తారిఖ్ అహ్మద్ ప్రాథమిక పాఠశాల పిల్లలకు మౌలిక విద్యను నేర్పుతూ పది సంవత్సరాలపాటు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 37 ఏళ్ల తారిక్ కేంద్ర సమగ్ర శిక్ష పథకం కింద 2009-2019 వరకూ విద్యా వాలంటీర్గా పనిచేశారు. తమ గొర్రెలను, మేకలను మేపడం కోసం లదాఖ్కు వలస వచ్చే బకర్వాల్ కుటుంబాల పిల్లలకు చదువు చెప్పడం కోసం అతనిని ఎత్తైన ప్రాంతమైన ద్రాస్కు పంపించారు.
కానీ 2019లో రాష్ట్రాన్ని జమ్మూ కశ్మీర్గానూ, లదాఖ్గానూ విభజించినప్పుడు ఆయన తన ఉద్యోగాన్ని కోల్పోయారు. జమ్మూ కశ్మీర్ నివాసి అయిన - ఆయన ఇల్లు రజౌరి జిల్లా, కాలాకోట్లో ఉంది - ఈయనకు జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి బయట ఉన్న పిల్లలకు బోధించే అవకాశం లేదు.
"రెండు వేర్వేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడం వలన, మా పిల్లల విద్యా వ్యవస్థ గందరగోళంలో పడింది," సంచార తెగల పిల్లలను మరచిపోయినందుకు అధికారులను తప్పుపడుతూ అన్నారు తారిఖ్.
"కర్గిల్ జిల్లాలోని జీరో పాయింట్ నుంచి ద్రాస్ వరకూ ఈ ప్రాంతంలో మాకు సంచార పాఠశాలలు లేవు, సమయానుగుణ అధ్యాపకులు (seasonal teachers) అందుబాటులో లేరు. మా పిల్లలు చివరకు రోజంతా ఆ చుట్టుపక్కలే తిరుగుతూ ఆహారం కోసం స్థానికులను చికాకుపె ట్టేంతగా దిగజారారు," కాలాకోట్లోని బథేరా గ్రామ సర్పంచ్, షమీమ్ అహ్మద్ బజ్రాన్ అన్నారు.
వలస వచ్చినవారి కోసం జమ్మూ కశ్మీర్లో వేలకొద్దీ తాత్కాలిక పాఠశాలలు ఉన్నాయి, కానీ మే నుండి అక్టోబర్ మధ్య ఆరు నెలల పాటు లదాఖ్కు వలస వెళ్ళినప్పుడు తమ పిల్లలకు బడి తప్పిపోతుందని బకర్వాల్ సముదాయంవారు చెప్పారు. ఇక్కడ వారి పిల్లలు విద్యా బోధనతో సంబంధాన్ని కోల్పోతారు, తమ తోటి పిల్లలకంటే వెనుకబడిపోతారు. బకర్వాల్ సముదాయపు అక్షరాస్యత 32 శాతంగా ఉంది. ఇది రాష్ట్రంలోని షెడ్యూల్డ్ తెగలన్నింటిలోనూ అతి తక్కువ శాతమని షెడ్యూల్డ్ తెగల గురించి 2013లో వచ్చిన ఒక నివేదిక చెప్తోంది.









