వింధ్య పర్వతాల మీదుగా సూర్యుడు అస్తమించాడు. పక్షులు అడవికి తిరిగి వచ్చేశాయి. దమా సస్తియా ప్రయాణానికి ఇదే సరైన సమయం. ఈ రైతు, సుగత్ గ్రామంలోని తన ఇంటి నుండి ఒక నీటి ఊటను చేరుకోవడానికి, ఓ కిలోమీటరు దూరం రాళ్ళ దారిలో నడుస్తారు. రాత్రంతా నీటి బిందెలను నింపుతూ అక్కడే గడిపి, ఉదయం ఇంటికి తిరిగి వస్తారు. “ఆ ఊటలో రాత్రిపూటే నీళ్ళు ఎక్కువగా ఊరతాయి మరి,” 50 ఏళ్ళ దమా వివరించారు.
534 మంది జనాభా (2011 జనాభా లెక్కల ప్రకారం) ఉన్న ఈ గ్రామ నీటి అవసరాలకు ఒకటో రెండో నీటి ఊటలు ఏ మాత్రం సరిపోవు. సుగత్ గ్రామవాసులు, ప్రతిరోజూ తెల్లవారుజామునే తమ కుండలను, గాడిదలను తీసుకొని, స్నానం చేయడానికి, నీళ్ళు తెచ్చుకోవడానికి కొండ దిగి నర్మదా నది దగ్గరికి వెళ్తారు. సాయంత్రం కూడా మళ్ళీ ఇదే ప్రక్రియ నడుస్తుంది. స్నానం చేయడం, గిన్నెలు కడగడం, నీళ్ళు పట్టుకోవడం, ఇలా నీటితో ముడిపడిన పనుల కోసం ఈ గ్రామస్తులు ప్రతిరోజూ సగటున మూడు గంటల సమయాన్ని వెచ్చిస్తారు. స్వచ్ఛమైన నీరు ప్రతీ పౌరుని జీవన హక్కులలో ఒక భాగంగా మన భారత రాజ్యాంగం గుర్తించింది. అందుచేత, ఇది తీవ్రస్థాయి మానవ హక్కుల ఉల్లంఘన అవుతుంది.
నదికి అత్యంత దూరంగా ఉండే ఇల్లు, సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంది. కొండ దిగి, ఎక్కి, నీళ్ళు తెచ్చుకోవడానికి ఆ నివాసితులకు గంటకు పైగా పడుతుంది. నీటి బిందెలతో కొండ ఎక్కడానికి, దిగేటప్పటికంటే రెట్టింపు సమయం పడుతుంది కాబట్టి, వాళ్ళు వారానికి సుమారు 15 గంటలు నడుస్తారు.
పొద్దున్నే ఈ పనిని దమా కొడుకు చేపడతాడు. ఆ యువకుడు, తన ఎనిమిదిమంది సభ్యులున్న కుటుంబం కోసం విలువైన నీటితో నింపిన డబ్బాలను మోయడానికి, తమ కుటుంబానికి చెందిన రెండు గాడిదలను తీసుకువస్తాడు. ఇప్పుడు ఈ పనికి అలవాటుపడిన ఈ గాడిదలు, వాటంతట అవే ఇంటి వైపు బయలుదేరతాయని నమ్మవచ్చు.
పదిహేనేళ్ళ క్రితం సుగత్, దాని సమీప గ్రామమైన ఝణ్డానాలో నివసిస్తున్న ఈ భిలాలా, అలాగే ఇతర ఆదివాసీ సముదాయాలకు నీళ్ళు సమస్యగా మారలేదు. ఎందుకంటే, వీళ్ళు నర్మదా నది, దాని ఉపనది అయిన హథినీ నది ఒడ్డున నివసించేవాళ్ళు. పుష్కలమైన నీరు సులభంగా అందుబాటులో ఉండేది.
అయితే, నర్మదా నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ ఆనకట్ట కారణంగా ఈ గ్రామాలు మునిగిపోయినప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. 2014లో ఆనకట్ట గేట్లు మూసివేయడంతో, సుగత్, ఝణ్డానాతో పాటు మధ్యప్రదేశ్లోని సుమారు 200 గ్రామాలు నీట మునిగాయి. నదీజలాలు ఆ గ్రామస్తుల వ్యవసాయ భూములను ముంచెత్తాయి. దాంతో, దమా కుటుంబం లాగా వలస వెళ్ళనివాళ్ళు, లేదా వేరే చోటుకు తరలి వెళ్ళనివాళ్ళు, నీరు, విద్యుత్తు, సరైన రహదారి సౌకర్యాలు లేని వింధ్య పర్వతాలలోకి బలవంతంగా తమ మకాంను మార్చవలసి వచ్చింది.




























