బట్టీ దగ్గర అనిత, తీరా, అతని కొడుకులిద్దరికీ కలిపి వారానికి వెయ్యి రూపాయలు భత్యం ఇస్తారు. "దాంతోటి మేము బియ్యం, ఉప్పు, నూనె, కూరగాయలు కొనుక్కుంటాం," అన్నారు తీరా. "ఇంకా ఎక్కువ డబ్బు కావాలంటే మేము కాంట్రాక్ట ర్ని అడుగుతాం, అతను ఇస్తాడు." ఈ వారానికొకసారి ఇచ్చే భత్యం, ఎప్పుడైనా అవసరానికి ఇచ్చే అప్పు, ఇంకా ముందే ఇచ్చిన ఎక్కువ మొత్తం అడ్వాన్స్- మొత్తం అన్నీ కలిపి - వాళ్ళు అన్ని నెలలపాటు బట్టీల దగ్గర ఉంటూ తయారుచేసిన మొత్తం ఇటుకలకు చివరలో చెల్లించే కూలీ లోంచి మినహాయించుకుంటారు.
గతేడాది అంటే జూన్ 2019లో వాళ్ళు ఇటుక బట్టీల పనిలోనుంచి చేతిలో యాభై వేల రూపాయలతో తిరిగి వచ్చారు. ఆ డబ్బుతో కొన్ని నెలలు గడిచాయి. కానీ ఈసారి లాక్డౌన్ వల్ల భుయ్యా కుటుంబానికి ఇటుకలు చేసే పని తగ్గిపోయింది. మార్చి నెల చివరికి వచ్చేసరికి వాళ్లకు కాంట్రాక్టర్ నుంచి కేవలం రెండు వేలే చేతికి వచ్చాయి.
అప్పటి నుంచి భుయ్యా కుటుంబం, వాళ్ల సామాజిక వర్గంలోని చాలామందికి లాగే ఇతర ఆదాయమార్గాలు వెతుకుతున్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద కుటుంబంలో ఒక్కొక్కళ్ళకి అయిదు కిలోల బియ్యం, ఒక కిలో దాల్ (పప్పు) ఇచ్చారు. కొంత వెసులుబాటు దొరికినట్టయ్యింది. ఇంకా, వారి అంత్యోదయ అన్న యోజన రేషన్ కార్డుపై (ఆహారం మరియు ప్రజాపంపిణీ శాఖ వర్గీకరించిన "పేదవారిలోకెల్లా పేదవారి కోసం"), కుటుంబానికి ప్రతి నెలా సబ్సిడీ ధరకు 35 కిలోల ధాన్యం వస్తుంది. "అది మా కుటుంబానికి పది రోజులకి కూడా సరిపోదు," అన్నారు తీరా. అతనితో పాటు ఆ కుటుంబంలో అనిత, వాళ్ళ ఇద్దరు కొడుకులు, ఒక కూతురు, ఇద్దరు కోడళ్ళు, ముగ్గురు మనవలు వున్నారు.
తిండి సరుకులు నిండుకునే కొద్దీ, వాళ్ళు మహుగావాన్లోనూ, ఆ చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఏవో చిన్నాచితకా పనులు చేసుకుంటూ, అప్పుడప్పుడు అప్పులు చేస్తూ నెట్టుకొస్తున్నారు.
ఈ ఖరీఫ్ సీజన్లో కౌలుకి తీసుకున్న రెండెకరాల పొలంలో వరి, మొక్కజొన్న పండించడానికి విత్తనాలు, పురుగు మందులు, ఎరువులతో కలిపి దాదాపు అయిదు వేలు ఖర్చయివుంటుందని తీరా, అనితల అంచనా. "నా దగ్గర డబ్బులేమీ లేవు," తీరా అన్నారు. "ఒక బంధువు దగ్గర అప్పు చేశాను. ఇప్పుడు నా నెత్తి మీద చాల అప్పు వుంది."
వాళ్ళు వ్యవసాయం చేస్తున్న పొలం అశోక్ శుక్లాది. అతనికి పది ఎకరాల భూమి వుంది. గత ఐదేళ్లుగా అతను కూడా నష్టాలే చూస్తున్నారు. అందుకు ప్రధాన కారణం వర్షాభావం. "మేము ఏడాదిన్నరా రెండేళ్లకు సరిపడా ధాన్యం పండించుకునేవాళ్ళం,” అని అశోక్ గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు మా కోఠీ (వడ్లు దాచుకునే గది) ఆరు నెలలకే ఖాళీ అయిపోతోంది. నేను దాదాపు 50 ఏళ్లు వ్యవసాయం చేశాను. కానీ, వ్యవసాయంలో భవిషత్తు లేదనీ, వున్నదంతా నష్టాలే అని గత ఐదారేళ్ళు నాకు అర్థంచేయించాయి.”