ఉదయం 9 గంటల సమయం. ముంబైలోని ఆజాద్ మైదాన్ సరదాగా వారాంతపు ఆటకు సిద్ధమవుతోన్న యువ క్రికెటర్లతో సందడిగా ఉంది. ఆట సాగుతున్నప్పుడు ఆనందంతోనూ, వేదనతోనూ వేసే కేకలు తరచుగా వినవస్తున్నాయి.
అక్కడికి కేవలం 50 మీటర్ల దూరంలో, 5,000 మంది పాల్గొంటున్న మరో ‘ఆట నిశ్శబ్దంగా సాగుతోంది. ఇది చాలాకాలంగా కొనసాగుతోన్న ఆట. ముంబైలోని ఆజాద్ మైదాన్లో గత నెలలో వేలాదిమంది అధీకృత సామాజిక ఆరోగ్య కార్యకర్తలు (ఆశాలు) - ఆరోగ్య పరిరక్షణ కార్యకర్తలు - చేసే నిరసనలకు కనుచూపుమేరలో ముగింపు ఉన్నట్టుగా కనపడటంలేదు. ఫిబ్రవరి 9న ప్రారంభమైన ఈ ఆందోళనలో మొదటి వారంలోనే 50 మందికి పైగా మహిళలు ఆసుపత్రుల పాలయ్యారు.
రద్దీగా ఉన్న రహదారిని ఒక కంట కనిపెడుతూ, 30 ఏళ్ళు దాటిన ఒక ఆశా నేలపై కూర్చునివున్నారు. ఆమె ఇబ్బందిగా తన చుట్టూ చూస్తూ, దారినపోయే వ్యక్తుల చూపులను తప్పించుకుంటున్నారు. ఒక మహిళల బృందం ఆమె చుట్టూ గుమిగూడి, ఆమె త్వరత్వరగా బట్టలు మార్చుకునేటందుకు వీలు కల్పిస్తూ ఆమెను తమ దుపట్టాలతోనూ, ఒక చాదర్ (దుప్పటి)తోనూ కప్పారు.
కొన్ని గంటల తర్వాత, మధ్యాహ్నపు భోజనం సమయంలో, దహించివేస్తోన్న మధ్యాహ్నపు ఎండలో, ఆశాలు తమ సహోద్యోగి రీటా చావ్రే చుట్టూ గుమిగూడారు. వారిలో ప్రతి ఒక్కరూ ఖాళీ టిఫిన్ డబ్బాలు, పళ్ళేలు, కొంతమంది మూతలు కూడా పట్టుకున్నారు. 47 ఏళ్ళ వయసున్న రీటా తన ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని వారికి అందిస్తున్నందున వారు ఓపికగా తమ వంతు కోసం వేచి ఉన్నారు. "నేను ఇక్కడ నిరసన తెలుపుతోన్న దాదాపు 80-100 మంది ఆశాలకు ఆహారం అందించగలుగుతున్నాను," అన్నారు రీటా. ఈమె ఠాణే జిల్లాలోని తిస్గాఁవ్ నుండి ఆజాద్ మైదాన్కు 17 మంది ఇతర ఆశాలతో కలిసి ప్రతిరోజూ రెండు గంటల పాటు ప్రయాణం చేసి వస్తున్నారు.
“ఏ ఒక్క ఆశా కూడా ఆకలితో ఉండకుండా చూసుకోవడానికి మేం వంతులు వేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు అనారోగ్యానికి గురవుతున్నాం, మేం అలసిపోయాం,” అని ఫిబ్రవరి 2024 చివరిలో PARIతో మాట్లాడుతూ అన్నారు రీటా



















