"నేను మొదటిసారి ఒక హంగుల్ను చూసినపుడు ఎంతగా మంత్రముగ్ధుడినయ్యానంటే, అసలక్కడి నుంచి కదలలేకపోయాను," గుర్తుచేసుకున్నారు షబ్బీర్ హుస్సేన్ భట్. పుట్టుకతో కశ్మీరుకు చెంది, అంతరించిపోయే తీవ్ర ప్రమాదంలో ఉన్న ఈ జింకను (సెర్వస్ ఎలఫస్ హంగ్లూ) చూసేందుకు ఆయన అదే చోటుకు పదే పదే వచ్చేవారు.
దాదాపు 20 ఏళ్ళ తర్వాత కూడా 141 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ఈ పార్కులోని జంతువులు, పక్షులు, పూల పట్ల తనకు ఎంతమాత్రం మోజు తగ్గలేదని షబ్బీర్ అన్నారు. "నాలో ఆ నెరుసును రగిలించినది హంగుల్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను, అదేగాక హిమాలయాల నల్ల ఎలుగుబంటి కూడా."
పార్కు వద్ద ఆయనను ప్రేమగా 'దాచీగామ్ ఎన్సైక్లోపేడియా' అని చెప్తారు. "నేను ఇప్పటివరకూ ఈ ప్రాంతంలోని 400 జాతుల మొక్కలను, 200కు పైగా పక్షి జాతులను, దాదాపు మొత్తం జంతుజాతులను గుర్తించాను," అని ఆయన PARIతో చెప్పారు. ఈ పార్కులో కనిపించే ఇతర జంతువులలో కస్తూరి మృగం, హిమాలయాల గోధుమవన్నె ఎలుగుబంటి, మంచు చిరుత, బంగారు డేగ ఉన్నాయి.
















