"ఇది కేవలం తోలుబొమ్మల గురించో లేదా ప్రదర్శన గురించో కాదు," అన్నారు రామచంద్ర పులవర్. 40 ఏళ్ళకు పైగా తోల్‌పావకూత్తు శైలిలో తోలుబొమ్మలనాడించే ఈయన, కేరళలోని మలబార్ ప్రాంతంలోని సమకాలీన సంప్రదాయాలను నొక్కిచెప్పడంలో వివిధ వర్గాల తోలుబొమ్మలాడించే కళాకారులు చెప్పే బహుళసాంస్కృతిక కథలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయని అభిప్రాయపడ్డారు.

“ఇది మన సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించి, భవిష్యత్తు తరాలకు అందించడం. మేం తోల్‌పావకూత్తు ద్వారా చెప్పే కథలు లోతైన అర్థాన్ని కలిగి ఉండి, మంచి మానవులుగా ఉంండేలా ప్రజలను ప్రేరేపించగలవు,” అని ఆయన చెప్పారు.

తోల్‌పావకూత్తు అనేది కేరళలోని తోలుబొమ్మలాటల రంగస్థలపు సంప్రదాయ కళ. ఇది మలబార్ ప్రాంతంలోని భారతపుళ (నిల) నది ఒడ్డున ఉన్న గ్రామాలలో కనిపిస్తుంది. తోలుబొమ్మలాట ఆడించేవారు వివిధ కులాల నుంచీ, వర్గాల నుంచీ వస్తారు. ఈ ప్రదర్శనలు అందరికీ అందుబాటులో ఉంటాయి

తోల్‌పావకూత్తును ఆలయ ప్రాంగణం వెలుపల కూత్తుమాడమ్ అనే శాశ్వత రంగస్థల వేదికపై ప్రదర్శిస్తారు. ఇలా చేయటం వలన అన్ని వర్గాలకు చెందిన ప్రజలు వచ్చి కళారూపాన్ని చూసి ఆస్వాదించవచ్చు. సంప్రదాయకంగా దీనిని వార్షిక పండుగ సంబరాలలో భాగంగా భద్రకాళికి చెందిన పవిత్రమైన తోటలలో నిర్వహిస్తారు. ఇది రామాయణంలో రామ రావణుల మధ్య జరిగిన పౌరాణిక యుద్ధాన్ని వర్ణిస్తుంది. అయితే, ఈ ప్రదర్శన రామాయణంలో చిత్రీకరించివున్న కథలకే పరిమితం కాకుండా, జానపద కథలను కూడా కలుపుకుంటుంది.

తోలుబొమ్మలాటను ఆడించే నారాయణన్ నాయర్ మాట్లాడుతూ, “మా ప్రదర్శనలకు అవసరమైన నిధులను, మద్దతును సంపాదించేందుకు మేం చాలా కష్టపడుతున్నాం. తోల్‌పావకూత్తు ఎంత విలువైనదో చాలామంది అర్థంచేసుకోరు, దానిని భద్రపరచవలసిన కళారూపంగా కూడా చూడరు." అన్నారు.

అనేక సవాళ్లను అధిగమించి, తమ ప్రదర్శనను కొనసాగిస్తోన్న తోలుబొమ్మలాట కళాకారులైన బాలకృష్ణ పులవర్, రామచంద్ర పులవర్, నారాయణన్ నాయర్, సదానంద పులవర్‌ల గళాలను ఈ చిత్రం మనకు అందిస్తుంది.

ఈ చిత్రాన్ని చూడండి: నీడల కథనాలు

ఈ కథనానికి మృణాళిని ముఖర్జీ ఫౌండేషన్ (ఎమ్ఎమ్ఎఫ్) ఫెలోషిప్ మద్దతు ఉంది.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Sangeeth Sankar

సంగీత్ శంకర్ ఐడిసి స్కూల్ ఆఫ్ డిజైన్‌లో పరిశోధక విద్యార్థి. అతని మానవజాతిశాస్త్ర పరిశోధన, కేరళ తోలుబొమ్మలాటలో పరివర్తనను పరిశీలిస్తుంది. సంగీత్ 2022లో MMF-PARI ఫెలోషిప్‌ను అందుకున్నారు.

Other stories by Sangeeth Sankar
Text Editor : Archana Shukla

అర్చన శుక్లా పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో కంటెంట్ ఎడిటర్‌గానూ, ప్రచురణల బృందంలోనూ పని చేస్తున్నారు.

Other stories by Archana Shukla
Translator : Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.

Other stories by Sudhamayi Sattenapalli