అనరుల్ ఇస్లామ్ తన పొలంలో పనిచేసుకోవడానికి వెళ్లినప్పుడల్లా అంతర్జాతీయ సరిహద్దు దాటవలసి వచ్చేది. అలా వెళ్ళినప్పుడల్లా ఒక సమగ్రమైన ప్రోటోకాల్ను, భద్రతా తనిఖీలను పూర్తిచేయాల్సివచ్చేది. ప్రతిసారీ తన గుర్తింపుకార్డు (ఆయన తన ఓటర్ ఐడీ కార్డును ఉపయోగిస్తారు) అక్కడ సమర్పించి, రిజిస్టరులో సంతకం చేసి అనంతరం ప్రోటోకాల్కి వెళ్లాల్సివచ్చేది. వ్యవసాయం నిమిత్తం ఆయన తీసుకొచ్చే పనిముట్లను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఒకవేళ ఆయన తన ఆవుల్ని కూడా పొలానికి తీసుకువెళ్లాల్సివస్తే, వాటి ఫొటోలను కూడా సమర్పించాల్సివుంటుంది.
“ఒక్కసారి రెండు కంటే ఎక్కువ ఆవుల్ని రానివ్వరు. తిరిగి వచ్చేటప్పుడు నేను సంతకం చేశాక నా డాక్యుమెంట్లను తిరిగిస్తారు. గుర్తింపుకార్డు లేనివారిని ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించరు”, అని చెప్పారు అనరుల్ ఇస్లామ్.
అందరికీ బాబుల్గా పరిచితుడైన అనరుల్ ఇస్లామ్ - మేఘాలయ రాష్ట్రం ఈశాన్య ప్రాంతం లోని గారో హిల్స్ జిల్లా, బగీచా అనే గ్రామంలో నివసిస్తున్నారు. భారత్, బంగ్లాదేశ్ల మధ్య సుమారు 443 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ రాష్ట్ర సరిహద్దు - సుమారు 4,140 కిలోమీటర్ల సుదీర్ఘ అంతర్జాతీయ సరిహద్దు కూడా - ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద సరిహద్దు ఇది. మేఘాలయ హద్దుగా వున్న ఈ ప్రాంతమంతా ఇనుపతీగలు, కాంక్రీట్లతో నిర్మించబడింది.
1980 ప్రాంతాల్లో ఈ ఫెన్సింగ్ వేయకముందు - అనేక శతాబ్దాలుగా ఈ మార్గం స్థానిక గ్రామీణుల ఆర్థికాభివృద్ధికి, వారి జీవనోపాధికి ఎంతగానో ఉపయోగపడేది. భారత ఉపఖండంలో బంగ్లాదేశ్ ఏర్పడిన అనంతరం ఈ రాకపోకలన్నీ స్తంభించిపోయాయి. ఉభయ దేశాల మధ్యా కుదిరిన ఒప్పందం మేరకు, రెండు దేశాల మధ్యా 150 గజాల స్థలాన్ని బఫర్జోన్గా నిర్ణయించారు. సరిహద్దుకు అటూఇటూ దీనిని నిర్వహించాల్సివుంటుంది.
47 ఏళ్ల అనరుల్ ఇస్లామ్ తన వ్యవసాయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఆయనకు ఏడేళ్లున్నప్పుడే తండ్రి అతడిని బడి మాన్పించి తనతోపాటు పొలం పనులకు తీసుకువెళ్లడం మొదలుపెట్టాడు. అతని ముగ్గురు సోదరులకు కూడా భూమి పంపకం జరిగింది. వారు దానిని సాగుచేసుకోవడమో, కౌలుకు ఇవ్వడమో జరిగింది. అతని నలుగురు అక్కచెల్లెళ్లూ గృహిణులుగా వున్నారు.









