గడ్డమీది రాజేశ్వరి 2018లో భూ యజమాని అయ్యారు. "నేనెంతో ఉద్వేగానికి గురయ్యాను. నేనొక సొంత భూమి ఉన్న మహిళనవుతున్నాను."
కనీసం ఆమె అలా అలోచించారు, తన చేతిలో ఉన్న అధికారిక హక్కు పత్రాలను సగర్వంగా చూసుకుంటూ.
ఐదేళ్ళ తర్వాత స్వగ్రామమైన యెన్కెపల్లెకు 30 కిలోమీటర్ల దూరంలోని బార్వాద్లో ఉన్న 1.28 ఎకరాల భూమికి తానే స్వంతదారు అని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గుర్తింపుకోసం ఆమె ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈ భూమి కోసం ఆమె రూ. 30,000 చెల్లించారు.
ఈ భూమిని కొన్న కొన్ని నెలల్లోనే, రాజేశ్వరికి ఆ భూమి హక్కు పత్రం, ఎన్కంబరెన్స్ (ఒక భూమికి సంబంధించి జరిగిన ప్రతి లావాదేవీని తెలియజేసే ఒక ముఖ్యమైన ఆస్తి పత్రం) నివేదిక, ఇంకా ఆమె పట్టాదార్ పాస్ పుస్తకం తీసుకునేందుకు అవసరమైన పత్రాలన్నీ వచ్చేశాయి. కానీ అదంతా వంచనగా తేలింది. "ఇప్పటికి ఐదేళ్ళవుతోంది, కానీ ఇంతవరకూ నాకు పట్టాదార్ (భూ యజమాని) పాస్బుక్ రాలేదు. పట్టాదార్ పాస్బుక్ లేకపోతే, అది (భూమి) నిజంగా నాదవుతుందా?"
భూ యాజమాన్యం బదలాయింపు ఎలా జరిగిందో హక్కు పత్రం చూపిస్తుండగా, పట్టాదార్ పాస్ పుస్తకం భూ యాజమాన్యం గురించిన మరిన్ని వివరాలనిస్తుంది. ఈ పాస్ పుస్తకంలో పట్టాదారుల పేరు, సర్వే నంబరు, ఆ భూమి ఏ రకానికి చెందినది వంటి మరిన్ని వివరాలుంటాయి. ఇందులో ఆ భూమి స్వంతదారు పాస్పోర్ట్ ఫొటో, తహసీల్దారు సంతకం కూడా ఉంటాయి.











