కుర్ర ఒంటె ఖమ్రీ నిర్బంధం తాలూకు దిగ్భ్రాంతి నుంచి ఇంకా కోలుకోలేదు.
"తిరిగి పూర్తి ఆరోగ్యవంతుడవడానికి కొంత కాలం పడుతుంది," అన్నారు కమ్మాభాయ్ లఖాభాయ్ రబారీ.
ఈ పశువుల కాపరి తన మందలోని ఒక చిన్న మగ ఒంటె గురించి మాట్లాడుతున్నారు.
జనవరి 2022లో మహారాష్ట్రలోని అమరావతిలో 58 ఒంటెలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంవంటి అసాధారణ సంఘటనల నేపథ్యంలో అతని గొంతులోని ఆశాభావాన్ని అర్థం చేసుకోవచ్చు. ఒక నెల తర్వాత, ఫిబ్రవరిలో, ఒంటెలను విడిచిపెట్టినప్పటికీ అవన్నీ అనారోగ్యం పాలయ్యాయి.
పోలీసుల అదుపులో వున్నప్పుడు ఆ ఒంటెలకు అవి రోజూ తినే తిండి దొరకలేదని ఒంటెల కాపరులు చెప్పారు. వాటిని ఉంచిన గౌరక్షణ కేంద్రం' కేవలం ఆవుల సంరక్షణకు ఉద్దేశించినది, అక్కడ ఆవుల మేత మాత్రమే ఉంది. "అవి (ఒంటెలు) ఆరుబయట మేస్తాయి. పెద్ద పెద్ద చెట్ల ఆకులను తింటాయి. ఒంటెలు ఆవుల మేత తినవు," అన్నారు కమ్మాభాయ్











