మా ఎనిమిది మంది ప్రయాణీకుల బృందం ఆ పుస్తకాలను సంభ్రమంతో పరికించింది. ఒక్కో పుస్తకం ఒక సాహిత్య నిధి. ఒక కళాఖండం. చివరికి రాజకీయ రచనలు కూడా. ఒక సస్పెన్స్ పుస్తకం కానీ, జనాదరణ పొందినవి కానీ, ఆడపిల్లలు ఇష్టపడే ప్రేమ సాహిత్యం కానీ లేవు. తమిళ మహా కావ్యం శిలప్పధికారం మలయాళం అనువాదం ఉంది. వైగోం ముహమ్మద్ బషీర్, ఎం టి వాసుదేవన్ నాయర్, కమలా దాస్ రచనలు ఉన్నాయి. ఎం. ముకుందన్, లలితాంబిక అంతర్జనం మొదలైన వారి రచనలు ఉన్నాయి. మహాత్మా గాంధీ రచనలతో పాటు, తోప్పిల్ బసి యు మేడ్ మి ఏ కమ్యునిస్ట్ వంటి విప్లవ సాహిత్యం కూడా ఉంది.
“కానీ చిన్నతంబీ, ఇక్కడ జనాలు ఇలాంటి పుస్తకాలు నిజంగా చదువుతారా?” బయటకి వచ్చి కూర్చున్నాక మేం అడిగాం. చాలా ఆదివాసీ తెగల మాదిరిగా ముత్తవాన్లు కూడా చాలా పేదరికం, లేమిలో ఉండి, ఇతర భారతీయుల కంటే తరచుగా చదువు మధ్యలో మానేస్తుంటారు. మా ప్రశ్నకి బదులుగా అతను తన గ్రంథాలయం రిజిస్టర్ బయటకు తీశారు. జనాలు తీసుకుని వెళ్ళి తిరిగి ఇచ్చిన పుస్తకాల నమోదు రిజిస్టర్ అది. ఆ కటిక పల్లెటూరులో 25 కుటుంబాలే ఉండచ్చుగాక, కానీ 2013లో 37 పుస్తకాలు పట్టుకెళ్ళారు పాఠకులు. అంటే మొత్తం స్టాక్ అయిన 160లో దాదాపు నాలుగో వంతు అన్నమాట – మంచి నిష్పత్తియే అని చెప్పచ్చు. లైబ్రరీలో సభ్యత్వ రుసుము పాతిక రూపాయలు ఒక సారి చెల్లించాలి. ఆ తర్వాత నెలకి రెండు రూపాయలు కట్టాలి. ఇంక పుస్తకాలకు వేరే చార్జి లేదు. టీ కూడా ఉచితమే. పాలు లేకుండా చక్కర వేసిన టీ డికాక్షన్. “జనాలు పాపం కొండల నుంచి అలసిపోయి వస్తారు.” బిస్కెట్లు, మిక్శ్చర్, మిగిలిన వస్తువులకి మాత్రమే డబ్బు కట్టాలి. కొన్ని సార్లు సందర్శకులకి సాదాసీదా భోజనం కూడా ఉచితంగా లభించవచ్చు.
పుస్తకాలు తీసుకువెళ్ళిన తేదీ, తిరిగి ఇచ్చిన తేదీ, తీసుకున్నవారి పేరు అన్నీ చక్కగా రిజిస్టర్ పుస్తకంలో రాసి ఉన్నాయి. ఇళంగో రాసిన శిలప్పధికారం పుస్తకాన్నయితే చాలా మంది తీసుకుని వెళ్లారు. ఈ ఏడాది ఇప్పటికే పాఠకులు 37 పుస్తకాలు తీసుకుని వెళ్ళినట్లు రాసి ఉంది. అణచివేతకు గురైన ఒక ఆదివాసీ సమాజం, అడవుల్లో ఇక్కడ నాణ్యమైన సాహిత్యాన్ని పంచుకుని, చదివి, జీర్ణం చేసుకుంటోంది. ఈ ఎరుక మమ్మల్ని ఆలోచనలో పడేలా చేసింది. నగరాల్లో మా సొంత పుస్తక పఠనం అలవాట్లు గుర్తొచ్చి మాలో కొంత మంది కొంచెం సిగ్గుపడ్డాం కూడా అనుకుంటాను.
మా బృందంలో రాతలు, రచనల ద్వారా పొట్ట పోషించుకునే వాళ్ళమే ఎక్కువ. మేం గొప్ప రచయితలమన్న గర్వాన్ని పటాపంచలు చేసే పుస్తకం ఒకటి మాకు అక్కడ దొరికింది. కేరళ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో మాతో ప్రయాణిస్తున్న ముగ్గురు జర్నలిజం విద్యార్థుల్లో ఒకరైన విష్ణు ఎస్. కి ఒక భిన్నమైన ‘పుస్తకం’ దొరికింది. గీతలున్న నోట్ బుక్, అందులో చేతిరాతతో నిండిన అనేక పేజీలు. ఆ పుస్తకానికి ఇంకా శీర్షిక లేదు కానీ, అది చిన్నతంబి ఆత్మకథే. “చాలా ఎక్కువ రాయలేకపోయాను, కానీ ఈ మధ్య ప్రయత్నిస్తున్నాను,” చిన్నతంబి ఏదో క్షమాపణ చెప్తున్న ధోరణిలో చెప్పారు. “ఏం రాశావో మాకు కొంచెం చదివి వినిపించవా, చిన్నతంబి.” సుదీర్ఘమైన రచనా కాదు, అసంపూర్తిగా కూడా ఉంది. అయినా అది ఎంతో కుదురుగా చెప్పిన కథ. తనలో తొలి సామాజిక, రాజకీయ స్పందన గురించి ఉంది ఆ కథనంలో. రచయితకు తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు మహాత్మాగాంధి హత్య, ఆ సంఘటన తనపై చూపిన ప్రభావంతో ఆ ఆత్మకథ ప్రారంభమయింది.