మదురై జిల్లాలోని ట్రాన్స్ జానపద కళాకారులకు సంవత్సరంలోని మొదటి ఆరు నెలలు చాలా కీలకమైనవి. ఈ కాలంలో, గ్రామాలు స్థానికంగా జరుపుకునే పండుగలనూ, దేవాలయాలు సాంస్కృతిక కార్యక్రమాలనూ నిర్వహిస్తాయి. కానీ లాక్డౌన్ల సమయంలో, ఎక్కువగా జనం గుమిగూడటంపై విధించిన ఆంక్షలు తమిళనాడులోని సుమారు 500 మంది ట్రాన్స్ మహిళా కళాకారులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి.
అటువంటి మహిళలలో మాగీ కూడా ఒకరు. మదురై నగరానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న విలన్గుడి పట్టణంలో ఆమె నివాసముండే రెండు గదుల ఇల్లు ఆమె వంటి ఇతర ట్రాన్స్ మహిళలకు ఆశ్రయంగానూ, వాళ్ళు కలుసుకునే ప్రదేశంగానూ ఉంటోంది. నాటిన విత్తనాలు మొలకెత్తడాన్ని సూచిస్తూ పాడే సంప్రదాయక కుమ్మి పాట్టు (కుమ్మి పాటలు)ను ఈ జిల్లాలో ప్రదర్శించే కొద్దిమంది ట్రాన్స్ మహిళలలో మాగీ కూడా ఒకరు. తమిళనాడులో ప్రతి ఏడాదీ జూలై మాసంలో పదిరోజుల పాటు ఉత్సవంగా సాగే మూలైపరి పండుగలో, ఈ పాటలను వర్షం కోసం, భూసారం పెరిగేందుకు, మంచి పంటల కోసం ప్రార్థిస్తూ గ్రామ దేవతలకు సమర్పిస్తారు.
ఆమె స్నేహితులు, ఆమెతో పనిచేసేవారు ఈ పాటలకు నాట్యం చేస్తారు. ఇది చాలాకాలంగా వారికొక ఆదాయ వనరుగా ఉంది. కానీ కరోనా లాక్డౌన్ల కారణంగా, జూలై 2020లోగానీ, ఈ నెలలో కానీ ఆ పండుగను నిర్వహించలేదు (చూడండి: మదురైలో జానపద ట్రాన్స్ కళాకారుల విషాదం). వారి ఇతర సాధారణ ఆదాయ వనరు - మదురై చుట్టుపక్కల లేదా బెంగళూరులో కూడా దుకాణాల నుండి డబ్బు వసూలు చేయడం కూడా దాదాపుగా నిలిచిపోయింది. దానితో రూ. 8,000 నుండి రూ. 10,000 వరకూ ఉండే వారి నెలవారీ ఆదాయం, ఈ లాక్డౌన్ల సమయంలో దాదాపు ఏమీ లేకుండాపోయింది.







