"కొండ్ర సమ్మయ్య అప్పుల్లో కూరుకుపోవడం వల్ల, మానసిక క్షోభకు గురై విషపూరితమైన పురుగుల మందును సేవించాడు" అని FIRలో పేర్కొనబడింది.
ఆ FIR (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) 2017 సెప్టెంబర్ 17వ తేదీన తరిగోపుల పోలీస్ స్టేషన్లో నమోదు చేయబడింది. అక్కడి నుండి 3 కిలోమీటర్ల దూరంలో నర్సాపూర్ అనే గ్రామంలో సమ్మయ్య, అతడి భార్య కొండ్ర సాగరిక 6 ఎకరాల భూమిలో వర్షపు నీటితో బీటీ-పత్తిని సాగు చేసేవారు.
వాళ్లు తీసుకున్న అప్పు - అందులో బంధువుల నుండి వేర్వేరు వడ్డీ రేట్ల వద్ద తీసుకున్నదే సింహ భాగం - దాదాపు రూ. 5 లక్షలకు చేరుకుంది. వాళ్లు సాగు చేసిన భూమిలో ఒక ఎకరాకు కాస్త ఎక్కువ వైశాల్యం ఉన్నది మాత్రమే వారికి సొంతమైనది, మిగితాది వాళ్ల బంధువుల నుండి కౌలుకు తీసుకున్నది. "ప్రతి సీజన్కు ముందు, రైతులు సాధారణంగా అప్పు తీసుకునే ప్రక్రియలో భాగంగానే అప్పు ఈ స్థాయికి చేరుకుంది" అని సాగరిక చెప్పింది. వాళ్ల నష్టాలకు కరువు కూడా తోడైంది.
తమ సొంత భూమిని సాగు చేయడాన్ని ప్రయత్నించే ముందు, ఆ ఇద్దరూ పత్తి పొలాల్లో వ్యవసాయ కూలీలుగా పని చేశారు. 2011లో పెళ్లి చేసుకున్న తర్వాత, కొంత సమయం పాటు హైదరాబాదులో నివసించారు. అక్కడ సమ్మయ్య డ్రైవరుగా పని చేశాడు. 2013లో సమ్మయ్య తండ్రి అనారోగ్యం పాలవడంతో వారిద్దరూ తెలంగాణాలోని జనగాం జిల్లాలోని నర్సాపూర్ అనే ఊరికి తిరిగి వచ్చారు.
2017 సెప్టెంబరులో ఆత్మహత్య చేసుకునే సమయానికి సమ్మయ్య వయసు 29 ఏళ్లు. సాగరిక వయసు కేవలం 23 ఏళ్లే. వాళ్ల పిల్లలు స్నేహిత, సాత్విక్ల వయసు 5 మరియు 3 ఏళ్లు. "నా భర్తతో నా పిల్లలు గడిపిన క్షణాలను వాళ్లు దాదాపు ప్రతి రోజూ గుర్తు చేసుకుంటారు" అని ఆమె చెప్పింది. "నా భర్త చనిపోయిన తర్వాత ఒక సంవత్సరం పాటు చాలా కష్టంగా ఉండేది. ఫంక్షన్లు వేటికీ నా బంధువులు నన్ను పిలవలేదు. ఇప్పుడు నా కష్టాలు చూసిన తర్వాత నన్ను పిలవడం ప్రారంభించారు..."








