ఒకానొకప్పుడు ముగ్గురు ఇరుగుపొరుగువారు - కేథరిన్ కౌర్, బోధి ముర్ము, మొహమ్మద్ తులసీరామ్ ఉండేవారు. కాథీ ఒక రైతు; బోధి జూట్ మిల్లులో పనిచేశాడు; మొహమ్మద్ ఒక ఆవుల కాపరి. నగరంలోని అనేకమంది విద్యావంతులు గొడవ చేస్తున్నట్టి భారత రాజ్యాంగం అనే ఆ బరువైన ఉద్గ్రంథంతో ఏమి చేయాలో వారెవరికీ తెలియదు. ఇది పనికిరానిదని కాథీ అన్నది. బహుశా అది దివ్యమైనది కావచ్చునని బోధి భావించాడు. మొహమ్మద్ అయితే "ఇది మా పిల్లలకు తిండి పెడుతుందా?" అని కూడా అడిగాడు.

గడ్డం రాజు ఎన్నికయ్యాడనే వాస్తవాన్ని ఆ ఇరుగుపొరుగులు ముగ్గురూ పట్టించుకోలేదు, " ఆఖిర్ ఇత్నా వక్త్ కిస్కే పాస్ హై ? (అయినా అంత సమయం ఎవరికి ఉందీ?)" ఆపైన వర్షాలు కురవలేదు, అప్పులు పెరిగాయి, క్యాథరిన్ తన పేరును గుసగుసగా పలుకుతున్న పురుగుమందుల డబ్బాను కనిపెట్టింది. తర్వాత జూట్ మిల్లు దివాళా తీసింది. నిరసన తెలుపుతున్న కార్మికులపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు, వారికి నాయకత్వం వహించినందుకు బోధి ముర్ముపై తీవ్రవాది అనే అభియోగాన్ని మోపారు. చివరకు మొహమ్మద్ తులసీరామ్ వంతు వచ్చింది. ఒక చక్కటి సనాతని (పావనమైన) సాయంత్రం అతని ఆవులు ఇంటికి వచ్చాయి, వాటి వెన్నంటే కత్తి పట్టిన రెండు కాళ్ళ దూడలు. "గౌ-మాతా కీ జై! గౌ-మాతా కీ జై!"

దయ్యాల జపాల మధ్య, ఎక్కడో కొన్ని పుటలు రవ రవమన్నాయి, నీలిరంగు సూర్యుడు ఉదయించాడు, తడబడుతున్న గుసగుస వినిపించింది:
"భారతదేశ ప్రజలమైన మేం, రూఢిగా తీర్మానించుకున్నాం..."

హైకూలను గానం చేస్తోన్న జాషువా బోధినేత్రను వినండి



ఒక రాజ్యాంగబద్ధ విలాపం

1.
సార్వభౌమాధికార దేశం మనది,
మన దాహం కూడా అలాంటిదే
చిక్కుకుంది తుప్పులా ఎర్రగా మెరిసే ఒక మేఘంలో.

2.
సామ్యవాద ప్రతిబంధకమా!
మనమెందుకు కలలు కనటం?
మన కార్మికులు ఎండలో కేకలు పెడుతున్నారు.

3.
మందిరం, మసీదు, చర్చి,
ఇంకా ఒక సమాధి —
లౌకిక గర్భంలో దించిన త్రిశూలాలు.

4.
ప్రజాస్వామ్యమా !
కేవలం ఒక ఓటు కోసమే, 'చావు ఒక
ఋణం' అని మన పండితులు రాశారు.

5.
ఒకప్పుడు ఒక గణతంత్రం
ఒక రాజు ప్రమాణం చేస్తాడు, బుద్దుడు నేలకొరిగాడు
తుపాకీ కొనకత్తులు పాడాయి.

6.
న్యాయం ధరించిన
కంటిగుడ్డ కింద, అసలు కళ్ళే లేవు —
ఇంకెన్నడూ.

7.
తాజా వ్యవసాయ స్వేచ్ఛలు
మాల్‌లో అమ్ముడవుతున్నాయి, జాడీలలో కూరిన
తీపి ఫోలిడాల్.

8.
పవిత్రమైన ఆవులు, నల్లని
నల్లని కాల్చిన మాంసం — అది ఒక రొట్టె
మన రాజకీయ సమానత్వం కాల్చినది.

9.
సౌభ్రాతృత్వం ఘోషిస్తుంది —
రై పొలంలో శూద్రుల ఉచ్ఛ్వాస,
మొరుగుతున్న బ్రాహ్మణుడు


కవితను రాయడానికి దారితీసిన కొన్ని ఉత్తేజకరమైన సంభాషణలు చేసిన స్మితా ఖటోర్ కు కవి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు .

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Joshua Bodhinetra

జాషువా బోధినేత్ర కొల్‌కతాలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి తులనాత్మక సాహిత్యంలో ఎంఫిల్ చేశారు. అతను PARIకి అనువాదకుడు, కవి, కళా రచయిత, కళా విమర్శకుడు, సామాజిక కార్యకర్త కూడా.

Other stories by Joshua Bodhinetra
Illustration : Labani Jangi

లావణి జంగి 2020 PARI ఫెలో. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాకు చెందిన స్వయం-బోధిత చిత్రకారిణి. ఆమె కొల్‌కతాలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్‌లో లేబర్ మైగ్రేషన్‌పై పిఎచ్‌డి చేస్తున్నారు.

Other stories by Labani Jangi
Translator : Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.

Other stories by Sudhamayi Sattenapalli