హబీబ్ ఉన్నీసా తాను చూసిన హింసకు భయపడిపోయారు, కానీ ఆందోళనకారుల నుండి స్ఫూర్తి పొందారు. “నేనో మామూలు అమ్మను. నా పిల్లలే నా ప్రపంచం,” చనిపోయిన సనా షేక్ తల్లి PARIకి చెప్పారు. “నేనొక గృహిణిగా జీవితాన్ని గడుపుతున్నాను, కానీ అధికార పీఠంమీద ఉన్నవాళ్ళు దానికి అంతరాయం కలిగించారు. వాళ్ళ నిర్ణయాల వలనే నా కూతురు చనిపోయింది. మమ్మల్ని రక్షించాల్సిన వాళ్ళే మా జీవితాలను నాశనం చేశారు.”
2026 మే 3న, సనా పరీక్ష రాసి రాగానే NEET ప్రశ్నాపత్రం లీకు అయిందనీ, విద్యార్థులు మళ్ళీ పరీక్ష రాయాలని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. సనా కుప్పకూలిపోయింది. పరీక్ష కోసం ఆమె ముమ్మురంగా చేసిన కృషి అప్పటికే ఆమెను కుంగదీసి వుంది. NEET చాలా పోటీ వున్న పరీక్ష. వైద్య కళాశాల్లో 1,30,000 కంటే తక్కువ వున్న సీట్లకు 20 లక్షల మంది తలపడతారు. సంవత్సరాల తరబడి పరీక్షకు తయారయ్యాక, సనా తన మీదున్న ఒత్తిడి తగ్గిందని అనుకొన్నది. కానీ ఇప్పుడామె ఆ కఠినమైన మొత్తం ప్రక్రియను మళ్ళీ మొదటి నుంచీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
పరీక్షలు రాసే బరువు ఆత్మహత్యా ఉత్తరం రాయటం కంటే ఎక్కువగా ఆనింపించి వుండటం విషాదకరం. జూన్ 21న జరగాల్సిన పునర్పరీక్షకు ఒక రోజు ముందు, తన గదిలో ఉరివేసుకునే ముందు ఆమె "నన్ను క్షమించండి," అని రాసింది.
అదే కారణంతో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన 20మందిలో ఆమె కూడా ఒకరు.
“ఆ రోజు పొద్దున్నే ఆమె నా ఫోను ఎత్తలేదు,” చెప్పారు జాఫర్. “నేను ఆమెతో మాట్లాడగలిగి వుంటే, బహుశా ఆమె మనతో వుండేది,” ఆందోళన జరుగుతున్న చోట, ఆవేదనతో ఉన్న ఆ తండ్రి చెప్పారు.
“నేను పడుతున్న వేదనను చెప్పుకోవటానికే ఇంతదూరం వచ్చాను,” కూతుర్ని కోల్పోయిన తల్లి హబీబ్ ఉన్నీసా అంటున్నారు. తన పెద్ద కూతురు ఇక లేదనే వాస్తవాన్ని అంగీకరించటానికి ఆమె ఇంకా కిందామీదా పడుతున్నారు. “మేం ఇంకో ఐదేళ్ళలో చనిపోవచ్చు. లేకపోతే ముసలివాళ్ళం అయ్యేదాకా బతకవచ్చు. కానీ ఈ బాధను బతికినంత కాలం మోస్తాం,” అంటారామె. “రాత్రుళ్ళు నేను సరిగ్గా నిద్రపోలేకపోతున్నాను. అర్ధరాత్రుళ్లు నా కాళ్ళూ చేతులూ వణుకుతున్నాయి.”
అయినా కూడా ఆ తల్లిదండ్రులు 15, 11 సంవత్సరాల వయసున్న తమ ఇద్దరు కూతుళ్ళను వదిలిపెట్టి దిల్లీకి ప్రయాణమై వచ్చారు. “వాళ్ళ గురించి ఆలోచిస్తూనే వున్నాను, ఆందోళన పడతాను. అధికారంలో వున్నవాళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పటానికి నేనిక్కడికి వచ్చాను. అధికారం మిమ్మల్ని గుడ్డివాళ్ళను చేసిందా? నాలాంటి తల్లుల కోసమే విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. వాళ్ళు సున్నితమైనవాళ్ళు. నా బాధను పంచుకొన్నవారిని పోలీసులు కొట్టటం చూస్తుంటే బాధగా ఉంది. మా నొప్పిని అర్థం చేసుకోలేకపోతే, మీకు అధికారం వుండి కూడా ఏం లాభం? బచ్చోఁ పే ఇత్నా జులుమ్ మత్ కరియే [పిల్లలను ఇంతగా శిక్షించవద్దు].”