నవంబర్ నెలలో ఒక మూడు రోజుల పాటు మాజులీ ద్వీపంలోని గరముర్ మార్కెట్ రంగురంగుల విద్యుద్దీపాలు, మట్టి ప్రమిదలతో వెలిగిపోతుంది. తొందరగా చీకటిపడే శీతాకాలపు సాయంత్రాలలో చుట్టూ అక్కడక్కడా ఉన్న లౌడ్ స్పీకర్ల నుండి ఖోల్-తాళ్ల చప్పుళ్ళు వినిపిస్తాయి.
రాస్ మహోత్సవం మొదలయింది.
ఈ ఉత్సవం అస్సామీ నెలలైన కాతి-ఆఘొన్లలో - ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం అక్టోబర్-నవంబర్ నెలలు - వచ్చే నిండు పూర్ణిమ నాడు మొదలవుతుంది. ప్రతి సంవత్సరం ఈ ద్వీపానికి భక్తులనూ పర్యాటకులనూ ఆకర్షించే ఈ పండుగ ఆ తర్వాత మరో రెండు రోజులపాటు కొనసాగుతుంది.
"ఈ పండుగే జరగకపోతే, మాకు ఏదో కోల్పోయినట్టుగా ఉంటుంది. అది (రాస్ మహోత్సవ్) మా సంస్కృతి," అంటారు వరుణ్ చితాదర్ చుక్ గ్రామానికి చెందిన ఈ ఉత్సవ నిర్వాహక కమిటీ కార్యదర్శి రాజా పాయేంగ్.
చక్కటి దుస్తులు ధరించివున్న వందలాది మంది ప్రజలు అస్సామ్లోని అన్ని ఇతర సత్రాల మాదిరిగానే నవ వైష్ణవ మతానికి చెందిన గరముర్ సరు సత్రం సమీపంలో గుమిగూడారు.





































