చాణ్డాలశ్చ వరాహశ్చ కుక్కుటః శ్వా తథైవ చ |
రజస్వలా చ షణ్డశ్చ నైక్షేరన్నశ్నతో ద్విజాన్ ||
చండాలుడు, ఊర పంది, కోడి, కుక్క,
బహిష్టు స్త్రీ, నపుంసకుడు భోజనం చేస్తున్న బ్రాహ్మణుని చూడరాదు
— మనుస్మృతి 3.239
ఒక్క దొంగచూపు మాత్రమే కాదు, ఈ తొమ్మిదేళ్ల బాలుడి పాపం మరింత పొగరుతో కూడినది. ఇంద్ర కుమార్ మేఘ్వాల్ అనే 3వ తరగతి విద్యార్థి తన దాహాన్ని ఆపుకోలేకపోయాడు. దళితుడైన ఆ బాలుడు అగ్రవర్ణ అధ్యాపకుల కోసం విడిగా ఉంచిన కుండ నుండి నీళ్ళు తాగాడు.
శిక్ష పడింది. రాజస్థాన్లోని సురానా గ్రామంలోని సరస్వతీ విద్యా మందిర్లో, 40 ఏళ్ల అగ్రవర్ణ ఉపాధ్యాయుడు చైల్ సింగ్ ఎలాంటి కనికరం లేకుండా ఆ బాలుడ్ని కొట్టాడు.
25 రోజుల తర్వాత, సహాయం కోసం 7 ఆసుపత్రులను సందర్శించిన తర్వాత, భారత స్వాతంత్ర్య దినోత్సవం ముందురోజు, జాలోర్ జిల్లాకు చెందిన ఈ చిన్నపిల్లవాడు అహ్మదాబాద్ నగరంలో తుది శ్వాస విడిచాడు.


