ఆమె కేవలం తన పేరును మాత్రమే చదవగలరు, రాయగలరు. దేవనాగరి లిపిలో తన పేరుని సగర్వంగా, జాగ్రత్తగా గో-పుహ్-లీ అని రాశాక, ఆ వెంటనే ఆమె తెరలుతెరలుగా నవ్వారు.
తమ మనసులో నిశ్చయించుకున్నదేదైనా మహిళలు సాధించగలరని నలుగురు పిల్లల తల్లైన 38 ఏళ్ళ గోప్లీ గమేతీ చెప్పారు.
ఉదయ్పుర్ జిల్లా గోగుందా బ్లాక్ లోని కర్దా గ్రామ శివార్లలో కేవలం 30 ఇళ్ళు మాత్రమే ఉన్న ఈ ప్రాంతంలో గోప్లి తన నలుగురు పిల్లల్ని ఇంటి దగ్గరే ప్రసవించారు. ఆమె ఇంటికి దగ్గర్లో ఉనండే కొంతమంది మహిళలు ఆమెకు ప్రసవంలో సహాయం చేశారు. నాలుగో బిడ్డకు (మూడో కూతురు) జన్మనిచ్చిన కొన్ని నెలల తర్వాత, మొదటిసారిగా ఆమె – ట్యూబల్ లైగేషన్ (ట్యూబెక్టమీ లేదా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిస్త్స) చేయించుకోడానికి ఆస్పత్రికి వెళ్ళారు.
“మా కుటుంబం సంపూర్ణమైందని ఒప్పుకోవడానికి ఇదే సరైన సమయం,” అని ఆమె అన్నారు. గోగుందా సామాజిక ఆరోగ్య కేంద్రం (కమ్యూనిటీ హెల్త్ సెంటర్ - సిఎచ్సి)కి చెందిన ఒక ఆరోగ్య కార్యకర్త, గర్భ నిరోధక “శస్త్రచికిత్స” గురించి ఆమెకు వివరించారు. దాన్ని ఉచితంగా చేస్తారు. ఇందుకోసం ఆవిడ, అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తోన్న సిఎచ్సికి వెళ్తే సరిపోతుంది. నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పిఎచ్సిలు) ఆరోగ్య సేవలందించే గ్రామాలకు ఈ సిఎచ్సి కూడా సేవలందిస్తుంది.
ఈ విషయం గురించి (ట్యూబెక్టమీ) చాలాసార్లు తన భర్త దగ్గర ప్రస్తావించినప్పటికీ, అతను పట్టించుకోలేదు. దాంతో, తన చిన్నారి పసిబిడ్డకు పాలిచ్చి పెంచుతూ, నెలల తరబడి ఆలోచించి, తన నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆవిడ మానసికంగా సిద్ధమయ్యారు.













