సేవంతీ రాయ్ భుజాలు సౌష్ఠవంగా లేవని ఆమె చిన్నతనంలోనే ఆమె నాట్య గురువు గమనించారు. ఆ ఔత్సాహిక నృత్యకారిణి కదలికలు ఆగిపోయాయి. కొన్నిరోజుల తరువాత, పదమూడేళ్ళ సేవంతికి పార్శ్వగూని ఉందని పరీక్షల్లో నిర్ధారణ అయింది. “నాకు రోగ నిర్ధారణ జరిగిన మొదట్లో, నా చిన్నప్పటి అభిమాన హీరో హృతిక్ రోషన్ (అద్భుతమైన నృత్య నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ సినీ నటుడు)కి వచ్చిన వ్యాధే నాకూ వచ్చిందని ఏదో తెలియని ఉత్సాహంతో ఉండేదాన్ని,” సేవంతి నవ్వుతూ గుర్తుచేసుకున్నారు.
రోషన్కి 21 ఏళ్ళ వయసులో అతనికి పార్శ్వగూని ఉందని నిర్ధారణ అయింది. ఆ కారణంగా అతను ఎప్పటికీ నాట్యం చేయలేడని డాక్టర్లు చెప్పారు. పార్శ్వగూని వల్ల వెన్నెముక పక్కకి వంకరతిరిగిపోతుంది. ప్రతి మనిషికి వెన్నెముకలో క్రమబద్ధమైన వంపులు ఉంటాయి, కానీ పార్శ్వగూనితో పుట్టిన పిల్లలు, యుక్తవయస్కుల్లో వెన్నెముక , లేదా కొన్ని భాగాలు ‘ఎస్’ లేదా ‘సి’ ఆకారంలో అసాధారణంగా వంకరతిరిగిపోతాయి.
దాంతో, యుక్తవయస్కురాలైన సేవంతి, అడాలెసెంట్ ఇడియోపతిక్ స్కోలియోసిస్ (కౌమారదశలో వచ్చే కారణం తెలియని పార్శ్వగూని - AIS) శస్త్రచికిత్స చేయించుకోవడానికి దక్షిణ 24 పరగణాలలో ఉన్న తన ఇంటి నుండి కొల్కతాకు వెళ్ళింది. ఈ ప్రక్రియలో ఆమె వీపులోకి రెండు కడ్డీలు, 14 మరమేకులను చొప్పించి, ఆమె వెన్నెముకను నిటారుగా ఉండేలా చేశారు.
ఇది జరిగిన 12 సంవత్సరాల తరువాత, “ఇప్పుడు నాకే బాధా లేదు. నేను సాధారణ జీవితాన్ని గడుపుతున్నాను. పార్శ్వగూనితో ఎలా బతకాలో నేర్చుకున్నాను. అన్నీ మామూలుగానే జరిగిపోతున్నాయి,” అని ఆమె నవ్వుతూ చెప్పారు. మేం పశ్చిమ బెంగాల్లోని డైమండ్ హార్బర్ పట్టణంలో, ఆమె తాతగారి ఇంటి డాబా పైన కూర్చున్నాం. హూగ్లీ నది ఈ పట్టణం గుండానే ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది.
పార్శ్వగూని వల్ల సేవంతి శరీరాకృతి మారింది. అయితే, ఈ వ్యాధి లక్షలాది మంది ఇతర రోగులను తీవ్రమైన నొప్పికీ, నిస్త్రాణకూ గురిచేస్తుంది, గుండె, శ్వాస సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి. ఇక గ్రామీణ ప్రాంతాలలో ఉండే ప్రజల విషయానికి వస్తే, మొదటి దశ అయిన సరైన రోగ నిర్ధారణ జరగడం కూడా వాళ్ళకు సవాలే.


















