15 సంవత్సరాలు కూడా లేని వయస్సులో, వీరరాఘవన్ తమిళనాడులోని అణుమందై గ్రామంలోని, మారియమ్మన్ కోయిల్ వీధిలో చూసిన ప్రదర్శనతో మంత్రముగ్ధుడయ్యారు. ఆయన ఆ రాత్రంతా మెలకువగానే ఉన్నారు. "అందరూ భారీగా అలంకరించిన వస్త్రాలు, మెరిసే కిరీటాలు, బంగారు పూతపూసిన ఆభరణాలు, ప్రకాశవంతమైన రంగులతో అలంకరణ చేసుకున్నారు. వాళ్ళు పాడుతూ, నృత్యం చేస్తూ, నటిస్తుంటే అందరూ వాళ్ళను అబ్బురంగా చూశారు. ప్రేక్షకులలో ఉన్న తాతలు,పాటీలు (అవ్వలు) తమ ముందు ఎవరో దేవుడున్నట్లు చేతులను జోడించారు,’’ అంటూ 70 ఏళ్ళ వీరరాఘవన్ తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారు.
వీధి నాటక రూపమైన తెరుకూత్తును చూసిన ఆ మొదటి రాత్రి, ప్రస్తుతం అనుభవశాలియైన ఈ కళాకారుడి మనస్సులో స్పష్టంగా నాటుకుపోయింది. "నేను తినలేకపోయాను, నిద్రపోలేకపోయాను. నా లోపలి నుంచి ఏదో ఒక గొంతు, 'నేను వాళ్ళతో ఉండాలనుకుంటున్నాను. వాళ్ళేం చేస్తున్నారో నేనూ అదే చేయాలనుకుంటున్నాను' అని చెప్పింది," అని ఆయన అన్నారు. ఆ సమయంలో ఆయన 6వ తరగతి చదువుతున్నాడు, కానీ ఆయన భవిష్యత్తు అప్పుడే నిర్ణయమైపోయింది. సంగీతం, నృత్యం లేదా కథలు చెప్పడంలో ఎటువంటి శిక్షణ లేకుండానే, ఆయన బడి చదువును విడిచిపెట్టి, తెరుకూత్తు బృందంలో చేరిపోయారు.
రాష్ట్రంలో ఒబిసిల జాబితాలోని వన్నియర్ సముదాయానికి చెంది, వ్యవసాయ కూలీలుగా పనిచేసే ఆయన తల్లిదండ్రులు దీనికి అభ్యంతరం చెప్పలేదు. "మేం పెద్దగా సంపాదనాపరులం కాదు. కానీ అప్పుడు నాకు నేర్చుకోవాలని చాలా ఉత్సాహంగా ఉండేది," అని ఆయన గుర్తు చేసుకున్నారు. "వాళ్ళు మొదట నాకు చిన్నచిన్న పనులు చెప్పేవాళ్ళు." చివరికి, వీరరాఘవన్ మొదటిసారి మహాభారతం ఆధారంగా రూపొందించిన ఒక ప్రదర్శనలో దుర్యోధనుడి పాత్రను పోషించారు. అందుకోసం ఆయన పగలూరాత్రీ తన డైలాగులను బట్టీ పట్టేవారు. "నేను అస్సలు భయపడలేదు. నిజానికి, నేను చాలా ఉద్రిక్తుడనయ్యాను," అని ఆయన చెప్పారు. సంవత్సరాలు గడిచినా ఆయన ముఖంలో చిరునవ్వు, గర్వం మాసిపోలేదు.
వీరరాఘవన్ ఆ కళను నేర్చుకోవడమే కాకుండా ఆ ప్రదర్శనలకు ఆధారమైన పురాణాలను కూడా అర్థం చేసుకోవడానికి తనను తాను అంకితంచేసుకున్నారు. ఆయన తన జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి నూల్ అగరాది, పెరియ పురాణం, భారతం వంటి పురాణ తమిళ గ్రంథాలను లోతుగా అధ్యయనం చేశారు.
1990వ దశకం చివరి వరకు ఆయన ఒక ప్రదర్శన ద్వారా కేవలం 5 నుంచి 10 రూపాయలు మాత్రమే సంపాదించేవారు. "మాకు దాదాపు సంవత్సరం పొడవునా ప్రదర్శనలుండేవి. ఏడాదికి దాదాపు 250 రోజులు ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళం" అని ఆయన చిరునవ్వుతో చెప్పారు. ప్రదర్శనకు అయ్యే ఖర్చును గ్రామ పంచాయతీ, గ్రామస్తులిచ్చే విరాళాలు పూరించేవి. "ప్రేక్షకులు కూడా దేవుళ్ళ కోసం అని భావించి, మా ప్రదర్శనల మీద ప్రేమతో డబ్బు ఇచ్చేవారు," అని ఆయన చెప్పారు. తాము పెద్దగా సంపాదించకున్నా, అది తమకిష్టమైన అభిరుచి అని ఆయన చెప్పారు.




























