“సహజ రంగులు అద్దిన వస్త్రాలను ఉతకడానికి ప్రవహించే నది కావాలి,” అబ్దుల్ హలీమ్ అన్నారు. “యహాఁ పే తో హాథ్ ధోనే కా పానీ నహీ మిల్తా (కానీ, ఇక్కడేమో చేతులు కడుక్కునేందుకు కూడా నీళ్ళు దొరకవు)!”
హలీమ్ మూడవ తరం బ్లాక్ ప్రింటింగ్ కళాకారుడు. నకిలీ ఉత్పత్తులు పెరగడం వల్ల క్రమంగా లాభాలు తగ్గుతున్న నేపథ్యంలో, ఈయన తన బ్లాక్ ప్రింటింగ్ కార్యశాలను నడపడానికి చాలా కష్టపడుతున్నారు. అదీ కాకుండా, ఇందౌర్ నగరంలో నీటి కొరత అధికంగా ఉండడంతో, త్వరగా వస్త్రాలను అద్దుకునే రసాయన రంగులను వినియోగించడం తప్ప ఈయనకి వేరే మార్గం కనిపించడం లేదు.
చెక్క బ్లాక్లను డిజైన్ చేయడంతో బ్లాక్ ప్రింటింగ్ పని మొదలవుతుంది. హలీమ్ సొంతంగా తన నమూనాల డిజైన్లు గీసుకొని, తరువాత జైపూర్, ఫరూఖాబాద్, ఫతేపూర్లో ఉండే బ్లాక్ తయారీదారులకు వాటిని పంపిస్తారు. సాధారణంగా వాళ్ళు సాగ్వాన్ (టేకు), లేదా శీశమ్ (ఇరిడి)తో అచ్చు దిమ్మలను (బ్లాక్లు) తయారుచేస్తారు.
ఈ బ్లాక్లను రంగులలో ముంచి వస్త్రాలపై ముద్రిస్తారు. “ఈ కళ మన సాంస్కృతిక వారసత్వంలో భాగమే,” చందేరి దుపట్టాపై గులాబీ రంగు గులాబీ పూలను ముద్రించడానికి వంగిన హలీమ్, ఆ రంగు డిజైన్ దాటి పక్కకి అంటకుండా జాగ్రత్త పడుతూ అన్నారు. ఆయన ఉపయోగిస్తోన్న రంగుల మిశ్రమాన్ని జనపనార, మల్మల్ కాటన్, సన్నటి దోమతెరలోంచి వడపోసి వస్త్రంపై అద్దుతున్నారు. ఇదిలా ఉంటే, వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా వర్షాకాలంలో ఈ అద్దకం వేసిన వస్త్రాలను ఎండబెట్టడం కష్టమవుతుంది. సాధారణంగా ఇవి ఆరడానికి 72 గంటలు పడుతుంది.














