ఆకాశంలో చీకటిపడే సమయానికి, రంగురంగుల సీరియల్ లైట్లతో అలంకరించిన ఓం శక్తి భారీ కటౌట్ మెరుస్తూ కనులవిందుచేస్తుంది. ఓం శక్తి దేవతను కొలిచే వార్షిక తీమిది తిరువిళా లేదా నిప్పు తొక్కే తిరునాళ్ళను బంగళామేడులోని ఇరులర్లు జరుపుకుంటున్నారు.
మధ్యాహ్నమంతా మండుతూనే ఉన్న చెక్క దుంగల నిప్పులపై నివురు కప్పడం ప్రారంభమవుతుంది; స్వచ్ఛంద సేవకులు ఆ నిప్పులను మెరుస్తున్న పూల మంచాన్ని పోలి ఉండేలా పలుచని పొరగా నేలపై పరచి, ఈ నిప్పులగుండం తీమిదిని 'పూ-మిది' లేదా పువ్వులపై నడక అనిపించే విధంగా ఇరులర్లకు ప్రేరణనిస్తారు.
అక్కడ వీచే గాలిలో కూడా ఆ రోజు కోసం స్పష్టమైన నిరీక్షణ కనిపిస్తుంది. తమ దేవత కాని ఓం శక్తిపై తమ విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఇరులర్లు నిప్పులగుండం తొక్కడాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వందలాదిమంది ప్రజలు అక్కడ గుమిగూడారు. ఓం శక్తిని బలానికీ శక్తికీ ప్రతిరూపంగా తమిళనాడు అంతటా ఆరాధిస్తారు.
తమిళనాడులో షెడ్యూల్డ్ తెగగా జాబితా చేసివున్న ఇరులర్లు (ఇరుల అని కూడా పిలుస్తారు) సంప్రదాయంగా కన్నియమ్మను పూజిస్తారు. కన్నియమ్మను వారు ఏడుగురు కన్యకా దేవతలలో ఒకరిగా భావిస్తారు. కన్నియమ్మకు ప్రతీకగా ప్రతి ఇరులర్ ఇంటిలో ఒక కళసం (కలశం) లేదా మట్టి కుండ ఉంటుంది, దీనిని వేప మండలపై ఉంచుతారు.
























