"నదిలో వ్యవసాయం చేయటం చాలా సులభం - పంట కోశాక దుబ్బులుగానీ మోళ్ళుగానీ ఇందులో నిలవవు, కలుపు కూడా ఇక్కడ పెరగదు.”
కుంతి పాణే మహాసముంద్ జిల్లా ఘొరారీ గ్రామానికి చెందినవారు. రాయపూర్ జిల్లా నగరి పట్టణానికి సమీపాన ఉన్న ఫరసియా గ్రామం నుంచి ప్రవహించే మహానది నదీతలంపై వ్యవసాయం చేసే 50-60 మంది రైతులలో ఈమె కూడా ఒకరు. "గత పదేళ్ళుగా నేనీ వ్యవసాయం చేస్తున్నాను. నేనూ నా భర్తా కలిసి బెండ, చిక్కుళ్ళు, కర్బూజా వంటి పంటలను ఇక్కడ పండిస్తున్నాం," అని కుంతి (57) చెప్పారు.
తాత్కాలిక అవసరం కోసం గడ్డితో కట్టిన గుడిసెలో కూర్చొని మాట్లాడుతున్నారామె. ఆ గుడిసె ఒక మనిషికు సరిపోయేట్టుగా ఉంది, వాన వస్తే తడవకుండా కాపాడగలిగేంత బలంగానూ ఉంది. అంతకంటే ముఖ్యంగా ఆవులూ, ఇతర జంతువులూ పంటలను తినిపోకుండా రాత్రివేళల్లో కాపలా కాసేందుకు అనువుగా ఉంది.
మహానదిపై నిర్మించిన వంతెన రాయ్పూర్ జిల్లాలోని పారాగాఁవ్, మహాసముంద్ జిల్లాలోని ఘొరారీ గ్రామాలను కలుపుతుంది. పైనుంచి చూస్తే వంతెన కిందుగా ప్రవహిస్తున్న పచ్చని ముక్కలు కనిపిస్తాయి. డిసెంబరు నుంచి మే నెలాఖరులో మొదటి వర్షాలు కురిసే వరకు సాగుచేయడం కోసం రెండు గ్రామాల రైతులు ఇసుకతో కూడిన నదీ తలాన్ని తమ మధ్యన పంచుకున్నారు.














