మాలోజీ చవ్హాణ్ తన ఎకరం ద్రాక్షతోటలో ఉన్నప్పుడు ఆయనకు ఎవరి సహాయమూ అవసరం లేదు. తన స్నేహితుడైన సంతోష్ హింగమిరే నుండి దూరంగా అడుగులు వేస్తున్నప్పుడు ఆయన కదలికలు దృష్టి ద్వారా కాకుండా సహజాతంపై ఆధారపడతాయి. 31 ఏళ్ళ ఈ రైతుకు దృష్టి లోపం ఉన్నప్పటికీ తన భూమి గురించిన అన్ని విషయాలు బాగా తెలుసు.
"మీరీ కొమ్మను చూశారా?" ద్రాక్ష తీగకు ఆలంబనగా ఉన్న ఒక ఇనుప స్తంభం వైపు చూపిస్తూ అడిగారు.
"ఏది?" క్షణకాలపు అనిశ్చితితో అడిగాం.
మాలోజీ ఆ అనిశ్చితికి నవ్వుతూ, ముందుకు వంగి మెల్లగా ఒక లేత రెమ్మను పైకి లేపారు. దానికున్న ఐదు తాజా ఆకులు కొన వద్ద వంకరతిరిగి ఉన్నాయి. దాని వెంట తన చేతివేళ్ళను పోనిస్తూ మెల్లగా ఇలా అన్నారు, “ఇది సరిగ్గా పెరగలేదు. ఇది కాయలను ఇవ్వదు. దీని వేర్లు దెబ్బతిన్నాయి. వాటికి నెలల తరబడి తగినంత సూర్యరశ్మి అందలేదు.”
ఆ ఒక్క తీగ, ఆయన ఒక్క ఎకరపు ద్రాక్షతోటకు సంబంధించిన పెద్ద కథను చెబుతుంది. ఆయన తల్లిదండ్రులైన ధనాజీ, పుష్పాబాయిలకు చెందిన ఐదెకరాల సాగునీటి సౌకర్యం ఉన్న పొలంలో ఇది ఒక భాగం. ఇక ఈ ఏడాది ద్రాక్షపళ్ళు ఉండవు. పొలంలో ఉన్న చెరకు మొలకలు, ఇతర పండ్ల చెట్లు కూడా కుళ్ళిపోతున్నాయి. మొత్తంమీద రూ. 10 లక్షల నష్టం వస్తుందని ఆ కుటుంబం అంచనా వేసింది. ఇది వారిని కనీసం ఒక దశాబ్దం పాటు ఆర్థికంగా వెనుకబడిపోయేలా చేస్తుంది.
2025 రుతుపవనాల సమయంలో ఎడతెగకుండా కురిసిన భారీ వర్షాల ఫలితంగా ఈ వినాశకరమైన నష్టం జరిగింది. ఒక్క జామ్గాఁవ్లోనే కాదు, సోలాపూర్ జిల్లా మొత్తంగానే కాక పొరుగున ఉన్న మరాఠ్వాడాలోని బీడ్, ధారాశివ్ జిల్లాలలో కూడా. 2025 నవంబర్ ప్రారంభం నాటికి, సోయాచిక్కుళ్ళ పొలాలు, ద్రాక్షతోటలు నాశనమయ్యాయి. ఈ కరవు పీడిత ప్రాంతంలో ఏడాదిలో ఎక్కువ భాగం సాధారణంగా ఎండిపోయి కనిపించే వాగులు పూర్తిగా నిండిపోయి ప్రవహించాయి.
2025 మే మధ్య నుండి అక్టోబర్ చివరి వరకు పశ్చిమ మహారాష్ట్ర, మరాఠ్వాడాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. సెప్టెంబర్ 19 నుంచి 25 మధ్య కాలంలో పరిస్థితి నాటకీయంగా దిగజారింది. అక్కడికక్కడే వరుసబెట్టి కురిసిన అతివృష్టి, ఆకస్మిక వరదలు కోతకు వచ్చిన పంటలను, తోటలను, నేలలను, పశువులను ముంచెత్తి, కొన్ని సందర్భాల్లో మానవ ప్రాణాలను కూడా తీశాయి. సోలాపూర్ జిల్లా అంతటా, 47,000 హెక్టార్లకు పైగా పంటలు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయని అధికారులు లెక్కలువేశారు.













