నా తనని తాను అదృష్టవంతురాలిగా భావిస్తుంది - పగటి సమయంలో 200 మీటర్ల దూరంలో ఉన్న తన పిన్ని ఇంట్లో టాయిలెట్ వాడుకోగలదు.
"అంతే గాక, మా ఇంట్లో రెండు గదులు ఉన్నాయి, ఒక దాంట్లో మా తమ్ముడు పడుకుంటాడు, నాకు అమ్మకి ఒక గది. అంటే కనీసం ప్యాడ్లు మార్చుకోవడానికి నాకు ఇంట్లో ఏకాంతంగా ఉండే ఒక చోటు ఉంది ," అంటుంది నీతూ. "చాల మంది అమ్మాయిలు, మహిళలు రైల్వే ట్రాక్ల మీద నాప్కిన్లు మార్చుకోడానికి, రోజంతా ఎదురు చూస్తారు - అన్నిటి కన్నా చీకటిగా ఉండే భాగంలో."










