"నా భయాన్ని ఏమని చెప్పేది? బీతితో నా గుండె దడదడలాడుతుంటుంది. ఎప్పుడెప్పుడు తిరిగి వెల్లడి ప్రదేశానికి వెళ్ళగలనా అనేదానిమీదే నా ఆలోచనలన్నీ తిరుగుతుంటాయి," అంటారు 41 ఏళ్ళ పీతలను వేటాడే జాలరి మహిళ పరుల్ హల్దార్. సుందరవనాలలోని దట్టమైన మడ అడవులలోకి పీతలను పట్టుకోవడానికి వెళ్ళినపుడు తనకు కలిగే భయాలను గురించి ఆమె ఇక్కడ వివరిస్తున్నారు. పీతల వేట జరిగే కాలంలో ఆమె మడ అడవులలోని ఏరుల్లోనూ నీటి కయ్యలలోనూ ఒక పడవను నడుపుకుంటూ - నక్కి వుండే పులుల గురించి ఎంతో మెలకువతో ఉంటూ - వెళ్తుంటారు.
లక్స్బాగన్ గ్రామంలో నివాసం ఉంటున్న పరుల్, తన చెక్క పడవను గరళ్ నదిలోకి నడిపిస్తూ, మరీచ్ఝాపి అడవికి ఇవతలగా ఉన్న గజిబిజి అల్లికల కంచె వైపు చూపు సారించారు. దక్షిణ 24 పరగణాల జిల్లా, గోసాబా బ్లాక్లోని ఆమె గ్రామానికి సమీపంలో ఉన్న ఈ అడవిలోనే పరుల్ భర్త ఇషార్ రణజిత్ హల్దార్ను ఏడేళ్ళ క్రితం పులి చంపేసింది.
దహించే ఆ మండువేసవి రోజున ఆమె, ఆమె తల్లి లొక్ఖి (లక్ష్మి) మండల్ (56) ప్రయాణించి వచ్చిన ఆ పడవ అంచులకు ఆమె తెడ్లను ఆనించిపెట్టింది. తన కూతురిలాగే లక్ష్మి కూడా ఒక జాలరి మహిళే.
ఇషార్ను పెళ్ళి చేసుకునేటప్పటికి పరుల్ వయసు కేవలం 13 ఏళ్ళు. ఆమె అత్తవారి కుటుంబం పేద కుటుంబమే అయినప్పటికీ, వాళ్ళెన్నడూ చేపలను, పీతలను పట్టడానికి అడవికి వెళ్ళినవారు కాదు. "నేనతనికి నచ్చజెప్పి ఈ అడవికి తీసుకువచ్చాను. పదిహేడేళ్ళ తర్వాత అడవిలోనే అతను చనిపోయాడు." ఆమె గుర్తుచేసుకున్నారు.
ఆ జ్ఞాపకాలతో పరుల్ నిశ్శబ్దంలోకి జారిపోయారు. తమ నలుగురు కుమార్తెల పెంపకాన్ని పరుల్కు వదిలేసి 45 ఏళ్ళ వయసులో ఇషార్ చనిపోయారు..
పరుల్, లక్ష్మిలు చెమటలు కక్కుతూ తిరిగి బరువుగా ఉన్న తెడ్లను వేస్తున్నారు. ప్రస్తుతం చేపలు పట్టడాన్ని నిషేధించిన మడ అడవులకు సురక్షితమైన దూరంలో ఆ మహిళలిద్దరూ పడవను నడుపుతున్నారు. చేపలు వృద్ధి అయే వీలుకల్పిస్తూ, మడ అడవుల్లో ఏప్రిల్ నుండి జూన్ వరకూ మూడు మాసాల పాటు చేపలుపట్టడాన్ని ఆపేశారు. చేపలు పట్టే కాలానికి విరామం పలికినపుడు, జీవనం గడవటం కోసం పరుల్ తన సొంత చేరువులోని చేపలనే అమ్ముతుంటారు.












