“ షాలేత్ జయచే... షాలేత్.. వైభవ్.. వైభవ్... షాలేత్...[ బడికి పోవాలని ఉంది... బడికి..] ”
పదమూడేళ్ల ప్రతీక్ ఈ పాటను పదేపదే పాడుతూనే ఉంటాడు అక్కడ కనపడని తన తరగతి జతగాడిని రా రమ్మంటూ. బయట ఆడుకుంటూ కేరింతలు కొడుతున్న పిల్లలను చూస్తూ తమ మట్టిల్లు గడప దగ్గర ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజూ అలా కూర్చొనే ఉంటున్నాడు ప్రతీక్. లేని పక్షంలో ముంగిట్లో ఉన్న చెట్టుకు ఆనుకుని తన ప్రపంచాన్ని వీక్షిస్తూ నుంచుని ఉంటాడు. ఆ గడప, ముంగిలి, ముంగిట్లో ఉన్న చెట్లు, ఆవుల కొట్టం వీటికి మించి అతడి ప్రపంచం విస్తరించలేదు. బడి లేని ఈ పదకొండు నెలలుగా అదే స్థితి.
ఈ ఊళ్ళో మిగతా పిల్లలు ప్రతీక్ తో ఆడుకోరు. “రషీన్ గ్రామ పిలగాళ్లు ప్రతీక్ ఏమిచెబుతున్నదీ అర్థం చేసుకోరు. వాడు ఒంటరి అయిపోతాడు” అని ప్రతీక్ తల్లి శారదా రౌత్ చెప్పింది. ఆమె వయసు 32 ఏళ్ళు. గ్రామంలోని ఇతర పిల్లలకీ, అలాగే తన తొలి సంతానానికీ ప్రతీక్ భిన్నంగా ఉంటున్న లక్షణాలను ఆమె అతడి చిన్నతనంలోనే పసికట్టింది. పదేళ్ల వయసు వచ్చే వరకు అతడు తన భావాలను వ్యక్తీకరించలేక పోయేవాడు. \సంరక్షించుకోలేక పోయేవాడు.
ప్రతీక్ కు ఎనిమిదేళ్ళపుడు డౌన్ సిండ్రోమ్ అనే రుగ్మత స్వల్ప స్థాయిలో ఉందని సోలాపూర్ లోని శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ సర్వోపచార్ రుగ్నాలయ్ వైద్యులు నిర్ధారించారు. సోలాపూర్ అహ్మద్ నగర్ జిల్లా కర్జాత్ తాలూకాలోని తన స్వగ్రామానికి 160 కి. మీ దూరంలో ఉంటుంది. “పదేళ్లు నిండేవరకు ప్రతీక్ కు మాటలు రాలేదు.” అని శారద జ్ఞాపకం చేసుకుంది. “అప్పుడే బడికి పోవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత నన్ను ఆయీ (అమ్మా) అని పిలవడం ప్రారంభించాడు. వాడంతట వాడే మరుగుదొడ్డికి వెళ్తున్నాడు, స్నానం చేస్తున్నాడు. బడి మా వాడికి చాలా ముఖ్యం. వాడు అక్కడే నాలుగు అక్షరాలు నేర్చుకున్నాడు. బడికి వెళ్ళడం కొనసాగితే వాడు మరింత మెరుగవుతాడు. కానీ ఈ మహమ్మారి (కోవిడ్) వచ్చింది!” అంటూ శారద ఆవేదన చెందింది.
మార్చ్ 2020లో కోవిడ్ -19 మొదలయినప్పుడు ప్రతీక్ చదువుతున్న ఆశ్రమ పాఠశాలను మూసేశారు. ఇక్కడ చదివే పాతిక మంది బౌద్ధిక వైకల్యం కల పిల్లల్లో ప్రతీక్ ఒకడు. అందరూ 6 నుంచి 18 ఏళ్ల లోపు మగ పిల్లలే. బడి మూసేసి వీళ్ళందరినీ ఇళ్లకు పంపించేశారు.











